breaking news
ghanapuram farmers
-
ఘనపురానికి సింగూరు నీరు
మెదక్: సింగూర్ నీటికోసం ఘనపురం రైతులు గతంలోలాగా ఆందోళన బాట పట్టలేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగలేదు. నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు. కానీ సింగూరు నీరు మంజీరకు చేరుతోంది. ఆయకట్టు రైతుల మోములో ఆనందం కనిపిస్తోంది. రైతుల సాగునీటికష్టాలు ముందుగానే ఊహించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఘనపురం రైతుల గోడును ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావుల దృష్టికి తీసుకెళ్లారు. వారం రోజులుగా సాగునీటి విడుదల కోసం తీవ్రంగా కృషి చేశారు. ఫలితంగా బుధవారం సాయంత్రం సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 0.25 టీఎంసీ నీటిని మంజీరకు వదిలారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ ఈఈ జ్ఞానేశ్వర్ ధ్రువీకరించారు. సాగునీటి కోసం ఏటా పోరాటమే 1905లో నిర్మించిన ఘనపురం ప్రాజెక్ట్ కింద సుమారు 30 వేల ఎకరాల సాగుభూమి ఉంది. ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నుంచి న్యాయంగా 4 టీఎంసీల నీరు రావాలి. అయితే శాశ్వత జీఓ లేకపోవడంతో ప్రతి సంవత్సరం పంట పొలాల అవసరాలకనుగుణంగా రైతన్నలు సాగునీటి కోసం పోరుబాట పట్టాల్సి వచ్చేది. ఈ ఏడు ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఎట్టకేలకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి కృషితో ఆగస్టు నెలలో 0.3 టీఎంసీల నీరు విడుదలైంది. అయినప్పటికీ ఘనపురం ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో నిండలేదు. ఉన్న నీటికి వరదనీరు, వర్షాలు తోడు కావడంతో సుమారు 20 వేల ఎకరాల్లో రైతన్నలు వరి పంటలు వేశారు. ఆగస్టు మధ్యలో కురిసిన అడపా దడపా వర్షాలతో వరి పంటలు ఇంతకాలం గట్టెక్కాయి. చాలాచోట్ల వరి పంట నిండు పొట్టతో ఉండగా, మరికొన్ని చోట్ల ఈనుతోంది. ఇంకొన్ని చోట్ల రెండో కలుపు దశలో ఉన్నాయి. అయితే వారంరోజులుగా పంటలకు నీరందని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు ప్రతి నీటిబొట్టుకోసం రాత్రింబవళ్లు పంట పొలాల వద్దే జాగరణ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఎట్టకేలకు అధికారులు బుధవారం సాయంత్రం సింగూర్ నుంచి 0.25 టీఎంసీ నీటిని మంజీర బ్యారేజీలోకి వదిలారు. అక్కడి నుంచికూడా నేడో, రేపో ఘనపురం ఆనకట్టకు నీరు విడుదల చేసే ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. ఇరిగేషన్ ఈఈ ఇచ్చిన ఉత్తర్వులు, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు చేరగానే ఈ నీరు విడుదలవుతుందని తెలిపారు. కాగా ప్రస్తుతం విడుదల చేసిన నీటికితోడు మరో 0.5 టీఎంసీ నీరు విడుదల చేస్తే ఖరీఫ్ గట్టెక్కుతామని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
సింగూరు నీటి కోసం ఎదురుచూపులు
పాపన్నపేట: సింగూరు నీటి కోసం ఘనపురం రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రాజెక్టు నుంచి నీరు వదిలి నాలుగు రోజులైనా.. ఇప్పటికీ నీటి జాడలేక పోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. గత బుధవారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి సింగూరు నుంచి 0.25 టీఎంసీల నీటిని వదిలారు. అయితే ఆ నీరు దిగువన ఉన్న కలబ్గూర్ డ్యాంలో నిల్వ ఉండిపోయాయి. ఈ మేరకు శనివారం రాత్రి ఇరిగేషన్ అధికారులు 0.25 టీఎంసీ నీటిని దిగువకు వదిలినట్లు తెలిసింది. అయితే ఈనీరు 24గంటల తరువాతే ఘనపురం ఆనకట్టను చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ డిప్యూటీఈఈ సురేష్బాబు తెలిపారు. నాలుగు రోజులుగా చినుకులు జాడలేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పాపన్నపేట మండలంలో జోరుగా వరినాట్లు కొనసాగుతున్నాయి. సింగూరు నీటిపై ఆశతో ఘనపురం ఆయకట్టు పరిధిలోని రైతులు సైతం వరినాట్లకు సన్నద్ధమయ్యారు. దీంతో సింగూరు నీరు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా నాట్లు వేస్తేనే పంట దిగుబడి ఆశించినస్థాయిలో వస్తుందని, ఆలస్యమైతే దిగుబడి తగ్గిపోతుందని దిగాలుప డుతున్నారు.