Gold cup cricket tourney
-
రన్నరప్ శాట్స్ సీమర్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో శాట్స్ సీమర్స్ జట్టు చివరి మెట్టుపై బోల్తా పడింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో శాట్స్ సీమర్స్ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకుంది. శనివారం టైటిల్ పోరులో ఆదిలాబాద్ ఆరోస్ 36 పరుగుల తేడాతో శాట్స్ సీమర్స్పై నెగ్గి టైటిల్ను హస్తగతం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ ఆరోస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 136 పరుగులు చేసింది. చరణ్ (48 బంతుల్లో 65 నాటౌట్; 8 ఫోర్లు) దూకుడైన అర్ధసెంచరీతో చెలరేగాడు. అన్వేష్ (24 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్), కన్నా (30 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఫిర్దౌస్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 137 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన శాట్స్ సీమర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 100 పరుగులే చేసి ఓటమి పాలైంది. రిజ్వాన్ (15 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), దిలీప్ (13 నాటౌట్) మినహా మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఆదిలాబాద్ ఆరోస్ బౌలర్లలో మల్లారెడ్డి 13 పరుగులిచ్చి 3 వికెట్లు దక్కించుకున్నాడు. ఉజ్వల్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్లో అదరగొట్టిన చరణ్ తేజ (ఆదిలాబాద్ ఆరోస్) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును అందుకోగా... షోయబ్ (శాట్స్ సీమర్స్) ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచాడు. ఫైనల్ అనంతరం జరిగిన ట్రోఫీ ప్రదాన కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టెస్ట్ క్రికెటర్ ఆబిద్ అలీ, తెలంగాణ క్రికెట్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
తన్మయ్ అగర్వాల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో హెచ్సీఏ ఎలెవన్ బ్యాట్స్మన్ తన్మయ్ అగర్వాల్ (127 బంతుల్లో 131; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. తన్మయ్తో పాటు బౌలర్లు కూడా రాణించడంతో ‘కాగ్’ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్లో హెచ్సీఏ 163 పరుగులతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హెచ్సీఏ ఎలెవన్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 354 పరుగులు సాధించింది. అక్షత్ రెడ్డి (80), కె. సుమంత్ (73), ఆశిష్ రెడ్డి (58) అర్ధసెంచరీలతో రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో ఇంతియాజ్ అహ్మద్, అక్షయ్, పునీత్ యాదవ్ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ‘కాగ్’ జట్టు తడబడింది. హెచ్సీఏ బౌలర్లు సీవీ మిలింద్ (2/37), మెహదీ హసన్ (3/26), ముదస్సిర్ హుస్సేన్ (2/32) ధాటికి 40.4 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. పునీత్ యాదవ్ (40), బిపుల్ శర్మ (33) పోరాడారు. ఆకాశ్ భండారీకి ఒక వికెట్ దక్కింది. ఇతర మ్యాచ్లలో ఆంధ్ర 82 పరుగులతో విదర్భపై, ఎయిరిండియా 17 పరుగులతో హెచ్సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్పై, కేరళ 181 పరుగులతో కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్పై విజయం సాధించాయి.