క్షయ నివారణకు కొత్త మందులు
అమలాపురం రూరల్, న్యూస్లైన్ : క్షయ వ్యాధి నివారణకు కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఐవీ రావు తెలిపారు. అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే 34వ ఏపీ ‘టీబీ- చెస్ట్’ డిసీస్ కాన్ఫరెన్స్ను శనివారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీవీ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన 34వ రాష్ట్ర సదస్సులో వీసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. హెచ్ఐవీ, డయాబెటిస్ వ్యాధులున్న రోగులకు క్షయ వ్యాధి ఎక్కువగా వస్తోందన్నారు. దేశంలో ఉద్ధృతంగా ఉన్న ఇది మందులకు తగ్గకుండా మొండి వ్యాధిగా మారిందన్నారు. 80 లక్షల మంది రోగులకు వ్యాధి నయం కావడం లేదన్నారు.
పూర్తిగా తగ్గించేందుకు నూతన వైద్య విధానంలో అనేక పరిశోధనలు చేసి కొత్త మందులు అందుబాటులోకి తీసుకు వస్తున్నామన్నారు. ఇలా బెడాజియంతోపాటు పలు రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్య విద్యార్థులు ఇటువంటి సదస్సులను సద్వినియోగం చేసుకుని పరిశోధనలు చేయాలన్నారు. క్షయ వ్యాధి నివారణ పద్ధతులు, జిల్లా పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలను గురించి సదస్సుకు హాజరైన విద్యార్థులకు వివరించారు. డాక్టర్ పీవీ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి 100 మందిలో ఇద్దరు టీబీ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. పీజీ విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి 400 మంది మెడికల్ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు.
డీటీసీఓ డాక్టర్ ప్రసన్నకుమార్, కిమ్స్ డీన్ డాక్టర్ ఎ.కామేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీకేవీ ప్రసాద్, సూపరింటెండెంట్ హరినాథ్బాబు, మెడికల్ డెరైక్టర్ డాక్టర్ వెంకట్రావు, ప్రొఫెసర్ డాక్టర్ డి.సత్యనారాయణ, డాక్టర్ పీఎస్.శర్మ, డాక్టర్ బెనర్జీ, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ గొలకోటి రంగారావు పాల్గొన్నారు. ముందుగా హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఓఏ శర్మ తాను రచించిన మెడికల్ డిక్షనరీని పీజీ విద్యార్థులకు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఐవీ రావు, డాక్టర్ ఓఏ శర్మ, డాక్టర్ ప్రహ్లాదకుమార్, డాక్టర్ రామకృష్ణలను ఘనంగా సన్మానించారు.
సావనీర్ ఆవిష్కరణ
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఐవీ రావు, సదస్సు అధ్యక్షుడు డాక్టర్ పీవీ రామకృష్ణ తదితరులు కళాశాల ఆవరణలో బెలూన్లను ఎగురవేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బాబూలాల్ జెండాను ఆవిష్కరించారు. కళాశాల ఆవరణలో ఏర్పా టు చేసిన స్టాల్స్ను డీసీటీఓ డాక్టర్ ప్రసన్నకుమార్, కిమ్స్ కళాశాల డీన్ డాక్టర్ కామేశ్వరరావు, ఏఓ కె. రఘు, ప్రిన్సిపాల్ జీవన్ ప్రసాద్ ప్రారంభించారు. తొలుత కిమ్స్ పీజీ విద్యార్థిని డాక్టర్ రాధిక భరతనాట్య ప్రదర్శన ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది. 34వ సదస్సు సావనీరును వీసీ ఐవీ రావు ఆవిష్కరించారు. సీఎంఈ ప్రోగ్రామ్లో ప్రతిభ కనబరిచిన పీజీ విద్యార్థులకు, ప్రొఫెసర్లకు బంగారు పతకాలను వీసీ ప్రదానం చేశారు.