breaking news
Hoisting
-
25న అయోధ్యలో మరో ఉత్సవం.. ప్రధాని మోదీ హాజరు
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయం.. నవంబరు 25(మంగళవారం)న మరో ముఖ్య ఘట్టానికి వేదిక కానుంది. ఆరోజున ఆలయ శిఖరంపై ధ్వజారోహణ (పవిత్ర జెండాను ఎగురవేసే) కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక చారిత్రాత్మకంగా నిలిచిపోనున్నది. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి అయినందుకు గుర్తుగా జరిగే ఈ వేడుక కోసం ఆలయంతో పాటు పట్టణమంతా ఇప్పటికే సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.ప్రధాని మోదీ చేతుల మీదుగా శుభ ముహూర్తంలో పవిత్రమైన ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. మంగళవారం ఉదయం 11.52 నుండి మధ్యాహ్నం 12.35 గంటల మధ్య శుభ ముహూర్తంలో ఈ వేడుక జరగనుంది. ఇదే సమయంలో హెలికాప్టర్ల నుంచి ఆలయ శిఖరంపై పూలను జల్లేందుకు ఏర్పాట్లు చేశారు. 21 మంది వేద ఆచార్యులు, శంఖం పట్టిన స్వచ్ఛంద సేవకుల నడుమ ప్రధాని మోదీ ఈ పవిత్ర జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రధాని మోదీతో పాటు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.2024 జనవరిలో రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ప్రధాన ఆలయ నిర్మాణ పనులు దశలవారీగా జరుగుతున్నాయి. మంగళవారం జరగబోయే ఈ చారిత్రక వేడుకకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఏడువేల మంది అతిథులను ఆహ్వానించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత బృందాలను ఆహ్వానించింది. అలాగే ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించిన కొందరు ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. అతిథులంతా ఈ వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: దడ పుట్టించిన కాబూల్ విమానం -
Independence Day- 2024: ఆ 13 గ్రామాల్లో తొలిసారి మువ్వన్నెల జెండా రెపరెపలు
భారతదేశంలో నేటివరకూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయని కొన్ని ప్రాంతాలు ఉన్నాయని తెలిస్తే ఎవరికైనాసరే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిజం.. ఛత్తీస్గఢ్లోని నక్సల్ ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని 13 గ్రామాల్లో నేటి వరకూ జాతీయ జెండాను ఎగురవేయలేదు. ఈరోజు (పంద్రాగస్టు) ఈ గ్రామాల్లో మువ్వన్నెల జండా రెపరెపలాడనుంది.ఈ వివరాలను రాష్ట్ర పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు. ఈ గ్రామాల్లో నూతన భద్రతా బలగాల శిబిరాలు ఏర్పాటు చేసిన దరిమిలా అభివృద్ధికి మార్గం సుగమమైందన్నారు. బస్తర్ రీజియన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ సుందర్రాజ్ ఈరోజు (గురువారం) నెర్ఘాట్ (దంతెవాడ జిల్లా), పానిదోబిర్ (కంకేర్), గుండం, పుట్కేల్, చుత్వాహి (బీజాపూర్), కస్తూర్మెట్ట, మస్పూర్, ఇరాక్భట్టి, మొహంది (నారాయణపూర్), టేకలగూడెం, పువర్తి, లఖపాల్, పూలన్పాడ్ (సుక్మా) గ్రామాల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు.గత ఏడాది గణతంత్ర దినోత్సవాల అనంతరం ఈ ప్రాంతాల్లో భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసినట్లు సుందర్రాజ్ మీడియాకు తెలిపారు. కొత్త క్యాంపుల ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపు వచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాజధాని రాయ్పూర్తో సహా అన్ని జిల్లాల్లో సన్నాహాలు పూర్తి చేశారు. గురువారం ఉదయం రాయ్పూర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి జాతీయ జెండాను ఎగురవేయనున్నారని అధికారులు తెలిపారు. -
పాకిస్థాన్ జెండా కలకలం!
నలందః బీహార్ లో పాకిస్థాన్ జెండాను ఎగురవేయడం కలకలం రేపింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత నియోజకవర్గం నలంద జిల్లాలోని ఓ ఇంటిపై రెపరెపలాడుతున్న పాక్ జెండా స్థానికంగా ఆందోళనను కలిగించింది. ఓ వ్యక్తి ఇంటిపై ఎగురుతున్న జెండాను చూసిన స్థానికులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులనుంచీ జెండాను స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. బీహార్ నలంద జిల్లా ఖరాదీ కాలనీలోని ఓ ఇంటిపై పాక్ జెండా ఎగరడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి తన ఇంటిపై ఎగురవేసిన పాకిస్థాన్ ఫ్లాగ్ చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు వచ్చేలోపే సమాచారం అందుకున్నస్థానిక ప్రైవేట్ ఛానల్స్ అన్వరుల్ ఇంటిపై నెలవంక ఉన్న ఆకుపచ్చ జెండా ఎగరడాన్ని ప్రసారం చేశాయి. ఛానల్స్ లో సైతం ఆకుపచ్చ జెండా ప్రసారం కావడంతో విషయాన్ని తెలుసుకున్న ఎస్డీఓ సుధీర్ కుమార్, డిఎస్పీ మొహ్మద్ సైఫుర్ రెహ్మాన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునే లోపే కుటుంబ సభ్యులు జెండాను తొలగిచడంతో వారి ఇంట్లో సోదాలు జరిపి కుటుంబ సభ్యులనుంచీ జెండాను స్వాధీనం చేసుకున్నారు.అయితే తన ఇంటిపై జెండాను ఎగురవేసిన నిందితుడు అన్వరుల్ హక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరిపి, నిజంగా ఆ జెండా పాకిప్థాన్ జాతీయ పతాకమా కాదా అన్నవివరాలను సేకరిస్తామని ఎస్డీవో సుధీర్ కుమార్ తెలిపారు. అయితే మొహర్రం సందర్భంలో తమ ఇంటిపై ఈ జెండాను ఐదేళ్ళుగా ఎగురవేస్తున్నట్లు అన్వరుల్ హక్ కుమార్తె షబానా తెలిపింది. అన్వరుల్ హక్ ప్రత్యేక వేడుకలకు, వివాహాల సందర్భాల్లోనూ టెంట్లు, ఫర్నిచర్ సప్లై చేసే వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో నిందితుడు.. ప్రస్తుతం పరారీలో ఉన్న హక్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం గాని, ఇతరులెవర్నీ అరెస్టు చేయడం గానీ జరగలేదని ఎస్డీవో వెల్లడించారు. ఇదిలా ఉంటే... ఛానల్స్ లో వార్త ప్రసారం అవ్వడమే తడవుగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. అయితే ఈ సంఘటనపై ఆరా తీసి, దోషులను శిక్షించాలని సీనియర్ బీజేపీ నాయకుడు సీపీ ఠాకూర్ డిమాండ్ చేశారు. బీహార్ ను మరో జమ్మూ కాశ్మీర్ లా మార్చే ప్రయత్నం చేయొద్దని, బీహార్ లో ఇటువంటి జాతి వ్యతిరేక చర్యలకు కేంద్రం వెంటనే ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.


