-
వెనకే వెళ్లిపోతాం
ఎవరైనా అందుబాటులో ఉన్న వనరులతోనే తమ అభిరుచుల అందలాలకు సోపానాలు వేసుకుంటారు. కానీ, ఢిల్లీకి చెందిన ‘ఆర్చీ జె’ అనే పాతికేళ్ల యువతి తన గాత్రానికి పాశ్చాత్య సంగీత పరికరమైన బ్యాగ్పైప్ను నేపథ్యవాద్యంగా చేసుకుని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సంగీత ప్రియుల్ని మాయావిలా బుట్టలో వేసుకుంటోంది. మనదేశంలో బ్యాగ్పైప్ను నేర్పించేందుకు శిక్షకులెవరూ లేరు. ఆర్చీ కొన్ని పుస్తకాలు, ఆన్లైన్ వీడియోల ద్వారా బ్యాగ్పైప్ను ప్లే చేయడం నేర్చుకుంది. పాశ్చాత్య సంగీతంతో భారతీయ శైలిని మేళవించి మ్యూజిక్ అల్బమ్స్ చేసింది. 2018లో ‘ఇండియాస్ ఫస్ట్ ప్రొఫెషనల్ ఫిమేల్ బ్యాగ్పైపర్’ అవార్డును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకుంది. ఇవన్నీ పెద్దగా సమయం తీసుకోకుండానే జరిగిపోయాయంటే కారణం.. ఆర్చీ ప్రతిభ, ఆర్చీ స్వరజ్ఞానం. ఒకసారి టీవీలో వస్తున్న విదేశీ ఆర్మీ కవాతులో బ్యాగ్పైప్ ఉపయోగించడం చూసింది. దాని శబ్దం ఆమెకు విపరీతంగా నచ్చింది. దీంతో ఆ పరికరం గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. బ్యాగ్పైప్ పరికరాన్ని తెప్పించుకుంది. అయితే దాంతో ఎలా సాధన చేయాలి అనేది పెద్ద ప్రశ్న. ప్రపంచం నలుమూలలలో ఉన్న అనేకమంది నిపుణులైన బ్యాగ్పైప్ ఆర్టిస్టులకు మెయిల్స్ పంపింది. ప్రొఫెషనల్ బ్యాగ్పైప్ ఆర్టిస్ట్ సీన్ ఫోల్సోమ్ స్పందించి, ఆర్చీకి బోధించడానికి ‘ఎస్’ చెప్పాడు. సరైన పుస్తకాల గురించి సమాచారం ఇచ్చాడు. ఇది ఆర్చీకి బాగా ఉపయోగపడింది. ఉద్యోగం మానేసింది ఆర్చీది మధ్యతరగతి కుటుంబం. చదువులో జెమ్. నోయిడా లోని ఏషియన్ స్కూల్ ఆఫ్ మీడియాలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసింది. ఆ తరువాత యు.ఎస్.లోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అమెరికాకు వెళ్లి తన విధులను నిర్వర్తిస్తూనే పుస్తకాల సాయంతో బ్యాగ్పైప్ వాద్యాన్ని ప్లే చేయడం నేర్చుకుంది. రెండేళ్లపాటు సొంతగా సాధన చేస్తూన్న ఆర్చీ ఆఫీసుకు సెలవు పెట్టి స్కాట్లాండ్లోని గ్లాస్గో కు వెళ్లింది. అక్కడ బ్యాగ్పైప్ నిపుణులను కలుసుకొని, వారి దగ్గర ఈ కళలోని మరిన్ని మెళకువలు నేర్చుకుంది. వారం తర్వాత తిరిగి ఉద్యోగానికి వచ్చింది. కానీ, బ్యాగ్పైప్ మీద తప్ప.. చేస్తున్న పని మీద ధ్యాస లేదు. ఉద్యోగానికి రిజైన్ చేసి, ఇండియాకు వచ్చేసింది. మొదటి వీడియోతోనే! బ్యాగ్పైప్ను ప్లే చేస్తూ తన గళాన్ని వినిపించిన ఆర్చీ మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధి చెందింది. మొదట ‘ఎసి డిసి థండర్ స్ట్రక్’ అనే ఆస్ట్రేలియా బ్యాండ్ పాటను బ్యాగ్పైప్ పరికరంతో ప్లే చేసి ఆ వీడియోను సోషల్ మీడియాద్వారా పంచుకుంది. ట్యూన్లోని కొత్తదనం వీక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఫలితంగా వీడియో వైరల్ అయ్యింది. దీని తరువాత ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్టార్ వార్స్, గాడ్ ఫాదర్..’ పాటలకు ఆర్చీ తన ట్యూన్లను జత చేయడంతో విశేష ప్రజాదరణ పొందింది. అక్కణ్ణుంచి తన సొంత పాటల కూర్పు వైపు కదిలింది. రెండు నెలల క్రిందట ‘ఆస్మాన్ సే’ పాటను విడుదల చేసింది. అంతకు ముందు చేసిన ‘నగీన’ పాటకు 40 లక్షల యాభై వేల వ్యూస్ను సంపాదించింది. – ఆరెన్నార్ స్నేక్ చార్మర్ ఆర్చీ తన కళకు ‘స్నేక్ చార్మర్’ అనే పేరును ఎంచుకుంది. బూరను ఊదుతూ పాములను లొంగదీసుకునే మంత్రగాళ్ల గురించి భారతదేశం అంతటా తెలిసిందే. దేశీయంగా మనవారి నాడిని పట్టుకొని ఆర్చీ తన యూ ట్యూబ్ ఛానెల్కు ‘ది స్నేక్ చార్మర్’ అని పేరు పెట్టి తన బ్యాగ్పైప్ సంగీతంతో వీక్షకులకు మంత్రముగ్ధులను చేస్తోంది. ఐదేళ్లలో యూ ట్యూబ్ చానెల్ ద్వారా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 79 దేశాలలో 4.50 లక్షలకు పైగా సభ్యులను, మిలియన్ల మంది వీక్షకులను సంపాదించుకుంది ఆర్చీ. -
మహిళా లేఖనం
అందం, సంబరం, పువ్వులు, ప్రకృతి, పర్యావరణం, జలవనరులు ఇవన్నీ బతుకమ్మ పండుగలో భాగమని తెలుసు. అయితే ఈ మహిళా కళాకారులు వాటితో పాటు అసమానతలు, లింగ వివక్ష, ఆధ్యాత్మిక ఉత్తేజం.. ఇలా ఎన్నో అంశాలను బతుకమ్మ కోణం నుంచి స్పృశించారు. అందుకే పండుగ వెళ్లిపోయినా.. వారు గీసిన వర్ణాలన్నీ నేటికీ బతుకు ఉత్సవాన్ని ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. – ఓ మధు, సాక్షి, సిటీ బ్యూరో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో హైద్రాబాద్ నెహ్రూ గ్యాలరీలో మూడు రోజుల పాటు జరిగిన బతుకమ్మ ఆర్ట్ క్యాంప్లో 20–82 ఏళ్ల మధ్య వయసున్న యాభై మంది మహిళా ఆర్టిస్టులు ఒకే వేదిక మీద అక్కడికక్కడ చిత్రాలు గీశారు. తెలంగాణలో ఇంత పెద్దఎత్తున బతుకమ్మపై ‘ఆర్ట్క్యాంప్’ జరగడం ఇదే తొలిసారి. తెలంగాణ జాగృతి, తెలంగాణ ఆర్టిస్ట్ ఫోరం సహకారాలతో జరిగిన ఈ ఆర్ట్ క్యాంపును ప్రముఖ చిత్రకారులు రమణారెడ్డి సమన్వయం చేయగా, అనిత క్యూరేటర్గా వ్యవహరించారు. విశేషం ఏమిటంటే.. ఈ క్యాంప్లో చిత్రకారిణుల కుంచె నుంచి రూపుదిద్దుకున్న బతుకమ్మ చిత్రాలు చూడముచ్చటగా ఉండటమే కాదు, ఆలోచనలకు పదును పెట్టేలా ఉన్నాయి. బతుకమ్మ ప్రకృతి పండుగ. చిన్నప్పుడు రకరకాల పువ్వులు తీసుకువచ్చి రంగులు అద్ది తొమ్మిది రోజుల బతుకమ్మను తయారు చేసే వాళ్లం. ప్రకృతితో ఈ విధమైన బంధాన్ని పిల్లలు మిస్ కాకూడదు. ఇలాంటి ఆర్ట్ క్యాంప్ వల్ల కళతోపాటు సంప్రదాయాన్ని గురించిన అవగాహన, పండుగ పట్ల అభిరుచి మరింత పెరుగుతాయని అంటారు పద్మారెడ్డి. ఆమెతోపాటు, ఆర్ట్క్యాంప్లో పాల్గొన్న మిగతా కళాకారిణులు తమ మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. సమానత్వం కోసం నాటి భూస్వాముల ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న స్త్రీలను గుర్తు చేసుకుంటూ, మిగిలిన ఆడవాళ్లు పూలను పేర్చి ‘బతుకు అమ్మా..’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చెయ్యడంతో బతుకమ్మ ఉత్సవం మొదలయ్యిందన్న ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. స్త్రీ, పురుషులిద్దరూ సమానమే అని చెప్తున్నా స్త్రీలకు పరిస్థితులింకా దుర్భరంగానే ఉన్నాయి. అందుకే నా చిత్రంలో స్త్రీ, పురుష చిహ్నాలను తీసుకుని స్త్రీ చిహ్నాన్ని హైలైట్ చేశాను. అసమానత్వానికి గుర్తుగా స్త్రీ చిహ్నానికి పూర్తి ఎరుపు రంగుని వెయ్యలేదు. ఆ చిహ్నంలోనే బతుకమ్మను చూపించాను. ఇక చిత్రంలో ఆదిశక్తి ఆయుధాలు కూడా చూడవచ్చు. రాక్షసులను చంపలేమని దేవుళ్లే వెనక్కి తగ్గినప్పుడు, ఆదిశక్తి దుష్ట సంహారం చేసింది. – రజని, బిఎఫ్ఏ, థర్డ్ ఇయర్ గౌరమ్మ కోసం బతుకమ్మ స్త్రీల పండుగ. అందుకే లేస్, బట్టలు, పువ్వులతో ఈ పెయింటింగ్ వేశాను. దీంట్లో తొమ్మిది మంది స్త్రీల ముఖాలు, తొమ్మిది రోజుల బతుకమ్మను ప్రతిబింబిస్తాయి. మధ్యలో బతుకమ్మ సమయంలో పూజించే గౌరమ్మను పెట్టాను. – రూపారాణి ఉపాసన కోసం మనలో ఉన్న కుండలి శక్తిని ప్రతిబింబించేలా నా చిత్రంలో చక్రాలు వేశాను. శక్తికి ప్రతిరూపాలు మనుషులు. శక్తి ఉపాసన ద్వారా కుండలిని శక్తి మరింత జాగృతమవుతుంది. తొమ్మిది రోజులు బతుకమ్మ చేసే వారు కొత్త ఉత్సాహంతో ఉండటాన్ని గమనించవచ్చు. ఏడాదిలో ఒకసారైనా ఇలాంటి ఆరాధన చేస్తే ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవచ్చు. ఇదే ఈ చిత్రం ద్వారా చెప్పాను – సౌజన్య కష్టసుఖాల కోసం భావోద్వేగాలు ఏమీ ముఖంలో కనిపించని; సంతోషం, బాధను కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్న నేటి స్త్రీని పసుపు, కుంకుమ రంగులతో నా చిత్రంలో చూపించాను. – వేకువ, ఎంఎఫ్ఏ, స్టూడెంట్ కలవడం కోసం ఆంధ్రాకి దగ్గరగా ఉండే భద్రాచలం ప్రాంతం వాళ్లకి బతుకమ్మ అంటే ఏందో తెల్వదు. నేను ఇప్పటి వరకు ఆడలేదు కూడా. టీవీల్లోనే మొదటిసారి చూసిన. అందుకే నా పెయింటింగ్లో టీవీ పెట్టాను. అది పండుగో లేక సంతోషంగా ఆడుకునే ఆటో అప్పుడు నాకు తెలియదు. ఈ క్యాంప్లో ఇంతమంది సీనియర్ కళాకారిణిలతో కలిసి బతుకమ్మ చిత్రాలు వెయ్యటం హ్యాపీగా ఉండటమే కాదు, బతుకమ్మ ఆడినట్లే అనిపిస్తుంది. – సమ్మక్క, ఎంఎఫ్ఏ స్టూడెంట్ ఆసిడ్ బాధితుల కోసం నా బిఎఫ్ఏ 2010లో పూర్తయింది. పీడిత మహిళకు సంబంధించిన అంశాలపై ఆర్ట్ వర్క్ చేస్తుంటాను. ముఖ్యంగా ఆసిడ్ విక్టిమ్స్ మీద పనిచేస్తాను. ‘అందం ఆత్మకు సంబంధించింది’ అనే ఆలోచనతో చిత్రాలు రూపొందిస్తుంటాను. బాధితులైన స్త్రీలనే నేపథ్యంగా తీసుకున్నాను. వారిని అందరితో సమానంగా పండుగలో భాగం చెయ్యాలని, వివక్షలేని వాతావరణం వారికి కల్పించాలని నా చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశాను. – వినీల నీటి కోసం సిటీ మ్యాప్లో నీటి చారలను, నీటి ప్రాంతాలను, అందులో తేలుతున్న బతుకమ్మలను చిత్రంగా మలిచారు సీనియర్ ఆర్టిస్ట్ పద్మారెడ్డి. ‘‘నగరంలో మరింత నీరు ఉంటే, నీలిరంగు మరింతగా వాడే దాన్ని’’ అని నవ్వుతూ అంటారు సీనియర్ ఆర్టిస్ట్. – పద్మారెడ్డి -
చీకటి కోణాలు
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశంలో ‘మీ టూ’ ఉద్యమం ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలిసిందే. ప్రస్తుతం చిత్రసీమలో చర్చలన్నీ లైంగిక వేధింపుల గురించే. ఇప్పటికే కొందరు ఫీమేల్ ఆర్టిస్టులు తమకు ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ఈ విషయంలో బాధిత నటీమణులకు సహచర నటీమణుల నుంచి మాత్రమే కాదు.. కొందరు నటులు, దర్శకులు కూడా మద్దతు ఇస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఐశ్వర్యారాయ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘‘వేధింపులకు సంబంధించి బాధిత మహిళలు తమ అనుభవాలను బయటకు చెప్పినప్పుడు వాటిని మనం కూడా ధైర్యంగా ఇతరులతో షేర్ చేసుకోవాలి. మహిళపై వేధింపుల సమస్య కేవలం ఇప్పటిది మాత్రమే కాదు. ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు వేధింపుల గురించి ఓ ఉద్యమం నడుస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి విషయాలపై మాట్లాడటానికి నేను సంకోచించను. గతంలో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడుతున్నా. భవిష్యత్లో మాట్లాడతాను. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు తమ గొంతును వినిపించడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతోంది’’ అని పేర్కొన్నారు. అయితే లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు వికాస్ బాల్, అలోక్నాథ్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అని మీడియా అడిగితే.. ఆ విషయం గురించి చెప్పకుండా ఐశ్వర్య మాట దాటేశారు. దోషులను చట్టం శిక్షిస్తుందన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తనుశ్రీ దత్తా, నానా పటేకర్ల వివాదం మరో స్థాయికి చేరింది. ఇటీవల తనుశ్రీకి నానా పటేకర్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా తనుశ్రీ దత్తా లాయర్లు ముంబై పోలీసులు, మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్లకు దాదాపు 40 పేజీల ప్రతులను అందజేశారు. తనుశ్రీ వివాదానికి సంబంధించి నటుడు నానా పటేకర్, నిర్మాత సమి సిద్ధిఖీ, కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు రాకేష్ సారంగ్లు పది రోజుల్లో సంజాయిషీ చెప్పాల్సిందిగా ముంబై రాష్ట్ర మహిళా విభాగం మంగళవారం నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. క్షమాపణలు చెప్పాల్సిందే! ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ఒకరైన వికాశ్ బాల్పై లైంగిక ఆరోపణలు వచ్చిన తర్వాత మిగిలిన ముగ్గురు (అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య, మధు మంతెన)లు ఆ సంస్థను నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్యలు వికాస్పై సోషల్æమీడియా ద్వారా పలు ఆరోపణలు చేశారు. దీంతో అనురాగ్, విక్రమాదిత్యలకు తాజాగా నోటీసులను పంపించారు వికాస్. ‘‘నా గురించి అనురాగ్, విక్రమాదిత్య చేసిన ఆరోపణలను వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. వృత్తిపరమైన అసూయ కారణంగానే నాపై అనురాగ్, విక్రమాదిత్య ఇలాంటి ఆరోపణలు చేశారనిపిస్తోంది. అలాగే నా కెరీర్ను, ఇమేజ్ను దెబ్బతీయాలనే ఇలా ప్లాన్ చేశారు. నాపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తెలియకుండానే పాంథమ్స్ ఫిల్మ్స్ను నిర్వీర్యం చేశారు. ఇందుకు నాపై వచ్చిన ఆరోపణలను వారు ఒక సాకుగా చూపించారన్నది నా ఆలోచన’’ అంటూ మూడు పేజీల లీగల్ నోటీసును అనురాగ్, విక్రమాదిత్యలకు పంపారు వికాస్ తరఫు లాయర్. మరోవైపు వికాస్ నోటీసుల విషయమై తనపై పడ్డ నింద తొలగిపోయేంత వరకు ముంబై అకాడమీ ఆఫ్ ది మూవీంగ్ ఇమేజ్ బోర్డ్ (ఎమ్ఎఎమ్ఐ) సభ్యత్వాన్ని అనురాగ్ కశ్యప్ రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వికాస్పై వచ్చిన ఆరోపణలు అతన్ని రెండు ప్రాజెక్ట్లకు దూరం చేశాయని తెలుస్తోంది. అపస్వరం! సింగర్గా పలు హిట్ పాటలను ఆలపించి శ్రోతల మనసును గెల్చుకున్న కైలాష్ ఖేర్ తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వృత్తిపరమైన విషయాలను చర్చించే సమయంలో కైలాష్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని గాయని సోనా మల్హోత్రా ఆరోపించారు. ఓ ఇంటర్య్వూ నిమిత్తం సింగర్ కైలాష్ ఖేర్ను కలవడానికి వెళ్లిన సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని సోషల్ మీడియా వేదికగా ఓ జర్నలిస్ట్ కూడా ఆరోపించారు. తెలుగులో పండగలా దిగి వచ్చాడు (మిర్చి), ‘వచ్చాడయ్యో సామీ..’ (భరత్ అనే నేను), ‘యాడపోయినాడో..’ (అరవిందసమేత వీరరాఘవ) వంటి హిట్ సాంగ్స్ను పాడారు కైలాష్. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ ఏడాది దాదాపు అరడజను తెలుగు సినిమాలకు సంగీతం అందించి, మంచి ఫామ్లో దూసుకెళ్తున్నారు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్. ప్రస్తుతం ‘మీ టూ’ ఉద్యమంలో ఆయన పేరు కూడా వినిపిస్తోంది. తనను లైంగికంగా వేధించారని ఓ సింగర్ సోషల్ మీడియా ద్వారా ఆరోపించారు. చక్కని స్వరం ఉన్న ఈ గాయకులపై ఇలాంటి ఆరోపణలు ‘అపస్వరం’గా అనిపిస్తున్నాయని పలువురు అనుకుంటున్నారు. భార్యను వేధించిన దర్శకుడు! మరోవైపు మరాఠీ చిత్రం ‘సైరాట్’తో దేశవ్యాప్త గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు నాగరాజ్ మంజులేపై ఆయన మాజీ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నా 18ఏళ్ల వయసులో నాగరాజ్తో నాకు వివాహం జరిగింది. ఆ సమయంలో దర్శకునిగా పేరు తెచ్చుకోవాలని నాగరాజ్ ఎంతగానో ప్రయత్నిస్తుండే వాడు. ఇంటికి నేనే పెద్ద కోడలిని. మా సంసారంలో వచ్చిన ఎన్నో సమస్యలను నేను ఎదుర్కొన్నాను. ఒక టైమ్లో నాగరాజ్ ప్రవర్తన హద్దులు దాటింది. ఇంటికి అమ్మాయిలను తెచ్చుకునేవాడు. పైగా నన్ను అబార్షన్ చేయించుకోమని వేధించాడు. రెండు, మూడుసార్లు చేయించాడు కూడా. ఇక భరించలేక 2014లో అతన్నుంచి విడిపోయాను’’ అని సునీత చెప్పినట్లు ఇప్పుడు తాజాగా వార్తలు వస్తున్నాయి. నటి అమైరా దస్తూర్ కూడా మూవీ లొకేషన్లో వేధింపులు ఎదుర్కొన్నానని పేర్కొన్నట్లు చెబుతున్నారట. ‘‘సౌత్, నార్త్ ఇండస్ట్రీలో నేను లైంగిక దాడులను ఎదుర్కొనలేదు. కానీ వేరే రకమైన వేధింపులకు గురయ్యాను. వాళ్ల పేర్లు చెప్పడానికి ప్రస్తుతం నాకు ధైర్యం సరిపోవడం లేదు’’ అన్నారు అమైరా. మొత్తానికి మీటూ ఎన్నో చీకటి కోణాలను బయటకు తెస్తోందని, ఇంకా ఎవరెవరి పేర్లు వస్తాయోననే చర్చ జరుగుతోంది. ఇప్పుడిదొక ఫ్యాషన్! గాయని చిన్మయి ‘మీటూ’కి సంబంధించిన మరికొన్ని ట్వీట్స్ను బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళవారం ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు గురించి ఆమె ట్వీట్స్ చేశారు. బుధవారం వైరముత్తు స్పందిస్తూ – ‘‘అమాయకులను అవమానించడం ఇప్పుడు చాలామందికి ఓ ఫ్యాషన్ అయిపోయింది. గతంలో నా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇది. నిజమేంటో కాలమే చెబుతుంది’’ అన్నారు. ఈ విషయంపై చిన్మయి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘వైరముత్తు అవాస్తవాలు చెబుతున్నారు’ అని పేర్కొన్నారు. -
బతుకమ్మ కోసం జిల్లాకు రూ.10 లక్షలు
బతుకమ్మ పండుగకు విశేష ప్రాచుర్యాన్ని కల్పిస్తూ నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. బతుకమ్మ పండుగ నిర్వహణపై ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు గాను ప్రభుత్వం జిల్లాకు రూ.10 లక్షల చొప్పున కేటాయించిందని వివరించారు. ఇంకా నిధులు అవసరమైతే ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈనెల 21న హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ముగింపు ఉత్సవాల కోసం ప్రతి జిల్లా నుంచి 100 మంది మహిళా కళాకారులను పంపాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల సాంస్కృతిక వైభవం, చారిత్రక నేపథ్యం తెలిపే శకటాల ప్రదర్శన కూడా ఉంటుందని వెల్లడించారు. 21న మధ్యాహ్నం మహిళా కళాకారులంతా ఎల్బీనగర్స్టేడియం చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement