పైలట్ మానవత్వం.. వృద్ధ దంపతులకోసం వెనక్కి..
మాంచెస్టర్: ఇప్పటి వరకు విమానాల్లో నుంచి ఈడ్చిపారేయడం, వివిధ కారణాలతో దించేయడం, విమానాల్లో పాములు, తేలు కనిపించడలాంటి కొంత ఇబ్బందికరమైన విషయాలు చూశాం. కానీ, తొలిసారి మనసుకు తృప్తినిచ్చే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక వృద్ధ దంపతులకు విమాన నిర్వహణ అధికారులు అరుదైన అవకాశం ఇచ్చారు. చావు బతుకుల్లో ఉన్న తమ మనవడిని చివరిసారి చూసేందుకు అవకాశం ఇచ్చారు. రన్వేపై పరుగు ప్రారంభించిన విమానాన్ని తిరిగి వారికోసం వెనక్కి తిప్పి బోర్డింగ్ గేట్వద్ద వదిలేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ ఇద్దరు వృద్ధ దంపతులు అబుదాబి మీదుగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు మాంచెస్టర్లో ఎతిహాద్ విమానం ఎక్కారు.
విమానం బయలుదేరేముందు తమ సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తుండగా వారికి ఒక సందేశం వచ్చింది. అందులో వారి మనవడు ఓ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో ఉన్నాడంటూ వారి అల్లుడు దాన్ని పంపించాడు. అప్పటికే విమానం పరుగందుకుంది. దీంతో వారు టికెట్లు బుక్ చేసుకున్న సంస్థకు ఫోన్ చేసి విషయం చెప్పగా వారు విమాన సిబ్బందికి కబురందించారు. వారి విజ్ఞప్తి మేరకు స్పందించిన పైలెట్ విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చి వారిని పంపించారు. దీంతో వారు పార్కింగ్లో ఉన్న తమ కారును తీసుకొని నేరుగా తమ మనవడి వద్దకు వెళ్లారు.