ట్యాంక్ బండ్పై గ్రేట్ మార్చ్ ఫర్ డెమొక్రసీ
‘నేను సైతం గౌరి’ నినాదంతో నేడు కొవ్వొత్తులతో నిరసన
సాక్షి, హైదరాబాద్: ‘‘నాడు దబోల్కర్, మొన్న కల్బుర్గి, నిన్న పన్సారే, నేడు గౌరీ లంకేశ్. రేపటి వంతు నీదో... నాదో... ఎవరిదైనా కావచ్చు. కారణం ఏదైనా అవచ్చు. ఆవో, గోవో. పేరేదైతేటనేం. మాంసం పేరుతో దాద్రిలో హత్యకు గురైన అఖ్లాక్, వివక్షతో వెలివేతకు గురై ఉరితాడుకు వేలాడిన రోహిత్ వేముల, జేఎన్యూలో మాయమైన నజీబ్, అదేమని ప్రశ్నించినందుకు దేశద్రోహ నేరాన్ని మోస్తోన్న కన్హయ్యకుమార్.. గొంతులేని సామాన్యుల గొంతుగా నిలిచిన గౌరీ లంకేశ్ హత్య.. ఇవి ప్రజాస్వామ్య మనుగడకే మాయని మచ్చ.
అన్ని ఘోరాలూ చూస్తూ, అసహనాన్ని మోస్తూ అన్నింటినీ భరిద్దామా? నడిరోడ్డుపై ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామా?’’.. ఇదే ఇప్పుడు మనముందున్న ప్రశ్న అంటున్నారు ప్రజాస్వామిక వాదులు, పాత్రికేయులు, ప్రజాసంఘాలు. హత్యలతో ప్రశ్నించే గొంతులు మూగబోవని, మరింత బలంగా గొంతు పెగుల్చుకొని నినదిస్తాయని తెలుగు రాష్ట్రాల పౌర ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. దీన్ని చాటి చేప్పేందుకు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై మగ్దూం మొహియుద్దీన్ విగ్రహం వద్దకు తరలిరావాలన్నారు. ప్రజలు, పౌర సంఘాలు, విద్యార్థులు, మహిళలు, సంస్థలు, ప్రజాస్వామిక వాదులు ఈ ప్రదర్శనలో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.