breaking news
human emotions
-
పచ్చిగెడ్డి... ఆకలి ఇద్దరికీ ఒకటే!
ఎండ సుర్రని కొడ్తాంది. పిల్లోళ్ళు కాళ్ళకి చెప్పులేసుకోని, టోపీలు పెట్టుకోని, బ్యాటు బాల్లు తీసుకోని కిర్కేట్ ఆడుకున్నేకి పోతాన్నారు. ఇంటి ముందర అరుగుల మింద నీడ పోయి ఎండొచ్చింది.సందులోకి చూస్తే ఎవురూ కనపడల్యా, అందురూ ఎండ తట్టుకోల్యాక ఎవురింట్లో వాళ్ళున్నారు.ఆవులకి నీళ్ళు తాపిద్దామని అమీనా పశువుల కొట్టంలోకి పోయింది. అన్ని ఆవులు బానే ఉండాయి. ఒకే ఒక్క ఆవు మాత్రం ముడ్చుక్కోని పండుకుంది. దాని ముందర ఏసినే ఎండుగెడ్డి అట్లనే ఉంది. కొంచెం కూడా తినల్యా. ఆవుని అట్ల చూస్తానే పాణమంతా ఎట్లో అయింది అమీనాకి. గెడ్డి చేతిలోకి తీసుకోని తినిపించేకి చూసింది. ఆవు అమీనా తుక్కు చూసి చేతిలో ఉన్నే గెడ్డి తినింది.హమ్మయ్య అనుకోని ఇంగ రొంత గెడ్డి తీస్కోని తినిపించింది. ఆవు కొంచేపు తిని మొగం పక్కకి తిప్పుకుంది. కడుగు నీళ్ళల్లో అన్నం, తౌడు కలిపి తీసుకొచ్చింది. అది గూడా రోంత తినింది. ఇంగ సాల్లే అనుకోని నీళ్ళు తాపిచ్చింది. నీళ్ళు తాగి పనుకుంది ఆవు.‘‘ఎంతసేపు ఆ ఆవు దగ్గరే ఉంటావు, ఇంట్లో పని మీ నాయినొచ్చి చేస్తాడా?’’ ఇంట్లో నుండేఅరిసింది అమీనా వాళ్ళత్త హుసేన్ బీ.ఇంకేం ఆలోచన చేయకుండా పరిగెత్తి ఇంట్లోకి పోయింది అమీనా. బట్టలు నానేసి, సామాన్లు కడిగేసి, ఇంట్లో మిగిలిండే పనులు చేసేసి కుచ్చుంది. కిటికీ లోనుండి ఆకాశం కనిపిస్తాంది. దూరంగా విండుమిల్లులు కనిపిస్తాన్నాయి. అవి తిరుగుతా ఉంటే వాటినే చూస్తా చూస్తా అమీనా ఆలోచనల్లో పడిపోయింది.∙∙ అమీనాకి పెళ్ళై సంవత్సరం దాటింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. అమీనా మీద వాళ్ళత్తకున్న కోపానికి అది కూడా ఒక కారణం. సేద్యం చేసే కుటుంబం కావడంతో చిన్నప్పట్నుండి ఆవులు, గేదెలు, ఎద్దులు చూస్కుంట పెరిగింది. పదో తర్తి వరకు ముక్కీ మూలిగి సదివి ‘కాలేజీకి పోను’ అని చెప్పేసింది. ఇంట్లో పనులు చేసుకుంట, సేన్లో పనులు, పాలు పిండేది, పచ్చిగెడ్డి కోసుకొచ్చి పశువులకి పెట్టేది ఒకటని కాదు. ఇంట్లో వాళ్ళమ్మ చేసే ప్రతిపనీ అమీనా కూడా చేసేది.ఒక అన్న, ఇద్దురు అక్కలు. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. వయసులో అమీనా కంటే చానా పెద్దోళ్ళు కావడం మూలాన పెద్దగా మాట్లాడేది కాదు వాళ్ళతో. ఇంటిదగ్గర నేస్తులున్నా, వాళ్ళతో మాట్లాడేదీ తక్కువే. ఎప్పుడూ ఆవుల కొట్టంలోనే. వాటితోనే మాట్లాడేది. అవి తిరిగి మాట్లాడతాయని నమ్మేది. అన్నిటికంటే ఒక ఆవంటే రోంత ఎక్కువిష్టం అమీనాకి.అమీనా వచ్చి పక్కన నిలబడకుంటే ఏం తినేది, తాగేది కాదా ఆవు. ఎవురన్న వచ్చి ‘‘ఇప్పుడంటే ఇట్లుంది. రేప్పొద్దున పెండ్లయి వేరే ఊరికి పోతే ఎట్లమ్మే?’’ అనడిగితే, ‘‘ఎట్ల ఏం ఎట్ల? నాతో పాటు దీన్ని కూడా తీసకపోతా’’ అనేది చానా మామూలుగా.‘‘అట్లయితే పొలం, పశువులు ఉన్నే ఇంటికి, యాదో ఒక పల్లెటూరికి ఇయ్యబడ్తాది’’ అనేటోళ్ళు.‘‘పుట్టిండేది పల్లెటూర్లోనే, పెరిగిండేది ఈడనే. ఇంగ పెళ్ళి చేస్కోని పొయ్యేది పల్లెటూరికైతేనేం?’’ అనేది.‘‘కొంతమంది పొలం, పశువులు లేని ఇంటికి పోవల్ల అనుకుంటారు కదా, అట్ల అన్యాం లే’’ అనంటే, ‘‘నాకట్లాటివి ఏం లేవుబ్బా’’ అనేది.ఒకనాడు బంధువుల్లో ఒకాయప్ప వచ్చి ‘‘తెలిసినోళ్ళ పిల్లోడుండాడు తలారి చెరువులో. కొండమింద ఉంటాది ఆ ఊరు. పొలాలున్నాయి, పక్కనే సిమెంటు ఫ్యాక్టరీలో ఉజ్జోగం కూడా ఉంది, చానా ఆవులు, గేదెలు ఉన్నాయి’’ అని చెప్పినాడు. పెద్దోళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళొచ్చి చూసి పోయినారు, వీళ్ళు పోయి చూసొచ్చినారు. పెళ్ళి ఖాయమైంది. ఆ కొండమిందే ఉన్న హాజివలి దర్గా ఉర్సుకి చానాసార్లు పొయ్యొచ్చింది అమీనా. అదే ఊరికి పెళ్ళి చేస్కోని కోడలి మాదిరి పొయ్యేదంటే భలే సంబరమైంది అమీనాకి. రెండు నెలలు తిరక్కతలికే పెళ్ళయిపోయింది.అమీనా చెప్పినట్లే అత్తారింటికి పోతా పోతా ఆవుని కూడా పిల్చుకోని పోయింది. కొత్త పెళ్ళికూతురు కావడంతో పశువుల కొట్టం తుక్కు పంపీలేదు అమీనాని కొన్నిరోజులు. ఆవు తింటాందో లేదో అనే దిగులు. సరిగ్గా తినలేదు ఆవు.కొన్నిరోజులకి సేన్లో పని, పశువులకి మేత వేసేది, పాలు పిండేది మొదులుపెట్టింది. ఆవు మాత్రం కొంచెం కొంచెమే తినేది. ‘ఎందుకుబ్బా’ అని ఆలోచించుకుంది అమీనా.ఇంటిపనుల్లో, అత్త భయంతో తొందరగా గుర్తుకురాలేదు కానీ, మళ్ళా తెలిసింది అసలు సంగతి. పశువులకి పచ్చిగెడ్డే లేదని. ‘ఎందుకుబ్బా ఇట్లా?’ అనుకోని ఆ పొద్దు అట్లే ఉంది.మరుసటి నా పొద్దు కొడవలి తీసుకోని పచ్చిగెడ్డి కోసరం పోయింది. ఇండ్లన్ని దాటుకొని సేన్ల వైపు నడిసింది. ఎక్కడే గానీ రోంత కూడా పచ్చిగెడ్డి కనపరాల్యా. ఒక్కో సేను దాటుకోని పోతాంది. శనగలు, కుసాలు, ఆముదం తప్పించి వేరే పంట లేదు. ఎంతదూరం పోయినా ఇదే కత.విండు మిల్లులు దాటి పోయింది. అవి నిదానంగా తిరుగుతా ఉంటే వాటి తుక్కే చూసుకుంట నిలబడిపోయింది. తన జీవితం కూడా వాటి మాదిరే, అంత నిదానమైపోయినట్లు అనిపిస్తాంది. లోపలంతా ఏందో తెలియని నిస్సత్తువ. నడిసినంత దూరం నడిసి ఇంగ చేతకాక ఎనక్కి తిరిగింది. దర్గా దగ్గర నీడలో కొంచేపు కుచ్చుంది. ఉత్త చేతులతో ఇంటికొచ్చింది. ‘ఏందిబ్బా ఇంత తమాషా!’ అనుకుంది. ఇంట్లో అత్తని అడుగుదామనుకుంది. ఆయమ్మ మాట్లాడేది తక్కువా, అరిసేది ఎక్కువా అని మానుకుంది.సాయంకాలమైనాక ఇంటి పక్కన ముసిలాయమ్మొచ్చి బయట అరుగు మింద కుచ్చుంది. కసువు నూకుదామని పరక తీస్కోని బయటికొచ్చిన అమీనాని చూసి ‘‘ఏం పాపా, ఎట్లున్నావు?’’ అని ఎచ్చరిచ్చింది.‘‘బాగున్నా అవ్వా, నువ్వెట్లున్నావు?’’ అనడిగింది అమీనా.‘‘ఊరు పొమ్మంటాంది, కాడు రమ్మంటాంది. అట్లనే బతుకుతాండా’’ అని చెప్పింది ముసిలాయమ్మ.అమీనాకి నవ్వొచ్చింది కానీ ఆపుకోని ‘‘కాపీ తాగినావావ్వా?’’ అనడిగింది.‘‘ఇంగా లేదుమ్మా, కాపీ మాటేం గానీ నువ్వు కొడవలి తీసుకోని యాడికో పోతివే పొద్దన. సేను కాడికా?’’ అనడిగింది ముసిలాయమ్మ.‘‘అవునువ్వా, పశువులకి రోంత పచ్చిగెడ్డి ఏమన్నా దొరుకుతాదేమోనని పోతిని. యాడే గాని కనపరాల్యా’’ అని చెప్పింది కసువు నూక్కుంట.ముసిలాయమ్మ నగింది. నోట్లో మిగిలినే నాలుగు పళ్ళు కనిపిచ్చేటట్లు నగింది.‘‘ఏం వ్వా, అట్ల నగుతాన్నావ్?’’ అనడిగింది అమీనాకి అర్థంకాక.‘‘ఈ ఊర్లో పచ్చిగెడ్డి యాడిది పాపా. ఎనభై ఏళ్ళయింది నేను పుట్టి. ఈ ఊర్లోనే పుట్టి, ఈడే పెండ్లి చేస్కోని కాపురం చేసినా. నా పిల్లోళ్ళ పిల్లోళ్ళు కూడా పెద్దగైనారు. ఈ పొద్దుటిదాంక పచ్చిగెడ్డి అనేదే పెట్టింది లేదు పశువులకి’’ అని చెప్పి ఆపింది.ముసిలాయమ్మ ఏం చెప్తాందో అర్థం కాలేదు అమీనాకి.మళ్ళా ముసిలాయమ్మే ‘‘మనూరు కొండమింద గదా ఉండేది. బోరుకి నీళ్ళు పడవు. పడినా తాగేకి సరిపోతాయి గానీ సేద్యానికి సాలవు’’ అని చెప్పింది.దావెంబడి ఎంతసేపు నడిసినా శనగలు, కుసాలు, ఆముదాలే ఎందుకు కనపడినాయో అప్పుడర్థమైంది అమీనాకి.‘‘ఈ మాటే తెలీదువ్వా నాకు’’ అనింది అమీనా.‘‘తెలీక ఏం పాపా, కొండ మింద ఉన్నే ఊర్లో ఇట్లే ఉండేది.’’‘‘ఏమో, మా ఆవు వట్టిగెడ్డి సరిగ్గా తినడం ల్యా. మా ఊర్లో పచ్చిగెడ్డి బాగలవాటు. అందుకే దొరుకుతాదేమో అని పోతిని’’ కసువు నూకేది అయిపోయింది.‘‘యాడ పచ్చిగెడ్డిలే పాపా, పశువుల గురించి ఆలోచిస్తేనే పాపం అనిపిస్తాది. ఈ ఊర్లోని పశువులకి అసలు పచ్చిగెడ్డి అనేది ఒకటుంటాదని గూడా తెల్దు. శనగపొట్టు, సొప్ప, కడుగునీళ్ళల్లో అన్నం కలిపి పెట్టేది, పశువుల దాణా నీళ్ళల్లో కలిపి పెట్టేది – ఇవే తిండి. పాపం ఇవి తినే, పాలు ఇంతగా ఇస్తాన్నాయి. ఇంత ఆరోగ్గెంగా ఉంటాన్నాయి. ఇంగ పచ్చిగెడ్డి గనక దొరికితే ఇంగెన్ని పాలిస్తాయో, ఇంగెంత ఆరోగ్గెంగా ఉంటాయో...’’ అని చెప్తా పోతాంది ముసిలాయమ్మ.కసువు దిబ్బలో పోసొచ్చి పక్కనే కుచ్చుంది అమీనా.‘‘పెళ్ళికో, తిరుణాలకో వేరే ఊరు పోతే ఆడున్నే పశువులని చూసి ఇవి ఎంత అదృష్టం చేసుకున్నాయో అనుకుంటా. మనూరి పశువులు గుర్తుకొస్తాయి అప్పుడు. మనూరోళ్ళు ఎవురన్నా పశువులని కొండ కిందున్నే ఊర్లకి అమ్మితే పచ్చిగెడ్డి తిని బాగా బతుకుతాయిలే ఇంగ అనుకుంటారు. ఎంతో అవసరమయితే తప్ప వేరే ఊరి నుండి మనూరికి పిల్చుకోని రారు.ఈడే పుట్టిండేటివి అయితే ఇట్లే అలవాటు పడతాయిలే. అట్లాటిది మీ ఊరి నుండి తెచ్చినావు పాపా ఈ ఆవుని. యాడ అలవాటైతాది?’’ అనడిగింది అమీనాని.‘‘అదేవ్వా, నేను కూడా అదే అనుకుంటాన్నా నువ్వు చెప్తాంటే’’ అనింది అమీనా.ముసిలాయమ్మ ముందుకి వంగి ‘‘అవు పాపా, మీయత్త బానే ఉంటాదా నీతో, గొడవలేం పడదా?’’ అనడిగింది గుసగుసలాడుతున్నట్లే.అమీనా ఆ పక్కా, ఈ పక్కా చూసి ఎవరూ లేరని నిర్ధారించుకోని సన్నగా ‘‘ఏం చెప్పేదిలేవ్వా. చానా అద్మానం మనిషి. అన్నం ఎక్కువసేపు తింటే గొడవే. అందరికన్నా ముందే తిన్నా గొడవే. తిండిలేని చోటు నుండి చేసుకొచ్చుకున్యాం. అదీ ఇదీ అని ఎన్ని మాటలంటుందో’’ అని చెప్పింది.‘‘అంటే అనుకోనీలే పాపా, నువ్వు ఆయమ్మ నోటికి తగలాకు. గొడవేస్కుందంటే ఇంగ అయిపాయ. పనికి పోయినే సాట ఆయమ్మని ఎచ్చరించల్లన్నా భయమే...’’ అని చెప్పి చిన్నగ అరుగు మింది నుండి లేసింది ముసిలాయమ్మ.ఎట్లా పచ్చిగెడ్డి దొరకదని తెలిసినాక ఇంగ ఉండే వాటిల్లోనే ఆవు ఏమి బాగ తింటుందో చూసి కడుపు నిండా కాకపోయినా ఒకరకంగా తినేటట్టు ప్రయత్నిస్తాంది అమీనా.అట్లనే ఆరు నెలలు గడిసిపోయినాయి. ఆవుకి ఇంగా అలవాటు కాలేదు ఊరు. అమీనాకి అప్పుడప్పుడే అలవాటయితాన్నాయి ఆ ఇల్లు, అత్త తిట్లు. ‘‘ఏమ్మా, ఏమన్నా విశేషమా?’’ అని అడిగేటోళ్ళు ఎక్కువైనారు. ఇంగా ఏమీ లేదు అని చెప్పేకి సాలయితాంది అమీనాకి. ఇంగో వైపు వాళ్ళత్త. కొంచేపు కుచ్చోని కనిపిస్తే సాలు యాదో ఒక పని చెప్తుంది. చేసేది కొంచెం ఆలస్యమైనా నోటికొచ్చిండేది తిడ్తుంది. ఆ తిట్టేది గూడా పని చేసేటప్పుడు కాక అన్నం తినేకి కుచ్చుంటానే మొదులుపెడ్తుంది. ఆ తిట్లు తినుకుంట అన్నం లోపలికి పోదు. చెయ్యి కడుక్కోని మళ్ళా పనిలో పడిపోతుంది అమీనా.మొగునికి చెప్పి చూసింది, లాభం లేదు. పుట్టింట్లో వాళ్ళకి చెప్పి చూసింది. ‘‘మామూలేమ్మా ఇంగా, సర్దుకుపోవల్ల’’ అని చెప్పినారు. ఎవరికీ పట్టినట్టు అనిపించల్యా. ఇంగో పక్క ఆవు పరిస్థితి బాల్యాకుండా పోతాంది. జీవితమంతా ఎట్లో అనుకుంటే, ఇంగెట్లో పోతాన్నెట్లు అనిపిస్తాంది.ఇంట్లో పని, సేన్లో పని, పశువుల పని ఈ మూడింటితోనే సరిపోతాంది. పెండ్లిగాకముందు కూడా చేసేది ఇవే పనులే అయినా ఏందో ఇప్పుడంతా మారిపోయినట్లు అనిపిస్తాంది. చుట్టూ యాడ చూసినా పచ్చటిపొలాలు కనపడే ఊరి నుండి వచ్చినే అమీనాకి ఆ సిమెంటు ఫ్యాక్టరీ, ఆ విండు మిల్లులు, గెడ్డి లేని సేన్లు చూస్తాంటే ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చి పడినానో అనిపిస్తాంది.ఊర్లో ఉన్నెప్పుడు సేనుకి పోయి వస్తా వస్తా పెన్నేట్లో ఆడుకున్నేది గుర్తుకొస్తాది. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు పచ్చిగెడ్డి మోపు తీసుకొచ్చి పశువులకి పెట్టేది గుర్తుకొస్తాది. టీవీ ఆన్ చేస్కోని తట్టలో అన్నం, పప్పు, చెనిక్కాయల పొడి, నెయ్యి పెట్టుకోని టీవీ చూస్కుంట ఎంచేపు కావల్సింటే అంచేపు తినేది గుర్తుకొస్తాది. కాపీ చేస్కోని లోటాలో ఏస్కోని బయట అరుగుమింద కుచ్చోని తాగేది గుర్తుకొస్తాది.మళ్ళా ఇంతకుముందు మాదిరి ఎప్పుటికైనా అయితాదా అని ఆలోచించీ, ఆలోచించీ ఒక నిర్ణయానికొచ్చింది. తనకెట్లా తప్పదు. యాదో ఒకరోజు తనకి నచ్చినట్లు మార్చుకోనీకి ప్రయత్నించల్ల.అప్పుటిదాకా ఇట్లనే. కానీ ఆవెందుకు ఆకలికి ఉండల్ల. దాని తిండిని, దాని ఆరోగ్యాన్ని నా మూలాన ఎందుకు దూరం చేయల్ల అనుకుంది.పుట్టింటోళ్ళని పిలిపిచ్చింది. ఆవుని తీస్కోపొమ్మని చెప్పింది. ఒకనాడు లగేజ్ ఆటో తెచ్చి ఆవుని తీసకపోయినారు పుట్టింటోళ్ళు. చానా బాధ పడతానే పంపింది. ఆవు పోనంటే పోనని మొండికేసి పోయింది.ఆరోజంతా ఏడూస్తానే పండుకుంది అమీనా. మళ్ళా ఇంటికి పోన్ చేసి ‘ఆవెట్లుంది, బాగా తింటాంద్యా లేదా’ అనడిగింది. ‘బాగా తింటాంది, ఇప్పుడు బాగుంది’ అని చెప్తే సంబరపడిపోయింది.ఆవిప్పుడు కడుపు నిండా తింటాంది, అమీనా తినేది ఎప్పుడో..!?- మొహమ్మద్ గౌస్ -
ఏడుపు కూడా మంచిదే, లేదంటే గుండెపోటు వస్తుంది
మనుషులు ఏడవ లేక పోవటం వల్ల నవ్వుతారు అంటాడు జార్జ్ బెర్నార్డ్ షా. నిజమే కదా! పిల్లలు కింద పడి దెబ్బతగిలితే ఏడుస్తారు. పెద్దవాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. పైకి ఏడవరు. ఎవరు ఏమనుకుంటారో అని సంకోచం. ఇతరుల అభిప్రాయాల కోసం బతకటం అలవాటు అవుతుంది ఎదుగుతున్న కొద్దీ. చిన్న పిల్లలకి ఆ బాధ లేదు. తమ నొప్పి మాత్రమే వాళ్ళకి ప్రధానం. భావాలని దాచుకోవటం తెలియదు. అవసరం లేదు. బాల్యావస్థ దాటి ఎదుగుతున్న కొద్దీ ఇతరులు తనని గురించి ఏమనుకుంటున్నారో అన్న దానికి ప్రాధాన్యం ఇవ్వటం ఎక్కువ అవుతూ ఉంటుంది. తన ప్రవర్తన మార్చుకునే ఉద్దేశం ఉండదు గాని, అందరు తనని గొప్పవాడుగా భావించాలనే తపన ఉంటుంది. దాని కోసమే నటించటం. ఏడుపు వచ్చినా దాన్ని అదుపులో పెట్టి, బాధాప్రకటనకి ఒక మాధ్యమం కావాలి కనుక ఏడుపునే నవ్వుగా మార్చటం జరుగుతుంది. తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ ఆ సంఘటనకి రకరకాల చిలవలు పలవలు చేర్చటం కూడా చూస్తాం. తాను కావాలనే పడినట్టు చెప్పటమో, అదే బండి అయితే అది బాగుండ లేదనో, బాగు చేయటానికి ఇస్తే సరిగ్గా చేశారో లేదోనని పరీక్ష చేయబోయాననో చెపుతూ ఉంటారు. ‘‘అసలు దెబ్బ తగలనే లేదు’’, ‘‘ఇట్లాంటివి ఎన్ని చూశాం? ఇదొక లెక్కా?’’ వంటి వ్యాఖ్యానాలు విషయాన్ని తేలిక చేయటానికి చెప్పినా చెప్పకపోతేనే మర్యాదగా ఉండేది అనిపిస్తుంది. ఇది నేలమీద పడటం అన్నదానికి సంబంధించింది మాత్రమే కాదు. అన్ని విషయాలకి వర్తిస్తుంది. ఆర్థికంగా కాని, వ్యాపారపరంగా కాని, ఉద్యోగపరంగా కాని, కుటుంబపరంగా కాని, మరేదైనా కాని, దెబ్బ తగిలినప్పుడు గుట్టుగా ఉండటం మంచిదే కాని, అదేదో ఘనతగా చెప్పుకోవటం హర్షణీయం కాదు. ఏడిస్తే చూసి సంతోషించేవారు, ఓదార్చి తృప్తిపడే వారు ఉంటారు. మరింత నైతిక ధైర్యాన్ని దిగజార్చే వారూ ఉంటారు. కనుక బాధ పడుతున్నట్టు చెప్పకూడదు. అసలు విషయం ఏమంటే బాధపడకూడదు. పైకి నవ్వేసి లోపల బాధతో కుమిలి పోవటం మంచిది కాదు. ప్రస్తుతం మనం సమకాలిక సమాజాన్ని గమనించినట్టయితే చాలా మంది మనుషులు నవ్వుతూ కనపడటం ఏడవ లేక మాత్రమే అని అర్థం అవుతుంది. ఆ నవ్వులలో ఏ మాత్రం స్వచ్ఛత కనపడదు. లోపల ఉన్న బాధని, దుఃఖాన్ని, కష్టాలని, దిగులుని, నిరాశా నిస్పృహలని తెచ్చిపెట్టుకున్న నవ్వు వెనక దాచి కనపడతారు. ఆ నవ్వుల్లో జీవం ఉండదు. సహజత్వం ఉండదు. నవ్వు ఒక ముసుగు. నటులు ముఖానికి వేసుకున్న రంగు లాంటిది. మనోభావాలని యథేచ్ఛగా ప్రకటించ కలిగితే, కనీసం ఆత్మీయుల ముందు గుండెల్లో ఉన్న బరువు తగ్గుతుంది. తరువాత హాయిగా నవ్వగలుగుతాం. ఏడవటం తప్పు కాదే! మనిషికి సహజంగా ఉన్న లక్షణం. ఒకరు బాగుపడుతుంటే చూసి ఏడవటం తప్పు కాని, కష్టం వచ్చినప్పుడు ఏడవటం మానవ సహజం. శ్రీరామచంద్రుడంతటి వాడే తండ్రి మరణవార్త విని భోరున విలపించాడు. అది మానవత్వం. బాధ కలిగినప్పుడు ఏడిచి మనసులో ఉన్న బాధని బయటికి వెళ్ళగక్కకపోతే ఎన్నోరకాల అనారోగ్యాలు వస్తాయి. గుండె బరువుని తగ్గించి తేలిక పరచకపోతే అది గుండెపోటు, రక్తపోటు, మధుమేహం మొదలైన రూపాంతరాలు చెందుతుంది. నవ్వు ముఖకండరాలకి మంచి వ్యాయామం. శరీరానికి ఆరోగ్యం. మనస్సుకి రసాయనం ఎదుటివారికి ఆహ్లాదం. అట్లా ఉండాలంటే ఏడవలేక నవ్వకూడదు. ఆనందంతో నవ్వాలి. – డా. ఎన్. అనంతలక్ష్మి -
నాచన స్థానము
కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ప్రచురించిన ‘నాచన సోముడు’, ఈ ప్రాచీన తెలుగు కవి ‘ఉత్తర హరివంశం’ కావ్యంలోని నానాముఖాలపై రాసిన ఎనిమిది వ్యాసాల సంకలనం. ప్రకాండ పండితులు నడకుదుటి వీరరాజు నూరేళ్ల క్రితమే నాచన సోముని కవితావైభవం గురించి విలువైన రచనలు చేశారు. సోమన్న పూర్వ, ఉత్తర హరివంశాలు రెంటినీ రచించారు. ప్రస్తుతం ఉత్తర హరివంశ మొక్కటే దొరుకుతున్నది. ఎర్రన, సోమన చదివిన సంస్కృత హరివంశం ప్రతులు భిన్నమైనవి. అందువల్లే ఇద్దరూ ఎన్నుకొన్న కథలు వేర్వేరుగా వున్నాయి. నాచన సోముని పక్షపాతి నడకుదుటి వారు. ‘గురువును మించిన శిష్యు’డు అని ప్రశంసించారు. నాచన సోముని భావనాశక్తినీ, లోకజ్ఞతనూ గొప్పగా మెచ్చుకున్నారు. ఎస్.వి.ఎన్.భాష్యకారాచార్యులు సోమన్న సంభాషణా చాతుర్యాన్నీ, సంస్కృతాంధ్ర పదబంధాన్నీ, అలంకార ప్రయోగాన్నీ బహుదా ప్రశంసించారు. విశ్వనాథ సత్యనారాయణ ‘నాచన సోమన– సంవిధాన చక్రవర్తి’ 39 పేజీల సుదీర్ఘ రచన. సోమన సీస పద్య రచనా కౌశలాన్నీ, ఉక్తి వైచిత్య్రాన్నీ, నుడికార ప్రయోగాన్నీ నవీన గుణాలుగా పేర్కొంటూ, ఆ మహాకవి శ్రీనాథుడు, ప్రబంధ కవులకు మార్గదర్శకుడైన విధానాన్ని తేటతెల్లం చేశారు. నాచన తన పాత్రల్లో సమకాలీన జనుల చిత్తవృత్తుల్ని చొప్పించి, పౌరాణిక పాత్రల్ని సమకాలీన పాత్రలుగా చిత్రించారని ఆరుద్ర అన్నారు. రాణీ హయగ్రీవ శర్మ, సోమన వస్తు చిత్రణా, వర్ణనా వైవిధ్యం వివరించారు. వేదుల కామేశ్వరరావు ‘నాచన సోముడు– ఎర్రన’ వ్యాసం, రాళ్లపల్లి వారి ‘నాచన సోముని నవీన గుణములు’లోని విషయాల్నే ప్రస్తావిస్తుంది. కొలకలూరి ఇనాక్ ‘నాచన సోముని కవితావైభవం’, ఎం.గోవిందస్వామి నాయుడు ‘నాచన సోముని శ్రీకృష్ణ పాత్ర చిత్రణ’ వ్యాసాలు సామాన్యంగా ఉన్నాయి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ‘నాచన సోముని నవీన గుణములు’, ‘ఆంధ్ర వాఙ్మయమున నాచన సోమన కీయదగిన స్థానము’ వ్యాసాల్ని కూడా ఈ గ్రంథంలో చేర్చివుంటే పసిడికి పరిమళం అబ్బినట్లు అయివుండేది. -పినాకిని నాచన సోముడు (విమర్శా వ్యాసాలు); సంపాదకులు: డాక్టర్ మూల మల్లికార్జున రెడ్డి; పేజీలు: 140; వెల: 100; ప్రతులకు: సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడప. ఫోన్: 08562–25517 -
కంగారు ఆభరణాలు
జమీందారు వెళ్ళి అరగంటయిన తరువాత సేవకుడు పరుగెత్తుకొని వచ్చి ‘దొరసానిగారూ? ఖజానా తాళపుచేతుల గుత్తి మీవద్దనే యున్నదట, దొరగారు మరచి వెళ్ళినారు. తొందరగా తీసుకొని రమ్మని నన్ను పంపినారు’ అని పలికినాడు. చెన్న పట్టణమందలి షాహుకారుపేట లక్ష్మికి నివాస స్థలము. ఒకనాడుదయము జగజీవన్ లాల్ నాలుగంతస్థుల మేడ యెదుట రెండు గుఱముల కోచి బండి నిలచెను. బండిలో వెనుక ప్రక్కనొక పురుషుడును, అతని భార్యయు గూర్చుండియండిరి. వారికి నెదుట నైదారు నెలల పిల్లవాని నెత్తుకొని యొక దాసి కూర్చుండి యుండెను. బండి వెనుక చిత్రమైన దుస్తులు ధరించిన గుఱపు వాండ్రిద్దరు నిలిచి యుండిరి. బండికి ముందు భాగమున నెత్తుగనున్న యాసనముపై కోచిమన్, వాని ప్రక్కన మరియొక సేవకుడును గూర్చుండియుండిరి. యజమానుడు తన జేబులో నుండి విజిటింగ్ కార్డు నొకదానిని తీసిచ్చెను. జగజీవన్ లాల్ ఆ కార్డును చూచుకొని రాజా ఆఫ్ నర్సాపూర్ అని చదివి తత్తరపాటుతో బండియొద్దకు వచ్చెను. ఈ వర్తకుడు రవ్వలు, కెంపులు, పచ్చలు, వైఢూర్యముల వర్తకమే చేయుచుండును. పుష్యరాగముల వంటి తక్కువ వెలగల రాళ్ళనుగాని, వెండి బంగారములను గాని ముట్టనే ముట్టడు. అతని పద్దులన్నియు వేలు లక్షలు. రాజులు, మహారాజులితని వద్ద లక్షల కొద్ది వెల గల రాళ్ళను తీసికొని పోవుచుండిరి. అతడు బండి సమీపమునకు వచ్చిన తోడనే, సేవకుడు బండి తలుపుల దీసెను. బండిలో నుండి జమీందారు దిగి, షాహుకారుతో షేక్ హాండు చేసి ‘మీరేనా జగజీవనలాలు షేట్జీగారు’ అని యడిగెను. ‘కుబేరుని తరువాత తామే కుబేరులని వినియున్నాను’. ‘మీ వంటి రాజాధిరాజుల యనుగ్రహముండ నేను కుబేరుడనే, దయచేయుడు’ అని మాట్లాడుకొనుచు వారిద్దరును లోనికి పోయిరి. జమీందారు భార్యయు, పిల్లను నెత్తుకొన్న దాసియు లోనికి ప్రవేశించిరి. ఈ జమీందారుడు ఇంగ్లిషు ఫ్యాషన్ గలవాడగుటచే తన భార్యకు ఘోషా లేకుండజేసినట్లు కానవచ్చుచున్నది. ఘోషా లేదుకాని, యీమెకు వంటిమీద నగలు మాత్రము పరిమితముగా నుండెను. మెడలోనున్న సూర్యహారమే యొక పదివేలు, చంద్రహారమే పదియైదు వేలు చేయవచ్చును. కాళ్ళకున్న బంగారు పాంజేవులు అయిదువేలయిన ఖరీదు చేయవో? దాసి భుజముపై నిద్రించుచున్న బాలునికి మిక్కిలి విలువగల నగలు పెట్టబడెను. మేడమీద గొప్ప గొప్ప రాజుల కొఱకై అలంకరించబడిన హాలులోనికి దీసికొనిపోయి జమీందారు నొక కుర్చీమీద కూర్చుండబెట్టి అతని భార్యకు కొంచెము చాటుననున్న యొక స్థలమును చూపించెను. జగ: ‘అయ్యా, తమ రాజధాని ఏ జిల్లాలోదండి.’ జమీం: ‘మా సంస్థానము గోదావరి జిల్లాలోనున్నది. మేము కలక్టరును చూచుటకు వెళ్ళినపుడు పదిహేను ఫిరంగులు కాల్చెదరు. వెండి కుర్చీల మీదగాని మేము కూర్చుండము. కానీ నేనింగ్లిషు యెడ్యుకేటెడ్ జంటిల్మన్ అయినందున ఈ పిచ్చి ఆచారములు పాటింపను. టట్ నాన్సెన్సు అని మా ఆడవారి ఘోషా కూడా తీసివేసితిని. ఈ సంగతులకేమి గాని నిన్నటిదినము జయపురము మహారాజు మీవద్ద కొన్న లక్ష రూపాయల జవాహిరి చూచితిని. వారికి నాకు మిక్కిలి స్నేహము.’ జగ: ‘చిత్తము, మహారాజులంగారికి నాయందు మిక్కిలి అనుగ్రహము.’ జమీం: ‘రవ్వలంటే మీ వద్దనే రవ్వలు, ఏమి ఆ కాంతి? ఇంకను అట్టి రవ్వలు గలవా?’ జగ: ‘కొనువారుండిన రవ్వలకేమి తక్కువ. తెప్పించెదనా?’ అని అడిగి, లేచి లోనికి బోయి సేవకునిచే నొక పెద్ద ట్రంకు పెట్టెను పట్టించుకొని వచ్చి బల్లమీద పెట్టి దానిందెఱిచి రవ్వల పొట్లము నొకటి వెనుక నొకటి తీయుచు జమీందారు గారికి చూపదొడగెను. ఇవి బాగున్నదని బాగుండ లేదనియు జెప్పుచు, దీని వెల యెంత దాని వెల యెంత అని అడుగుచు ‘మీరు మిక్కిలి సత్యసంధులని జయపుర మహారాజా గారు నాతో చెప్పినంతనే వచ్చితిని. క్రమమైన వెల జెప్పవలయును సుమా’యని నడుమ నడుమ ననుచు తనకు చక్కగ గానుపించిన వానిని భార్య వద్దకి తీసుకొనివెళ్ళి చూపుచు మరల దెచ్చును. గంట వఱకు బేరము చేసెను. తుద కేబది వేల రవ్వలను బేరము చేసి విడిగా తీయించెను. షాహుకారు జమీందారు రత్నపరీక్ష జ్ఞానమునకు యాశ్చర్యమందుచు నడుమ నడుమ అతనిని పొగడుచుండెను. ఇట్లు సిసలు పఱిచిన రవ్వలనన్నింటిని చిన్న చిన్న పొట్లములుగా గట్టి ఆ పొట్లముల నన్నింటిని జమీందారు తనయొద్దనున్న పెద్ద మనీగాన్లో పెట్టి దానిని తన జేబులో నుంచుకొని షాహుకారుతో నిట్లనియె. ‘అయ్యా, అప్పనగా నాకు చీదఱ. కొన్న సరుకులకు వెలవెంటనే ఇయ్యవలయునని నా తాత్పర్యము. ఇంటి నుండి బయలుదేరునప్పుడు మీవద్దకు రావలెనని యనుకొనలేదు. ఈ త్రోవన మఱియొక చోటికి పోవుచుండగా నదియే మీ యిల్లని మా బండివాడు చెప్పెను. మిమ్ముల చూడవలెనని యాగితిమి. చూచినందుకు లాభమేయైనది. నిచ్చటికి వచ్చెదమని తలంపనందున పైకము తేలేదు. నేను యింటికి వెళ్ళి పైకము తీసుకొని వచ్చెదను. అంతవఱకు మన వాండ్రిక్కడనే యుండెదరు. తండియార్పేట వఱకు మనవాళ్లను తీసుకొని వెళ్ళవలసిన పనివున్నది. కావున ఇప్పుడు వీని నింటికి తీసుకొని పోవుట యెందుకు’ అని చెప్పి యాతడు లేచి భార్యతో నే వచ్చువఱకు నీ విక్కడనే యుండుమని చెప్పి కోచిబండి నెక్కి వెళ్ళిపోయెను. భార్యాపుత్రులను యుంచి వెళ్ళుటకు జమీందారు గారొక కారణము చెప్పినను, జగజీవనలాలు మాత్రమా కారణమును నమ్మక, జమీందారు మిక్కిలి మర్యాదగల వాడగుటచే, తన నమ్మకమునకై వారిని తన ఇంట దించిపోయెనని తలచి, సంతసించెను. జమీందారు వెళ్ళి అరగంటయిన తరువాత సేవకుడు పరుగెత్తుకొని వచ్చి ‘దొరసానిగారూ? ఖజానా తాళపుచేతుల గుత్తి మీవద్దనే యున్నదట, దొరగారు మరచి వెళ్ళినారు. తొందరగా తీసుకొని రమ్మని నన్ను పంపినారు. ప్రొద్దెక్కుచున్నది. పైకము తెచ్చి షాహుకారుగారికిచ్చి మనము తండియార్పేట వెళ్ళవలసి యున్నది’ అని పలికెను. అంతనామె తాళపు చేతుల గుత్తి వానిపై వేసి తొందరగా పొమ్మని యాజ్ఞాపించెను. వాడు పదియడుగులు వేయగా మరల వానిని బిలిచి ఏమో యాలోచించి ‘గుత్తి నిటుతే’యని, ‘దినములు మంచివి కావు. లక్షల కొలది ధనమున్న ఖజానా తాళపుచేతులు వీనికిచ్చి పంపిన వీడేమి చేయునో? వీడు నమ్మిక కలవాడే గాని ధనముజూచిన ఎట్టి వారికి దుర్బుద్ధి పుట్టకమానదు. ఏమండీ షాహుకారుగారూ నిజమేనా?’ అని యడుగగా నాతడు ‘నిజమే నిజమే. డబ్బునెడల బహు జాగ్రత్తగా నుండవలెను’ అని తల యూపెను. ‘అట్లయిన నేనే తాళపుచెవుల గుత్తిని తీసుకొని వెళ్ళి పైకము తీసుకొని మేమిద్దఱము వచ్చెదము. నేను వచ్చు వఱకు అబ్బాయి పాలకేడ్చునేమో కావున కొంచెము పాలిచ్చి వెళ్ళెదనని ‘సీతా సీతా’యని దాసిని పిలిచెను. దాసి పిల్లవానిని జోలపాడి నిద్రబుచ్చుచు మేడ క్రింద నొంటరిగా నుండెను. దాని జోల పాట మాత్రము పైకి వినబడుచుండెను. పిలిచిన తోడనేయది పిల్లవానిందీసికొని యజమానురాలి వద్దకు వచ్చెను. పిల్లవాని శరీరమంతయు నగలతో నిండియుండెను. రవ్వల, కెంపుల, పచ్చల పతకములు వ్రేలాడుచు ముఖమును కప్పివేసి యుండెను. యామె వానికి పాలిచ్చి యొక చిన్న పరుపు దెప్పించి వానినచ్చట బరుండబెట్టి భద్రమని దాసికి జెప్పి తన శరీరము మీది యేబది యరువది వేల విలువగల నగలను తీసి యాపిల్లవాని ప్రక్కనే యుంచి ‘మీ నమ్మిక కొఱకు వీనినిక్కడ నుంచుచున్నానని’ షావుకారుతో చెప్పెను. ‘కోటి వెలగల మీ కుమారునే ఇచ్చట నుంచుచున్నపుడు వేరే నగలుంచవలయునా? ఒకరిపై నొకరికి నమ్మకం లేని యెడల కలియుగ మెట్లుసాగు’నని, ‘మీరు వెళ్ళుటకు నా కోచిబండిని తెప్పింతునా’ అని యడిగెను. అచటనున్న సేవకుడు ‘అక్కర లేదు. నేను నడచి వచ్చిన తాళపు చేతి గుత్తి తీసికొని వచ్చుట కాలస్యమగునని నా యజమానుడు నన్ను కోచిబండి మీదనే పంపెను’ అని చెప్పెను. యజమానురాలు వెడలిన కొంతసేపటికి దాసి షాహుకారు వద్దకు వచ్చి ‘అయ్యా బీదదానిని. మా దొరవారు మీ యొద్దనెన్నో రాళ్ళు కొన్నారు. మీకింత లాభమైనప్పుడు నాకు కొంచెము యీనామియ్యకూడదా? దొరసానితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను’ అని పెక్కు మాటలు చెప్పి ఎప్పుడెవ్వరి కేమియు నియ్యని లుబ్ధాగ్రేసర చక్రవర్తియగు జగజీవనలాలు యొద్దనుండి యొక రూపాయి బహుమానము వడసెను. రూపాయి చేతిలో పడగానే ‘అయ్యా, కల్లుగాని, సారాగాని త్రాగనిది యుండలేము. మా దొరగారికి దొరసాని గారికీ పేరన్న గిట్టదు. నెలదినముల నుండి లేక చచ్చిపోవుచున్నాను. వారు వచ్చువఱకు ఈ ప్రక్క యంగడిలోనికి పోయి పావులా సారా తాగి వచ్చెదను. నిముసములో వచ్చెదను. అంతవఱకు చిన్నదొరగారికి కొంచెము చూచుచుండుడి. నిద్రలో ఏడ్చెనేని కొంచెము జోకొట్టుడి’ అని చెప్పి వెడలిపోయెను. పది గంటలాయెను. పదునొకండు గంటలాయెను. పండ్రెండు గంటల సమయమై ‘ధమ్మ’ని ఫిరంగి మ్రోత వినబడెను. షాహుకారుకు సంశయము పుట్టదొడగెను. కడుపున పుట్టిన బిడ్డను, ఇంత ధనముని విడిచి వారేల పోయెదరని సమాధానము చేసికొనెను. నొంటిగంటయ్యె. అప్పటికైనను, ఎవ్వరు తిరిగి రాలేదు. నిద్రబోవుచున్న పిల్లడైనను యేడువలేదు. ఆహారము లేక సొమ్మసిల్లెనేమోయని షాహుకారు పిల్లవాని యొద్దకుపోయి నెత్తుకొని చూడ యాశ్చర్యము! అది పిల్లవాని యంతయాకారము గల యొక జాతి బొమ్మ!! షాహుకారు సేవకులనందఱిని పిలిచి చూపెను. వారందఱును అదియొక మోసమని తెలిసికొని ‘మోసమైన మనకేమి, మనరాళ్ళ వెలకంటె మించిన నగలున్నవి’ యని నగలకు మదింపు వేయసాగిరి. ఒక్కోనగ తీసి చూచిన కొలదిని అవి గిల్టు నగలేకాని నిజమైనవి కావని స్థిరపడెను. నగలన్నియు నూరు రూపాయల కంటె వెలచేయవు. పోలీసు వారికీ సమాచారమును తెలిపిరి. పోలీసువారు కొందఱును జగజీవనులాలు సేవకులు కొందఱును మాఱు వేషములతో నర్సాపురము వెళ్ళి విచారించి, నర్సాపురపు జమీందారీ సృష్టియందెచ్చటను లేదని తిరిగివచ్చిరి. ఎంతమంది జమీందారులనో మోసపుచ్చిన తనను ఈ బూటకపు జమీందారు మోసపుచ్చె గదాయని చింతించుట తక్క జగజీవనులాలుకు మఱియేమి యుపాయమును లేకపోయెను. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877–1923) కథ ‘ఏబది వేల బేరము’కు సంక్షిప్త రూపం. కె.రామానుజరావు అనే కలంపేరుతో రాశారు. ఆంధ్రపత్రికలో 1910లో ప్రచురితం. సౌజన్యం: వికీపీడియా. కొమర్రాజు తెలుగు, మరాఠీ భాషల్లో సమాన పండితుడు. సంస్కృతం, హిందీ, బెంగాలీ, గుజరాతీ భాషల మీదా పట్టుంది. శివాజీ చరిత్ర, హిందూ మహాయుగము, ముస్లిం మహాయుగము రాశారు. హైదరాబాద్లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలు వెలువరించారు. వ్యక్తి కాదు, సంస్థ అనిపించుకున్నారు. అనారోగ్యంతో 46 ఏళ్లకే మరణించారు. తొలి తెలుగు కథారచయిత్రి భండారు అచ్చమాంబ ఈయన అక్క. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు -
గుర్రాలకు మనుషుల ఎమోషన్స్ తెలుసు
న్యూయార్క్: గుర్రాలకు కూడా మనుషుల హావభావాలను గుర్తించే సామర్థ్యం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మనుషుల్లోని ఆనందం, కోపాన్ని అవి పసిగట్టగలవని, అందుకు అనుకూలంగా ప్రవర్తించగలవని యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్ తెలిపింది. కోపంతో ఉన్న మనుషులను చూస్తే అవి ప్రతికూలంగా స్పందిస్తాయని కూడా అధ్యయనకారులు తెలిపారు. దాదాపు 28 దేశీయ గుర్రాలను తమ పరిశోధనకోసం తీసుకున్న అధ్యయనకారులు తమ చేతుల్లో కోపం, సంతోషంతో ఉన్న వ్యక్తుల ఫొటోలను పట్టుకొని వాటికి చూపించారు. వాటిని ఆ గుర్రాలు ఎడమ కంటితో చూడటం మొదలుపెట్టాయి. ఎడమ కన్ను అనేది జంతువుల్లో కుడి పక్కన ఉన్న మెదడు నియంత్రణ ద్వారా పనిచేస్తుంది. అయితే, నెగటివ్ షేడ్స్ను దానిలో ప్రతిబింబింప చేయడంలో కీలక పాత్ర పోషించేది కూడా కుడి మెదడే కావడం విశేషం. ఈ నేపథ్యంలో కోపంతో ఉన్న మనుషులను గుర్రాలు గుర్తించి వారి విషయంలో నెగిటివ్గా స్పందిస్తాయని ఈ ఫొటోల ఆధారంగా అధ్యయనకారులు అంచనా వేశారు. ఇది ఏ జంతువులకు లేకుండా ఒక్క గుర్రానికి మాత్రమే ఉన్న అదనపు సామర్థ్యం అని కూడా వారు తెలిపారు. -
వివేకం: భావోద్వేగాలే సుందరం!
భావానుభూతి మనిషి జీవితానికొక సుందర పార్శ్వం. అదే లేకపోతే జీవితం అందవిహీనమౌతుంది. కానీ ఏ విషయమైనా స్వాధీనంలో లేకపోతే ఉన్మాదానికి దారితీస్తుంది. ఇదే అసలు సమస్య. మీ భావోద్వేగం మీకనుగుణంగా ఉండాలంటే ఏ విధంగా మలుచుకోవాలనుకుంటారు? నాకు భావోద్వేగాల్ని వాంఛితాలు, అవాంఛితాలు అని వర్గీకరించాలని లేదు. అవి జీవితానికి ఎంతవరకు తోడ్పడుతాయన్నదే నేను చూస్తాను. మీ భావోద్వేగాలు మీ కుటుంబానికిగానీ, ఉద్యోగానికిగానీ, వ్యాపారానికిగానీ తోడ్పడుతున్నాయా? మీరెప్పుడూ కోపంతోనో, నిరాశా నిస్పృహలతోనో, ద్వేషంతోనో కలవరపడుతూ ఉంటే మీకు బాగుంటుందా? అలా కాకుండా, మీ భావోద్వేగాలు ఆనందంగా, ప్రేమమయంగా, దయాపూరితంగా ఉన్నాయనుకోండి. అవి మీకెంతో తోడ్పడతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నేను నాకేది తోడ్పడుతుందో దాన్నే పట్టించుకుంటాను. మన జీవితానికే విధంగానూ సహకరించనిదాన్ని తలకెత్తుకోవడంలో అర్థమేముంది? ప్రాణికోటిలో ప్రతి ఒక్కటీ తాను జీవించడానికి ఏం చెయ్యాలో అదే చేస్తోంది. మరి మనిషికేమిటి సమస్య? ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలుంటాయి. భావోద్వే గాలు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకమని ఎవరన్నా అంటే, వారే ఆ తర్వాత మీ శరీరం కూడా దానికి ఆటంకమంటారు. ఒక విధంగా చూస్తే అది కూడా నిజమే. మీ శారీరక, మానసిక, భావోద్వేగ శక్తులన్నీ మీ ఎదుగుదలకు ఇబ్బందిగా ఉండొచ్చు లేదా అవే మీ ఎదుగుదలకు సోపానాలు కూడా కావొచ్చు. అదంతా మీరు వాటినుపయోగించే పద్ధతిని బట్టి ఉంటుంది. ఈ శరీరాన్నీ, బుద్ధినీ, మనసునీ మీ జీవితానికి అవరోధాలుగా భావిస్తారా లేక మీ అభ్యున్నతికి వాటిని నిచ్చెనమెట్లుగా మలుచుకుంటారా? ఈ మూడూ అవరోధాలైతే ఈ ప్రపంచంలో బతకడానికి ఈ మూడు ధర్మాలే కదా ఆధారం! కొన్ని లక్షల సంవత్సరాల పరిణామక్రమం తర్వాత, మన బుద్ధి ఈ స్థాయికి చేరింది. మరి ఇప్పుడు ఈ బుద్ధిని సమస్యగా భావించగలమా? బుద్ధి సమస్య కాదు. బుద్ధిని సరిగా వినియోగించలేకపోవడమే సమస్య. మానవ మేధ నిజంగా అత్యాశ్చర్యకరమైంది. కానీ ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సాధనమే సమస్యగా మారింది. అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికిగానీ, నియంత్రించడానికిగానీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదన్నమాట! మీ భావోద్వేగాలు మీ ఆలోచనలకు విరుద్ధమైనవి కావు. మీ ఆలోచనా సరళిని బట్టే మీ అనుభూతి కూడా ఉంటుంది. ఆలోచన శుష్కమైందీ, అనుభూతి రసవంతమైనదీ. మీ ఆలోచనకు విరుద్ధంగా మీ భావోద్వేగాలు ఉండవు. ‘ఈయన భరించలేని వ్యక్తి’ అని తలచాక అతడి పట్ల మీలో కోమల భావోద్వేగాలు కలిగే అవకాశముంటుందా! సమస్య - పరిష్కారం ధ్యానం అంటే సమయాన్ని వృథా చేయడమా అనిపిస్తోంది. నాకు దానివల్ల ఏమీ లాభం కనబడటం లేదు. - పి.సంపత్కుమార్, వరంగల్ సద్గురు: మీరు ఈ ధ్యానం వల్ల ఉపయోగం ఏమిటి అన్న ఆలోచన వదిలిపెట్టాలి. దాని మూలంగా మీకేమీ రానక్కరలేదు. మీకేమీ ఉపయోగం ఉండనవసరం లేదు. మీరు రోజూ కొంత సమయం వృథా చేయండి. అలా చేయడం నేర్చుకోండి, అది చాలు. దాని మూలంగా ఏదో కానక్కరలేదు. ధ్యానం చేయడం ద్వారా మీరేదో ఆరోగ్యంగా కానక్కరలేదు, మీకేదో జ్ఞానం రానక్కరలేదు, మీరేదో స్వర్గానికి పోనక్కరలేదు, అది కొంత సమయం వృథా చేయడమే అనుకోండి. ధ్యానం వల్ల మీకు కావలసినది అసలైనదైతే నాకు లాభమేమిటి, నాకు ఒరిగేదేమిటి అని లెక్కలు వేయకండి. మీరు ఈ లెక్కలేయడం ఆపేస్తే, 90 శాతం పని అయిపోయినట్లే. అంటే చివరి వరుసకు చేరినట్లే. ఒకసారి చివరి వరుసకు చేరారంటే ఇక అక్కడ మిమ్మల్ని మింగేసే పాములుండవు. మీరు దాటవలసినది, ఎక్కవలసినది ఒక్కొక్క మెట్టు మాత్రమే. సమయం వచ్చినప్పుడు అది కూడా దానంతట అదే జరిగిపోతుంది.


