breaking news
Firozabad city
-
విషాదంలో అద్భుతం..లారీ తొక్కి గర్భిణీ మృతి.. సజీవంగా శిశువు జననం
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో విషాదంలో అద్భుతం జరిగింది. లారీ టైర్ల కిందపడి ఎనిమిది నెలల గర్భిణీ మృతి చెందగా ఆమె పొట్టలోని శిశువు మృత్యుంజయురాలిగా ప్రాణాలతో బయటపడింది. ఆ పసికందును హుటాహుటిన ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ పాపకు కేవలం సాదారణ చికిత్స అవసరమని తెలిపారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని బర్తపారా గ్రామంలో గురువారం జరిగింది. మృతురాలు ఆగ్రాకు చెందిన కామిని(26)గా పోలీసులు గుర్తించారు. తన తల్లిగారింటికి భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొట్టినట్లు చెప్పారు. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి బాధితురాలి భర్త లారీని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దాంతో కామిని రోడ్డుపై పడిపోయిందని, లారీ ఆమెపై నుంచి వెళ్లినట్లు చెప్పారు. తల్లి పొట్టలోంచి బయటపడిన చిన్నారి ప్రాణాలతో ఉండటం గమనించి ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం శిశువు, ఆమె తండ్రి చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు లారీపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు ఎస్హెచ్ఓ. త్వరలోనే లారీ డ్రైవర్ను పట్టుకుంటామన్నారు. సంఘటన జరిగిన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. లారీ టైర్ల కింద పడి తల్లి నుజ్జునుజ్జయినా.. పొట్టలోని శిశువు ప్రాణాలతో బయటపడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు స్థానికులు. ఇది ఒక అద్భుతంగా పేర్కొన్నారు. ఇదీ చదవండి: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు -
యూపీలో ఇద్దరు కానిస్టేబుళ్లను కాల్చిన దొంగలు
ఫిరోజాబాద్: యూపీలో ఇద్దరు కానిస్టేబుళ్లను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ఫిరోజాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనతో స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో డీఐజీ సహా పలువురు గాయపడ్డారు. ఇక్కడి రామ్గఢ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి దోపిడీ దొంగలు పారిపోతున్న విషయం తెలుసుకున్న దినేశ్ ప్రతాప్ సింగ్, గిరిరాజ్ కిశోర్ గుజ్జార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని వెంటాడారు. అయితే దుండగులు కాల్పులు జరపడంతో గిరిరాజ్ అక్కడికక్కడే చనిపోగా.. దినేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ జిల్లా ఆసుపత్రి వద్ద సోమవారం ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వారిని అదుపుచేయడానికి ప్రయత్నించిన పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పలు వాహనాలు, షాపులను ధ్వంసం చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఓ పోలీస్ వాహనాన్ని కూడా తగులబెట్టారు. ఈ ఘర్షణల్లో డీఐజీ విజయ్సింగ్ మీనా సహా పలువురు గాయపడ్డారు. హతమైన కానిస్టేబుళ్ల కుటుంబాలకు సీఎం అఖిలేశ్యాదవ్ రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. యూపీలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.