Dera Sacha Sauda Gurmeet Ram Rahim Singh
-
డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్- హర్యానా హైకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు రద్దు చేసింది. రామ్ రహీమ్ తరపు న్యాయవాది జితేందర్ ఖురానా ఈ విషయాన్ని వెల్లడించారు. 2002లో హర్యానాకు చెందిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిపై కాల్పులు జరగడం, ఆపై చికిత్స పొందుతూ ఆయన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డేరా ఆశ్రమంలో జరిగే అకృత్యాలను వెలుగులోకి తెచ్చినందుకే ఆయనను హత్య చేశారనే ఆరోపణలు నాడు వినవచ్చాయి. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, 2019లో గుర్మీత్ రామ్ రహీమ్ సహా మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ, డేరా బాబా హైకోర్టును ఆశ్రయించారు. శనివారం జరిగిన విచారణలో సాక్ష్యాధారాల లోపాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆయనపై ఉన్న ఆరోపణలు నిరూపితం కాలేదని స్పష్టం చేస్తూ, కేసు నుంచి విముక్తి కల్పించింది.ఈ హత్య కేసులో నిర్దోషిగా విడుదలైనప్పటికీ, రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతానికి జైలులోనే కొనసాగనున్నారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 2017లో ఆయనకు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా రామ్ రహీమ్ సింగ్కు హర్యానా ప్రభుత్వం పదే పదే పెరోల్ మంజూరు చేయడంపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యుక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలోనే ఆయనకు పెరోల్ లభించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు, సిక్కు మత సంస్థలు ఆరోపించాయి. తాజా తీర్పుతో డేరా బాబా అనుచరులు హర్షం వ్యక్తం చేస్తుండగా జర్నలిస్టు ఛత్రపతి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో వారు ఉన్నట్లు సమాచారం. -
డేరా బాబాకు 40 రోజుల పెరోల్
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి తాత్కాలిక స్వేచ్ఛ లభించింది. కోర్టు 40 రోజుల పెరోల్మంజూరు చేయడంతో మంగళవారం హరియాణా రాష్ట్రం రొహతక్లోని జైలు నుంచి బాబా బయటకు వచ్చారని లాయర్ జితేందర్ ఖురానా తెలిపారు. సిర్సాలో ఉన్న డేరా ప్రధాన కార్యాలయంలోనే ఆయన వచ్చే 40 రోజులు గడపాల్సి ఉంటుందన్నారు. డేరా వద్దకు ఎవరూ రావద్దంటూ అనుచరులనుద్దేశించి విడుదల చేసిన వీడియోలో బాబా కోరారు. ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారం చేశారన్న కేసులో కోర్టు డేరా బాబాకు 2017లో 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ నెలల్లోనూ ఆయన ఫర్లో, పెరోల్పై బయటకు వచ్చారు. తాజా పెరోల్తో కలిపితే ఈ ఏడాది దాదాపు మూడు నెలలపాటు జైలు బయట గడిపినట్లవుతుంది. 2024, 2022 సంవత్సరాల్లోనూ ఆయనకు కోర్టు ఫర్లా వెసులుబాటు కలి్పంచింది. 2017లో జైలుకు వెళ్లిన తర్వాత కనీసం 13 సార్లు ఆయన బయటకు వచ్చారు. డేరా సచ్ఛా సౌదాకు హరియాణా, పంజాబ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో అనుచరులున్నారు. -
‘ఎంఎస్జీ’ సినిమాపై ఆందోళన
న్యూఢిల్లీ: దేరా సచ్ఛా సౌదా నేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్ ’ సినిమాకు వ్యతిరేకంగా ఢిల్లీలో శుక్రవారం శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వరకు వారు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. ఈ సినిమాకు క్లియరెన్స్ ఇచ్చే సమయంలో సెన్సార్ బోర్డు చైర్పర్సన్ లీలా శాంసన్ రాజీనామా చేశారని, అయితే ఈ వివాదాస్పద సినిమాకు ఫిల్మ్ సర్టిఫికేషన్ అపెల్లెట్ ట్రిబ్యునల్ (ఎఫ్సీఏటీ) ఎలా క్లియరెన్స్ ఇచ్చిందని వారు ప్రశ్నించారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ సినిమాపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు పంజాబ్, హర్యానా నుంచి వందలాదిమంది తరలిరావడంతో పోలీసులు కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టారు. ఒక సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. కాగా, గురువారం రాత్రి సెన్సార్ బోర్డ్ చైర్పర్సన్ లాలా శ్యాంసన్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాకు ఎఫ్సీఏటీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. తాను రాజీనామా చేసిన విషయం వాస్తవమేనని, విషయాన్ని ఐ అండ్ బీ సెక్రటరీకి తెలియపరిచానని చెప్పారు. సినిమాల సెన్సార్ సమయంలో బయటవారి జోక్యం, ప్యానల్ సభ్యుల్లో అవినీతి, సెన్సార్ బోర్డ్ అధికారులపై ఆరోపణలు తదితర కారణాలతో తాను పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. ఇదిలా ఉండగా, ఎంఎస్జీ సినిమా శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలైంది.


