breaking news
death record
-
మహారాష్ట్రలో జల ప్రళయం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో భారీ వర్షాలతో జల ప్రళయం సంభవించింది. గడిచిన 48 గంటల్లో మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వర్షం సంబంధిత ఘటనల్లో 129 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. కొండచరియలు విరిగిపడి రాయ్గఢ్ జిల్లాలో తలియే గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటి వరకు 38 మంది మృతదేహాలను వెలికితీశారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకునిపోయారు. సతారా జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో 27 మంది చనిపోయారు. గోండియా, చంద్రాపూర్ జిల్లాల్లోనూ పలువురు మృత్యువాతపడ్డారు. రత్నగిరి జిల్లాలో 10 మంది, సతారా జిల్లాలో కొండచరియలు విరిగిపడడంతో 11 మంది, ముంబైలో భవనం కూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. భారీ వర్షాల కారణంగా చిప్లూన్ పట్టణం పూర్తిగా జలమయమైంది. ఇళ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, వీధులలో 4 నుంచి 14 అడుగుల మేర నిలిచింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో, కోవిడ్ ఆసుపత్రిలో వెంటిలేటర్లపై ఉన్న 8 మంది మృతి చెందారు. వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తోపాటు నేవీ ఇతర సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికుల సాయంతో యుద్ధప్రాతిపాదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. కొంకణ్లోని ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి, పాల్ఘర్, పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్, సతారా, సాంగ్లీ, మరాఠ్వాడాలోని పర్భణీ, నాందేడ్, విదర్భలోని అకోలా జిల్లాల్లో మూడు, నాలుగు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లోని నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చాయి. జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో నివాసాలు 15 అడుగుల మేర వరదలో నీట మునిగాయి. వందలాది గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి వర్షం కొంత విశ్రాంతి ఇవ్వడం, వరద తీవ్రత తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యల్లో కొంత వేగం పెరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఓ ప్రకటన వెలువడింది. మరోవైపు వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మరణించిన వారి పట్ల ప్రధాని సంతాపం వ్యక్తం చేశా రు. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50 వేల సాయం అందించనున్ననట్లు తెలిపారు. తలియే గ్రామం జల సమాధి! రాయ్గఢ్ జిల్లా తలియే గ్రామం జల సమాధి అయింది. ఈ గ్రామంపై కొండచరియలు విరిగిపడడంతో మొత్తం 35 ఇళ్లలోని వారు సజీవ సమా ది అయ్యారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు అందిన వివరాల మేరకు 38 మృతదేహాలను బయటికి తీయగలిగారు. శిథిలాల కింద మరో 36 మందికిపైగా ఉన్నట్టు భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ సంఘటన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర విషాదంతోపాటు కలకలాన్ని రేకెత్తించింది. గురువారం సాయం త్రం 4.30 గంటల ప్రాంతంలో తలియే గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండ కింద ఉన్న ఈ గ్రామంలో సుమారు 35 ఇళ్లుండేవి. వరదలతో ఈ గ్రామమే కనపడకుండాపోయింది. తలి యే గ్రామం కన్పించకుండా మట్టిదిబ్బలు, బురదమయంగా మారింది. కొండప్రాం తంలో ఈ గ్రామం ఉండడం, రోడ్లు జలమయం కావడం, కుంగిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు. -
పదవిలో పదిలం పింఛన్ కోసం మరణం
బతికుండగానే ‘చచ్చిపోయాడట!’ భార్య పేరుతో వితంతు పింఛన్ జన్మభూమి సభ్యుడి కక్కుర్తి ఇదేమి చోద్యమంటున్న జనం కాకినాడ : ‘ఫ్రీగా వస్తే ఫినాయిలైనా’ తాగేస్తాడన్న సామెతను అక్షరాలా నిజం చేశాడో జన్మభూమి కమిటీ సభ్యుడు. రూ.వెయ్యి పింఛన్ సొమ్ము కోసం బతికుండి కూడా చనిపోయినట్టుగా అధికారులను తప్పుతోవ పట్టించి భార్య పేరుతో వితంతు పింఛన్ మంజూరు చేయించుకున్నాడు. జన్మభూమి కమిటీ సభ్యునిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని పింఛన్ పొందిన సదరు వ్యక్తి వ్యవహారం బయటపడడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... కాకినాడ సూర్య నారాయణపురానికి చెందిన మేడిశెట్టి అప్పలరాజు 32వ డివిజన్ జన్మభూమి కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నాడు. పింఛన్ల మంజూరు, పంపిణీలో పెత్తనం చలాయిస్తున్న సదరు అప్పలరాజు పనిలోపనిగా తన కుటుంబంలో ఓ పింఛన్ మంజూరు చేయించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన భార్య మేడిశెట్టి సత్యవతి పేరిట వితంతు పింఛన్కు దరఖాస్తు చేయించాడు. జన్మభూమి కమిటీ సభ్యునిగా ఇతని సిఫార్సుకు కార్పొరేషన్ సిబ్బంది కూడా తలాడించడంతో ఇటీవల కొత్తగా మంజూరైన పింఛన్లలో అతని భార్య సత్యవతి పేరిట (ఐడి నెంబర్ 104807376) పింఛన్ కూడా వచ్చేసింది. ఈ నెల 2వ తేదీన 32వ డివిజన్కు సంబంధించిన శెట్టిబలిజ రామాలయం వద్ద పింఛన్ల పంపిణీ కేంద్రంలో ఆమె రూ.వెయ్యి పింఛన్ కూడా తీసుకుంది. కొత్త పింఛన్ కావడంతో ఈమె ఎవరా? అని ఆరా తీస్తే జన్మభూమి కమిటీ సభ్యుని భార్య అని తేలింది. ఎంతో మంది అర్హులైన వితంతువుల పింఛన్ కోసం ఎదురుచూస్తుండగా వారందరినీ పక్కన పెట్టి ఈమెకు పింఛన్ మంజూరు చేయడంపై స్థానికులు విస్మయ వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు జన్మభూమి కమిటీ సభ్యునిగా ఉంటూనే తన భార్యపేరుతో ఎలా పింఛన్ తీసుకుంటాడని స్థానకులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే డివిజన్కు చెందిన మరో వ్యక్తి కూడా బతికుండగానే ఏడాది నుంచి వితంతు పింఛన్ పొందుతున్నట్టు ఆరోపణలున్నాయి. అతను కూడా జన్మభూమి కమిటీ సభ్యుడు మేడిశెట్టి అప్పలరాజుకు సన్నిహితంగా మెలిగే వ్యక్తేనని స్థానికులు చెబుతున్నారు. ఎలా మంజూరైంది? వితంతు పింఛన్ మంజూరు కావాలంటే తప్పనిసరిగా భర్త మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్, రేషన్కార్డు, ఆధార్ కార్డులను దరఖాస్తుతోపాటు జతచేయాల్సి ఉంటుంది. అవన్నీ సక్రమంగా ఉంటేనే పింఛన్ కోసం సిఫార్సు చేసి మంజూరు చేస్తారు. బతికున్న మేడిశెట్టి సత్యవతి భర్త అప్పలరాజు పేరిట డెత్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది?. నకిలీ సర్టిఫికెట్ జత చేశారా? ఇవేమీ లేకుండా సిఫార్సు చేశారా? అన్న అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మంజూరు చేసిన విధానంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు విచారణ చేసి చర్యలు... జన్మభూమి కమిటీ సభ్యుని భార్య వితంతు పింఛన్ పొందుతున్నారనే అంశం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – ఎస్. అలీమ్ భాషా, కమిషనర్, కాకినాడ నగరపాలక సంస్థ