breaking news
Film Review
-
పబ్లిక్ రివ్యూలను అనుమతించొద్దు: విశాల్ విజ్ఞప్తి
సాక్షి, చెన్నై: శ్రీ కాళికాంబాళ్ పిక్చర్స్ పతాకంపై కె.మాణిక్యం నిర్మించిన చిత్రం రెడ్ ఫ్లవర్. నటుడు విగ్నేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో మనీషా జాహ్నవి నాయకిగా నటించారు. వైజీ.మహేంద్రన్, జాన్విజయ్, తలైవాసల్ విజయ్, అజయ్రత్నం ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆండ్రూపాండియన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. కె.దేవసూర్య చాయాగ్రహణం, సంతోష్రామ్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆగస్టు 8న తెరపైకి రానుంది. చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని బుధవారం చైన్నె, వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఇందులో విశాల్, పి.వాసు, స్వరాజ్, ఫైవ్ స్టార్ కదిరేశన్ చిత్ర ఆడియోను ఆవిష్కరించారు. నిర్మాత మాణిక్యం మాట్లాడుతూ ఇది ప్రేమ కథ చిత్రం మాత్రమే కాదని మన దేశ ఉన్నతిని చాటే చిత్రంగా ఉంటుందని చెప్పారు. విశాల్ మాట్లాడుతూ 2025లో జరిగే కథలను చిత్రాలుగా తీయడానికే పలువురు దర్శకులు తడబడుతున్నారని అలాంటిది ఈచిత్ర దర్శకుడు ఆండ్రు 2047లో ఏం జరగనుంది అనే విషయాన్ని తెరపై ఆవిష్కరించారని అన్నారు. నేతాజీకి ఈ చిత్రాన్ని అంకితం ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా థియేటర్ల యాజమాన్యానికి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని, థియేటర్లో చిత్రాలు విడుదలైన మూడు రోజుల వరకు పబ్లిక్ రివ్యూలను అనుమతించరాదని పేర్కొన్నారు. అదేవిధంగా నిర్మాతల సంఘం చిత్రాల రిలీజ్ను కట్టడి చేయాలని తెలిపారు. -
చూడాలంటే భయపెట్టే.. చంద్రిక
సినిమా రివ్యూ: చంద్రిక చిత్రం - ‘చంద్రిక’, తారాగణం - జయరామ్ కార్తీక్, శ్రీముఖి, కామ్నా జెత్మలానీ, గిరీష్ కర్నాడ్, ఎల్బీ శ్రీరామ్, ‘సత్యం’ రాజేశ్ మాటలు - నాగేశ్వరరావు పాటలు - వనమాలి సంగీతం - గుణ్వంత్ కెమెరా - కె. రాజేందర్ బాబు ఎడిటింగ్ - వి. సురేష్కుమార్ కథ, స్క్రీన్ప్లే - సాజిద్ ఖురేషీ నిర్మాత - వి. ఆశ దర్శకత్వం - యోగేశ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు హార్రర్ సినిమాలు చాలా వస్తున్నాయి. అందులో లేటెస్ట్ ఎడిషన్ ఈ ‘చంద్రిక’. వాల్పోస్టర్లలో ‘చంద్రముఖి’ తరహాలో డ్యాన్స్ దుస్తుల్లో హీరోయిన్ కనిపించడం, అలాగే కామ్నా జెత్మలానీ లాంటి పేరున్న తార కూడా నటించడం వల్ల ఈ సినిమా పట్ల కొంత ఆసక్తి నెలకొంది. మరి, ఈ శుక్రవారం వచ్చిన ‘చంద్రిక’ ఆ ఆసక్తికి తగ్గట్లే ఉందా? కథేమిటంటే.. అనగనగా ఒక ఊరు. అందులో ఓ పెద్ద బంగళా. ఆ బంగళాను కొనుక్కున్నవాళ్ళకు చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతుంటాయి. దాంతో, అందరూ భయపడి పారిపోతుంటారు. ఆ పరిస్థితుల్లో ఆ బంగళాను అర్జున్ (తొలి పరిచయం - జయరామ్ కార్తీక్) అనే చిత్రకారుడు కొనుక్కుంటాడు. అది తన గురువైన చిత్రకారుడు రవివర్మ ఒకప్పుడు ఉన్న బంగళా అనీ, అందుకే దాన్ని కొన్నాననీ తన భార్య శిల్ప (తెలుగు యాంకర్, నటి శ్రీముఖి)కి చెబుతాడు. ఆ హవేలీలో ఆర్ట్ గ్యాలరీ పెడదామని అతను అనుకుంటే, ‘లేదు... అక్కడే ఉందామ’ని భార్య అంటుంది. అలా ఆ దంపతులు ఆ బంగళాకు కాపురం మారుస్తారు. అక్కడ నుంచి శిల్ప ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆ మార్పులను భర్త మొదట పట్టించుకోడు. భవంతిలో ఆత్మ ఉందనే సంగతి అతనికీ క్రమంగా అర్థమవుతుంది. ఆ బంగళాలోని ఒక పెద్ద చిత్తరువు (ఆ బొమ్మలో కామ్నా జెత్మలానీ)ని చూపించి, చంద్రికను అనడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. సెకండాఫ్కు వచ్చేసరికి, ఆ చంద్రిక ఎవరనే ప్రశ్న వస్తుంది. ఆ భూతాన్ని వదిలించడానికి వచ్చిన మంత్రవేత్త సమక్షంలో ఫ్లాష్బ్యాక్ ఓపెన్ అవుతుంది. చంద్రిక ఎవరనే విషయం అడిగిన మంత్రవేత్తతో హీరో జరిగిన కథ చెప్పడం మొదలుపెడతాడు. ఆ బంగళా ప్రసిద్ధ చిత్రకారుడు రవివర్మ (గిరీష్ కర్నాడ్)ది అనీ, అతని తమ్ముడి కూతురే చంద్రిక (కామ్నా జెత్మలానీ) అనీ చెబుతాడు. ఏకలవ్య శిష్యుడిగా గురువు గారి వద్ద చిత్రకళ నేర్చుకోవడానికి వచ్చిన తనకూ, చంద్రికకూ మధ్య పెరిగిన ప్రేమ బంధం గురించి చెబుతాడు. తమ ప్రేమ పెళ్ళిదాకా వచ్చినా, పీటల మీద పెళ్ళి ఆగిపోయినట్లు చెబుతాడు. కానీ, దానికి తాను కారణం కాదని చెబుతాడు. మంత్రవేత్త మాటలతో ఆ తరువాత జరిగిన కథ తెలుసుకోవడం కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఇంతకీ అసలేమైంది? చంద్రిక ఎలా చనిపోయింది? లాంటివన్నీ మిగతా కథ. ఎలా చేశారంటే...? ఇది ప్రధానంగా కన్నడ సినిమా. అయితే, కొంతమంది తెలుగు ఆర్టిస్టుల్ని కూడా పెట్టుకొని, రీషూట్స్ చేసి ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తయారైన సినిమా అనగలిగారు. ఈ చిత్ర కథానాయక పాత్రధారికి తెలుగులో ఇదే తొలిచిత్రం. ఆ పాత్రలో ఆయన చేయగలిగిందీ, చేసిందీ ఏమీ లేదు. టీవీ యాంకర్, ‘జులాయి’ చిత్రంలో అల్లు అర్జున్ చెల్లెలు పాత్రధారిణి అయిన శ్రీముఖి ఈ చిత్రంలో హీరోయిన్. ఆమె కొన్ని చోట్ల చూడడానికి బాగుంది. ముఖ్యంగా, చంద్రిక (కామ్నా జెత్మలానీ) పూనినట్లు అనిపించే సీన్స్లో బాగా చేశారు. ఇంటర్వెల్కు ముందు తానే చంద్రికను అంటూ వచ్చే ముగ్గులోని ఆత్మ సీన్లో శ్రీముఖి ఆంగికం, ఆహార్యం, క్లిష్టమైన భంగిమల్లో ఆమె చేసిన వర్క్ బాగుంది. చంద్రికగా కామ్నా జెత్మలానీ కనిపించేది కాసేపే అయినా, సినిమాకు అదనపు ఆకర్షణ. ఆమెకూ, హీరోకూ మధ్య పెట్టిన రొమాంటిక్ సాంగ్ ఒక రకంగా చెప్పాలంటే, స్పెషల్ ఐటమ్ సాంగ్. గిరీష్ కర్నాడ్ లాంటి సీనియర్ నటుడున్నా, కథలో ఆయనకున్న పాత్ర కొద్దిగానే. ‘సత్యం’ రాజేశ్, ఎల్బీ శ్రీరామ్, ‘తాగుబోతు’ రమేశ్ లాంటి వారందరూ చేసినవి తెరపై కనిపించడానికే తప్ప కథను నడిపించడానికి ఉపయోగపడిన పాత్రలు కావు. ఎలా ఉందంటే...? దర్శకుడు యోగేశ్కు ఇదే తొలి చిత్రం. ఆ అనుభవ రాహిత్యం బయటపడిపోయింది. క్యారెక్టర్ల పరిచయం కాసేపటికే అయిపోతుంది. బంగళాలోని భూతం సంగతి సినిమా మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. ఇక, ఆ తరువాత కథను పట్టాలెక్కించి, వేగంగా నడపాల్సింది. కానీ, అక్కడ అవసరం లేని, ఆసక్తి కలిగించని సీన్లు పెట్టారు. వాటికి తోడు పానకంలో పుడక లాగా పాటలు. సెకండాఫ్లో ఫ్లాష్బ్యాక్ మొదలుపెట్టినప్పటి నుంచి సినిమా రసకందాయంలో పడాలి. కానీ, అలా జరగలేదు. సరికదా... అనాసక్తిగా తయారైంది. ఫ్లాష్బ్యాక్ ఘట్టం కూడా అంతంత మాత్రంగానే ఉంది. హీరో, కామ్నా జెత్మలానీల ప్రేమఘట్టాన్ని అతిగా సాగదీశారు. ఫ్లాష్బ్యాక్ తరువాతహీరో కనిపెట్టిన అంశాలు కూడా ఆసక్తిగా లేవు. చివరకు వచ్చేసరికి, రజనీకాంత్ ‘చంద్రముఖి’ తరహా క్లైమాక్స్ను అనుకరించారు. కానీ, అదీ అంతంత మాత్రమే. మాటి మాటికీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే దయ్యం పాట ముక్కలు ముక్కలుగా విన్నప్పుడు బాగుంది. గుణ్వంత్ సంగీతం, సేతు సౌండ్ ఎఫెక్ట్స్ కొంత సినిమాను కాపాడాయి. కెమేరా వర్క్ ఫరవాలేదు. కానీ, కథలో పస లేనప్పుడు, చెప్పిన విధానంలో దమ్ము లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు. విషాదం ఏమిటంటే, ‘చంద్రముఖి’ని చూసి, ఆ ధోరణిలో వెళ్ళాలని వాత పెట్టుకున్న ఈ హార్రర్ జానర్ సినిమాలో క్రైమ్ ఎలిమెంట్ కానీ, భయపెట్టే అంశాలు కానీ, కనీసం కాసేపు నవ్వు తెప్పించే విషయాలు కానీ లేకపోవడం! కన్నడంలో ప్రధానంగా తీసిన సినిమా కావడంతో ఆ తరహా టేకింగ్ తెలిసిపోతుంటుంది. వెరసి, తెలుగులో కన్నా ఒక రోజు ముందే కన్నడంలో విడుదలైన ఈ ద్విభాషా ‘చంద్రిక’ జనం చూడడానికి భయపడే సినిమాయే తప్ప, చూస్తే భయపడే సినిమా కాదు! - రెంటాల జయదేవ. -
అశ్లీలపు అంచుల్లో ఒక క్రిమినల్ ప్రేమకథ : సినిమా రివ్యూ
సినిమా రివ్యూ దేశంలో బాలలపైన, టీనేజర్లపైన జరుగుతున్న అత్యాచారాల్లో నూటికి 93 శాతం సమీప బంధువుల ద్వారా జరుగుతున్నవే. ఇలాంటి అత్యాచారాల విషయంలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇవన్నీ ఎవరినైనా ఆందోళనకు గురి చేసే గణాంకాలు... ఆలోచనలు రేపే కఠోర వాస్తవాలు. ఈ వాస్తవాలను ఆధారం చేసుకొని దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి చేసిన తాజా సినిమా - ‘ఒక క్రిమినల్ ప్రేమ కథ’. వాస్తవిక అంశాలను తీసుకొని, వాటిని డాక్యుమెంటరీ అనిపించకుండా తెరపై సమర్థంగా చిత్రించడానికి తపించడం ఈ దర్శకుడి అలవాటు. కానీ, ఈసారి ఏం చేశాడో చూద్దాం. కథ ఏమిటంటే... ఓ వీడియో స్టూడియోలో సహాయకుడిగా పనిచేస్తున్న శీను (మనోజ్ నందం) ఓ ఫంక్షన్లో బిందు (ప్రియాంకా పల్లవి)ను చూసి, ఆకర్షణలో పడతాడు. వీరిద్దరూ దగ్గరవుతున్న సమయంలో... తండ్రి అనారోగ్యం కారణంగా హీరోయిన్ మేనమామ దగ్గరకు కుటుంబమంతా వైజాగ్ వెళ్ళిపోతుంది. శీను ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి, ఆమె కోసం కాలేజ్ క్యాంటీన్లో పనిచేస్తుంటాడు. అసలు వారిద్దరూ కలిశారా లేదా? ఆ అమ్మాయి ఎదుర్కొన్న ఇబ్బంది ఏమిటన్నది ఈ చిత్రంలోని కీలకాంశం. ఎలా ఉందంటే... చిత్ర ప్రథమార్ధం చాలా అనాసక్తంగా గడుస్తుంది. కొన్నిసార్లు పరి ణతి లేని నటన, నిర్మాణ, దర్శకత్వ పరిమితులతో కృతకమైన నాటకం చూస్తున్నంత నీరసం కలుగుతుంది. హీరోయిన్ పాత్ర ప్రవర్తన కూడా ఘడియకో రకంగా మారుతూ చీకాకు పరుస్తుంది. ఇక, ద్వితీయార్ధంలో హీరోయిన్ తనకు ఎదురైన అనుభవాలను ఫ్లాష్బ్యాక్లో చెబుతూ, తన తేడా ప్రవర్తనకు కారణాలను వివరిస్తున్న క్రమంలో సినిమా ఒకింత ఆసక్తికరమైన దోవలో పడుతుంది. కానీ, ఆ కారణాలేవీ కన్విన్సింగ్గా అనిపించవు. రకరకాల ఛాయలున్న పాత్రలో కథానాయిక, ఆమె మామయ్య పాత్రలో సుప్రసిద్ధ నట శిక్షకుడు ‘వైజాగ్’ సత్యానంద్ చక్కటి అభినయం చూపారు. హీరో మిత్రుడి పాత్రధారి అనిల్ ఫరవాలేదనిపిస్తాడు. ఈ చిత్రంలోని పాటలు, చిత్రీకరణ, సంగీతం లాంటి విభాగాలేవీ మరో మెట్టు పెకైక్కించేవి కావు. అన్నీ తెరపైనే...!? గతంలో తీసిన ‘ఒక రొమాంటిక్ ప్రేమ కథ’కు దక్కిన వాణిజ్య విజయం మూలంగానో ఏమో, ఆలోచింపజేసే చిత్రాలు తీస్తారని పేరున్న దర్శకుడు సునీల్కుమార్ రెడ్డి ఈ సారి కూడా టీనేజ్ ప్రేక్షకుల బలహీనతల మీద ఆధారపడ్డ సినిమా తీశారు. సమాజంలో మన చుట్టూ మంచీ, చెడూ - రెండూ ఉంటాయి. మనం దేన్ని ఎంచుకొని, ఎలా చెబుతున్నామన్నది కళాసృజన అయిన సినిమాల్లో కీలకం. కానీ, ఈ చిత్రంలో తెలిసిన సామాజిక నాణేనికి తెలియని మరో వైపును చూపించే ప్రయత్నంలో దర్శకుడు పూర్తిగా పక్క దోవ పట్టేశారు. అధర చుంబనం, బలాత్కారం, సంభోగం - ఇలా సగటు అశ్లీల చిత్రంలో మాత్రమే ఉండే ఘట్టాలు. వేర్వేరు సందర్భాల్లో కనిపిస్తాయి. కొన్ని డైలాగులు వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించాయి. దాంతో, పొరపాటున ఏ బూతు సినిమాకో రాలేదు కదా అన్న అనుమానం మామూలు ప్రేక్షకులకు వస్తుంది. ఇతివృత్తంగా చేపట్టిన ప్రధాన సమస్యతో మనసును కదిలించాల్సింది, ఆలోచింపజేయాల్సింది పోయి మనుషుల్లో దాగి ఉండే పశుప్రవృత్తిని ప్రేరేపించే దృశ్యాలతో సినిమా నిండడం వీటన్నిటికీ పరాకాష్ఠ. ఒకప్పుడు సెజ్లపై ‘సొంత ఊరు’, ‘గంగపుత్రులు’ లాంటి సినిమాలు తీసిన ఉత్తమ దర్శకుడు ఎన్నో మెట్లు దిగజారి, ఇలా మార్కెట్ ఆధారిత చౌకబారు చట్రంలో ఇరుక్కుపోవడం మంచి సినిమాలను ప్రేమించేవారికి జీవిత కాలపు దుఃఖం. - రెంటాల జయదేవ