‘108’ నిర్వహణ ఇక సర్కార్దే: రాజయ్య
పరిగి: జీవీకే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. అందుకే ఇకపై 108 సేవలను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలనే ఆలోచన చేస్తోందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ పరిగిలో విలేకరులతో మాట్లాడారు. 108, 104 సేవలతో పాటు ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృత పరుస్తామన్నారు. ప్రస్తుతం లక్షా 25 వేల జనాభాకు ఒకటి చొప్పున 108 వాహనాలుండగా ఇకమీద 75 వేల జనాభాకు ఒకటి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.
ఇందుకోసం 600 కొత్త వాహనాలు కొనుగోలు చేస్తామన్నారు. 104 వాహనాలు మండలానికి ఒకటి కేటాయిస్తామన్నారు. నాలుగేళ్లలో అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆస్పత్రుల అభివృద్ధికి రూ.552 కోట్లు కేటాయించామన్నారు. వైద్యులు కూడా మిగతా ఉద్యోగుల్లాగే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. పీహెచ్సీలను సీహెచ్ఎన్సీలుగా, సీహెచ్ఎన్సీలను ఏరియా ఆస్పత్రులుగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు.