breaking news
Governor of Maharashtra
-
గవర్నర్తో కంగన భేటీ
ముంబై: అధికార శివసేనను, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను తీవ్రంగా విమర్శిస్తున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో సమావేశమయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్కు వివరించి, న్యాయం చేయాలని కోరానని ఆ తరువాత ఆమె వెల్లడించారు. ‘గవర్నర్ని కలిశాను. ఒక పౌరురాలిగా ఆయనను కలిసేందుకు వచ్చాను. ఒక కూతురుగా నన్ను చూశారు. నా సమస్య విన్నారు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు’ అని గవర్నర్తో భేటీ అనంతరం కంగన వ్యాఖ్యానించారు. సోదరి రంగేలితో కలిసి ఆమె రాజ్భవన్లో కోశ్యారీని కలిశారు. ఆ సందర్భంగా గవర్నర్కు ఆమె పాదాభివందనం చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ముంబైపై, ముంబై పోలీసులపై కంగన తీవ్ర విమర్శలు చేశారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోలుస్తూ ఒకసారి, మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులకు భయపడ్తున్నానని మరోసారి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. ఇది ముంబై పోలీసులను అవమానించడమేనని, ముంబైకి రావద్దని కోరుతున్నామని సేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో బాంద్రాలోని కంగన కార్యాలయ భవనాన్ని అక్రమ నిర్మాణమని పేర్కొంటూ బీఎంసీ(బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. ఆ తరువాత, శివసేనపై, ఉద్ధవ్ఠాక్రేపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముంబైని అవమానించిన వారికి మద్దతా? ముంబైని పీఓకేతో పోలుస్తూ అవమానించిన కంగనకు బీజేపీ మద్దతిస్తోందని, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ అలా వ్యవహరిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ముంబై ప్రాముఖ్యతను దెబ్బతీసి, నగరాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందని సామ్నా పత్రికలోని తన కాలమ్ ‘రోక్తోక్’లో పేర్కొన్నారు. మరాఠా ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం ఇదన్నారు. కంగన వ్యాఖ్యలను ఖండిస్తూ మహారాష్ట్రకు చెందిన ఒక్క బీజేపీ నేత కూడా ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. కంగన వ్యాఖ్యలను బాలీవుడ్ నటులెవరూ ఖండించకపోవడాన్ని ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో మౌనంగా ఉన్న పాండవులతో పోల్చారు. ‘ముంబై వల్ల పేరు, డబ్బు అన్నీ సంపాదించుకున్న మీరు.. అదే ముంబైని సహ నటి విమర్శిస్తే ఖండించరా? డబ్బే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు. నటుడు అక్షయ్కుమార్ మినహా ఎవరూ దీనిపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గవర్నర్.. సాగర్జీ
జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లావాసిని తొలిసారి గవర్నర్గిరీ వరించింది. బీజేపీ సీనియర్ నేత సీహెచ్. విద్యాసాగర్రావు మహారాష్ట్ర గవర్నర్గా నియమితు లయ్యారు. సాగర్జీకి ఉన్నత పదవితో జిల్లావ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. విద్యార్థి నాయకుడిగా ప్రారంభ మైన ఆయన ప్రస్థానంలో ఎన్నో విజయాలున్నాయి. శాసనసభాపక్ష నేతగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగానూ సేవలందించారు. ఇటీవల కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడంతో అనూహ్యంగా సాగర్జీని గవర్నర్గా నియమించింది. విద్యార్థి నేత నుంచి... విద్యార్థి దశ నుంచే ఏబీవీపీ నాయకుడిగా విద్యాసాగర్రావు గుర్తింపు పొందారు. 1972లో ‘లా’ చదువుతుండగా.. ఏబీవీపీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ‘మీస’ చట్టం కింద అరెస్టై ఏడాదిపాటు జైలు జీవితం తర్వాత జనసంఘ్లో రాష్ట్ర, జాతీయస్థాయి రాజకీయల్లో క్రియాశీలక పా త్ర పోషించారు. మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి (1985, 1989, 1994) ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారు. మూడుసార్లు బీజేపీ శాసనసభాపక్షనేతగా పనిచేశారు. జాతీ య నాయకత్వం ఆదేశాలతో 1998లో కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 1999లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అదే సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా మళ్లీ ఎన్నికయ్యారు. అప్పుడే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. కొన్నాళ్లు వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయమంత్రిగానూ పనిచేశారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏడు ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించడంలో ప్రధాన భూమిక పోషించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నుంచి పోటీచేసిన విద్యాసాగర్రావు తన మేనల్లుడు, టీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్కుమార్ చేతిలో ఓటమి పాలయ్యా రు. ప్రధాని మోడీతో సాగర్జీకి సన్నిహిత సం బంధాలున్నాయి. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పటేల్ విగ్రహ నిర్మాణం కోసం ఇనుము, ఇతర సామగ్రి సేకరణకు ఏర్పాటు చేసిన ఏక్తా ట్రస్ట్కు తెలంగాణలో విద్యాసాగర్రావే ఇన్చార్జిగా వ్యవహరించారు. కేంద్రం లో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అనూహ్యంగా సాగర్జీని గవర్నర్గిరీ వరించింది. ఇప్పటివరకు పీవీ.నర్సింహరావు మాత్రమే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసి జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో చాటారు. జాతీయస్థాయిలో.. విద్యాసాగర్రావు మహారాష్ట్ర గవర్నర్గా నియమితులు కావడంతో జిల్లాకు తొలిసారి అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటివరకు ఒక్క పీవీ.నర్సింహరావు మాత్రమే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా పనిచేసి జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో చాటి చెప్పారు. ఎమ్మెస్సార్, కాకా కన్న ముందే.. కాంగ్రెస్లో సీనియర్ నేతలు ఎం. సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్) గవర్నర్ పదవి కోసం, జి. వెంకటస్వామి(కాకా)రాష్ట్రపతి పదవి కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. కానీ వారి కల నెరవేరలేదు. వీరికి జాతీయస్థాయిలో పలుకుబడి ఉండటమే కాకుండా ఏఐసీసీలో అత్యున్నత పదవులు అనుభ వించి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలతో నేరుగా పరిచయాలు ఉన్నా.. వీరి ఆకాంక్ష నెరవేరలేదు. పలు సందర్భాల్లో కాకా, ఎమ్మెస్సార్లు ఆయా పదవులపై తమ మక్కువను బాహాటంగానే ప్రకటించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంతో వీరి కల నెరవేరకుండా పోయింది. జిల్లా నుంచి తొలిసారి గవర్నర్గా ఎన్నికైన సాగర్జీ.. పై ఇద్దరు నాయకుల తర్వాతే రాజకీయాల్లోకి రావడం గమనార్హం. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కరీంనగర్ అర్బన్ : విద్యాసాగర్రావుకు మహారాష్ట్ర గవర్నర్ పీఠం దక్కడంతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మెట్పల్లి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, కరీంనగర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగారు. 1999లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏడు ఎంపీ, 12 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకున్నారు. 2003లో వరంగల్ జిల్లా పరకాలలో అమరదామాన్ని నిర్మించారు. గోదావరి నది జలాలు వృథాగా పోతుండడంతో ఆవేదన కు గురైన ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇటీవల నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పటేల్ విగ్రహ ం ఏర్పాటుకు ఏక్తా ట్రస్టు ఆధ్వర్యంలో విద్యాసాగర్రావు ప్రత్యేక దృష్టి సారించి గ్రామగ్రామాన ఇనుము, మట్టి సేకరించారు. గౌరవం దక్కించుకున్న సాగర్జీ ఇటీవల కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీచేసిన విద్యాసాగర్రావు ఓడిపోయారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం.. అప్పటికే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారన్న నమ్మకమున్న విద్యాసాగర్రావుకు గవర్నర్ గిరీ దక్కడం ద్వారా ఆయన తెలంగాణ ప్రాంతం నుంచే తొలిసారి అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్న వ్యక్తిగా చరిత్రకెక్కారు. అంబరాన్నంటిన సంబరాలు.. విద్యాసాగర్రావుకు గవర్నర్ పీఠం దక్కడంతో జిల్లాలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. జిల్లావ్యాప్తంగా స్వీట్లు పంచిపెట్టారు. టపాసులు కాల్చారు. -
మహారాష్ట్ర గవర్నర్ రాజీనామా
మిజోరం గవర్నర్గా బదిలీ చేయడంపై నిరసన ముంబై: మహారాష్ట్ర గవర్నర్ కె.శంకర్నారాయణన్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి పంపించారు. కేంద్ర ప్రభుత్వం మిజోరం గవర్నర్గా పంపించాలని నిర్ణయించడంతో ఆయన పై నిర్ణయం తీసుకున్నారు. మిజోరంకు వెళ్లడం సాధ్యం కాదని, ఇకపై క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటానని కాంగ్రెస్కు చెందిన 82 ఏళ్ల సీనియర్ నేత శంకర్నారాయణన్ వెల్లడించారు. తాను బీజేపీ సహా అన్ని పార్టీలతో సఖ్యతగానే ఉన్నానని, ఇతర గవర్నర్లలా రాజకీయాలు చేయలేదని రాజ్భవన్లో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీన్ని రాజకీయ కక్షసాధింపులా భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. అది మీడియానే నిర్ణయించాలన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గవర్నర్ పదవికి రాజీనామా చేయాలంటూ హోం శాఖ నుంచి సూచనలు అందిన గవర్నర్లలో శంకర్నారాయణన్ ఒకరు. రాజీనామా చేయకపోవడంతో శనివారం ఆయనపై బదిలీ వేటు వేశారు. ఆయన రాజీనామాతో గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ మహారాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. రెండు నెలల్లో నలుగురు..గవర్నర్ల నియామకాల విషయంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోన్న రాజకీయాలకు నిదర్శనంగా నిలిచే దృష్టాంతమిది. మిజోరం గవర్నర్గా శంకర్ నారాయణన్ వె ళ్లుంటే ఆ రాష్ట్రం రెండు నెలలలోపే నలుగురు గవర్నర్లను చూసిన రాష్ట్రంగా గుర్తింపు పొందేది. జూలై 6న అప్పటిగవర్నర్పురుషోత్తమన్ను నాగాలాండ్కు బదిలీ చేశారు. గుజరాత్ గవర్నర్గా ఉన్న కమల బేణీవాల్ను మిజోరంకు గవర్నర్గా పంపించారు. నెలరోజుల్లోపే ఆమెనూ తొలగించి, మణిపూర్ గవర్నరైన వి.దుగ్గల్కు అదనంగా మిజోరం బాధ్యతలు అప్పగించారు. తాజాగా దుగ్గలో స్థానంలో నారాయణన్ను బదిలీ చేశారు.