breaking news
India Development Foundation
-
భారత్ అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. టెక్నాలజీతో కొత్త మార్పులు.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్దే ఉంటోందన్నారు.అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
'దేశాభివృద్ధిలో పాలుపంచుకోండి'
న్యూఢిల్లీ: భారత్లో అమలు చేస్తున్న క్లీన్ ఇండియా, గంగా నది ప్రక్షాళన, ఇతర కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్ట్ చేశారు. ఇండియా డెవలప్మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) కార్యక్రమం కింద ప్రవాస భారతీయులు తమ ఆర్థిక సహాయం అందజేయవచ్చని, వీటిని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ ఇండియా, గంగా నది ప్రక్షాళనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు ఉపయోగిస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో నివసిస్తున్నా పుట్టిన దేశంతో తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు ఎన్ఐఆర్ఐలకు ఇదో చక్కని అవకాశమని ఆమె తెలిపారు. భారత అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు చాలామంది ఎన్ఆర్ఐలు ఎదురుచూస్తున్నారని, అలాంటి వారి కోసమే ఈ ఐడీఎఫ్ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పారు. ఎన్ఆర్ఐలు భారత్లోని వివిధ పథకాలకు తమ వంతు ఆర్థిక సహాయం చేసేందుకు గాను ఐడీఎఫ్ కార్యక్రమాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.