breaking news
Eco-Friendly Electronic bus
-
పొగరాదు.. సెగరాదు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే మొట్టమొదటిసారిగా రాజధాని ఢిల్లీలో పర్యావరణహిత హైడ్రోజన్ బస్సులు రంగప్రవేశం చేశాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు కేంద్ర సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ వద్ద హైడ్రోజన్ ఆధారిత షటిల్ బస్సు సర్వీసులను ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) లాంఛనంగా ప్రారంభించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ, పెట్రోలియం, సహజ వాయువు శాఖల సమన్వయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కింది. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం.. అత్యాధునిక భద్రత.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) అందించిన రెండు హైడ్రోజన్ బస్సులను డీఎంఆర్సీ నడుపుతోంది. ఒక్కో బస్సులో 35 మంది ప్రయాణించే వీలుంది. ఈ బస్సులు కేవలం రవాణా సౌకర్యాన్ని మాత్రమే కాకుండా, పూర్తి స్థాయి భద్రతను కూడా కల్పిస్తున్నాయి. ప్రతి బస్సులో జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రతతో పాటు బస్సు కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుంటుంది. కాలుష్య రహిత ఇంధనంతో నడిచే ఈ బస్సులు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేయబోయే హైడ్రోజన్ రవాణా వ్యవస్థకు రోల్ మోడల్ కానున్నాయి. ప్రయాణ మార్గాలు ఇవే.... సెంట్రల్ సెక్రటేరియట్ (కేంద్ర సచివాలయం), సేవా తీర్థ మెట్రో స్టేషన్ల మధ్య ఈ బస్సులు నడుస్తాయి. సెంట్రల్ విస్టా పరిధిలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలైన నిర్మాణ్ భవన్, విజ్ఞాన్ భవన్, అక్బర్ రోడ్, బరోడా హౌస్ వంటి ప్రాంతాలను అనుసంధానం చేస్తాయి. వీటితో పాటు ఇండియా గేట్, నేషనల్ స్టేడియం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్స్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికీ ఈ సేవలు ఉపయోగపడతాయి. వేళలు, టికెట్ ధరలు... ప్రభుత్వ సెలవు దినాలు మినహాయించి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3.30 నుంచి 6.30 గంటల వరకు 30 నిమిషాలకోబస్సు అందుబాటులో ఉంటుంది. సామాన్యులకు భారం కాకుండా స్టేజీల వారీగా కేవలం రూ. 10, రూ. 15 చొప్పున టిక్కెట్ ధరలను నిర్ణయించారు. ప్రయాణికులు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, యూపీఐ లేదా నగదు రూపంలో టిక్కెట్ తీసుకునే వెసులుబాటును కల్పించారు. మెట్రో దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి (లాస్ట్ మైల్ కనెక్టివిటీ) ఇబ్బంది పడకుండా ఈ బస్సులు సహాయపడతాయని, రాజధానిలో వాయు కాలుష్యాన్ని అరికట్టే దిశగా ఇదొక కీలక ముందడుగు అని డీఎంఆర్సీ డైరెక్టర్ అమిత్ కుమార్ జైన్ తెలిపారు. -
ఎస్జీఎన్పీ సందర్శకులకు ఎకోఫ్రెండ్లీ బస్సులు
సాక్షి, ముంబై: సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ (ఎస్జీఎన్పీ)ను సందర్శించే పర్యాటకుల కోసం ఎకోఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ బస్సులను నడిపేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఈ బస్సుల కోసం ఈ పార్క్లోని ఉద్యానవనంలోని కొంత భాగాన్ని పార్కింగ్ లాట్గా తీర్చిదిద్దనున్నారు. ఎస్జీఎన్పీ పార్కులో ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఎంటీడీసీతో మాట్లాడుతున్నామని, అయితే పార్కింగ్ స్థలం కొరత వల్ల ఈ ప్రణాళికకు జాప్యం జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. స్థలం ఖాళీ లేనట్లయితే గార్డెన్లో కొంత భాగాన్ని పార్కింగ్ లాట్గా తీర్చి దిద్దుతామని చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సేవలు జూలై నుంచి అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ బస్సుల నిర్వహణ, చార్జీల సేకరణ మొత్తం ఎంటీడీసీ చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బస్సులు ఎస్జీఎన్పీ మేయిన్ గేట్ నుంచి కన్హేరి కేవ్స్ వరకు నడుస్తాయి. ఇందుకు గాను చార్జీలను ఇంకా నిర్ణయించలేదు. ఇదిలా ఉండగా ఈ నేషనల్ పార్క్కు ఎడమ భాగంలో క్రిష్ణగిరి ఉద్యాన్ ఉంది. ఈ గార్డెన్ను అభివృద్ధి చేసి ఏడాది అవుతోంది. ఉదయం, సాయంత్రం వేళ్లలో వాకింగ్ చేసేవారికి ఈ గార్డెన్ హాట్స్పాట్గా మారింది. ఈ ఉద్యానవన అభివృద్ధికి గాను ఇప్పటికే రూ.10 లక్షల వ్యయం అయినట్లు అధికారి వెల్లడించారు. వివిధ రకాల పక్షులు, పూల మొక్కలు, చెట్లు అనేకం ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులను బయట పార్క్ చేయడం ద్వారా ట్రాఫిక్జామ్ సమస్యలు తలెత్తి పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అధికారి వెల్లడించారు.


