breaking news
chairman of the board
-
చైర్మన్కు విచక్షణాధికారం వద్దు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణపై రూపొందించిన వర్కింగ్ మాన్యువల్లో పలు అంశాలకు సవరణలు చేయాలని తెలంగాణ కోరుతోంది. ముఖ్యంగా బోర్డు చైర్మన్కు ఓటు హక్కు విషయంలో విచక్షణాధికారాలను వ్యతిరేకిస్తోంది. చైర్మన్కు ఓటు వేసే హక్కు వద్దని, కేవలం రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు, సమన్వయం వరకే ఆయన అధికారాలు ఉండేలా మాన్యువల్లో మార్పులు చేయాలని సూచిస్తోంది. ఈ మేరకు మాన్యువల్లో చేయాల్సిన మార్పులు చేర్పులపై చర్చించేందుకు నీటి పారుదల శాఖ అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్కే జోషితో భేటీ అయ్యారు. ఒక రాష్ట్రానికే ఒత్తాసు మంచిది కాదు... కృష్ణా బోర్డు వర్కింగ్ మాన్యువల్ ప్రకారం చైర్మన్కు విచక్షణాధికారాలు ఉంటాయి. ఓటు హక్కు కూడా ఉంటుంది. బోర్డు సమావేశంలో ఏదైనా ఒక అంశంపై ఓటింగ్ నిర్వహించినప్పుడు రెండు రాష్ట్రాలకూ సమానంగా ఓట్లు వస్తే చైర్మన్ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే దీనిని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనల అమలు వరకే బోర్డు చైర్మన్ వ్యవహరించాలని.. అలాకాకుండా ఓటింగ్లో పాల్గొనడం ద్వారా ఏదో ఒక రాష్ట్రానికి ఒత్తాసు పలకడం మంచిది కాదని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. బోర్డు పరిధిలో సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం లభించకుంటే అపెక్స్ కౌన్సిల్కు సిఫార్సు చేయాలని, అక్కడా పరిష్కారం కాకుంటే ట్రిబ్యునల్కు కేంద్రం సిఫార్సు చేస్తుందని పేర్కొంటోంది. ఇక బోర్డు వర్కింగ్ మాన్యువల్లో ప్రత్యేకంగా పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో ఉన్న హంద్రీనీవా, గాలేరు–నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, వెలిగోడు, జూరాల ప్రాజెక్టులనే ప్రస్తావించి.. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులను విస్మరించారు. అలాగే గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులనూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 11వ షెడ్యూల్ను పట్టించుకోకూడదని తెలంగాణ కోరుతోంది. ఇక ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో తెలం గాణ రాష్ట్రం విభేదిస్తోంది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడి అమల్లోకి వచ్చేవరకూ బోర్డు పరిధిని నిర్ణయించరాదని పేర్కొంటూ తన వాదన సిద్ధం చేసింది. వీటికి సీఎస్ ఆమోదం తెలపడంతో ఒకట్రెండు రోజుల్లో అధికారులు తమ వినతులతో బోర్డుకు లేఖ రాయనున్నారు. -
చదలవాడకే పట్టం !
* టీటీడీ పాలక మండలినియామకంపై సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి * ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు బోర్డు చైర్మన్గా ఎంపిక * బోర్డులో జిల్లా నుంచి బీజేపీ నేత జీ.భానుప్రకాష్రెడ్డికి అవకాశం సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి నియామకంపై సీఎం చంద్రబాబు కసరత్తును పూర్తిచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని బోర్డు చైర్మన్గా నియమించాలని నిర్ణయించారు. బోర్డు సభ్యులుగా సినీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు, సీఎం రవిశంకర్, ఎమ్మెల్యేలు నారాయణస్వామినాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఆకుల సత్యనారాయణ, జిల్లాకు చెందిన బీజేపీ నేత జీ.భానుప్రకాష్రెడ్డి, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరిని సభ్యులుగా నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అక్టోబర్ మొదటి వారంలో వెలువడే అకాశం ఉందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. టీటీడీ చైర్మన్గా పదవీ కాలం పూర్తయ్యే వరకూ కుర్చీ దిగేది లేదని భీష్మించిన కనుమూరి బాపిరాజును ఆర్డినెన్స్ ద్వారా ఆగస్టు 14న ప్రభుత్వం పదవీచ్యుతుడిని చేసింది. ఆ తర్వాత రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి జగదీష్చంద్ర శర్మ అధ్యక్షతన స్పెసిఫైడ్ అథారిటీని నియమించింది. టీటీడీకి పాలక మండలి నియమించాలని టీడీపీ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు చంద్రబాబు తలొగ్గారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఎరగావేసి నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చంద్రబాబు టీడీపీ తీర్థం ఇచ్చారు. ఎన్నికల్లో తిరుపతి శాసనసభ స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశించిన చదలవాడ కృష్ణమూర్తిని టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని ఇస్తానని హామీ ఇచ్చి సంతృప్తిపరిచారు. ఆ మేరకు చదలవాడకు చంద్రబాబు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్గా వ్యవహరిస్తున్న రాయపాటికి చెందిన సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా రూ.200 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సుగా అప్పగించిన చంద్రబాబు.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి నుంచి ఆయనను తప్పుకునేలా చేశారు. ఇదే సమయంలోనే టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కోసం చదలవాడ కృష్ణమూర్తి, రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీపడ్డారు. గాలికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వొద్దని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు. చదలవాడకు బోర్డు చైర్మన్ పదవి ఇవ్వకూడదని సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే వెంకటరమణ ఒత్తిడి తెచ్చారు. ఇదే అంశంపై బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ద్వారా సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. మాజీ మంత్రి గాలికి ఎమ్మెల్సీ పదవి ఇస్తాననే ఆశ చూపి.. టీటీడీ బోర్డు చైర్మన్ రేసు నుంచి ఆయన తప్పుకునేలా చేయడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో చదలవాడకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీని నిలుపుకోలేకపోతే.. ఎన్నికల్లో ఆయన వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని చంద్రబాబు భావించారు. ఆ క్రమంలోనే తన అస్మదీయుడు మాగంటి మురళీమోహన్కు ఇవ్వాలనుకున్న టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని చదలవాడకు కట్టబెట్టాలని నిర్ణయించారు. సాధారణంగా టీటీడీ పాలక మండలి పదవీకాలం రెండేళ్లు ఉండేలా ఏర్పాటుచేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ.. ఇప్పుడు పాలక మండలిని నియమించడంలో ఆనవాయితీని చంద్రబాబు పక్కన పెట్టారు. కేవలం ఏడాదికి మాత్రమే టీటీడీ పాలక మండలిని నియమించాలని నిర్ణయించారు. బోర్డు చైర్మన్గా చదలవాడను ఖరారు చేసిన నేపథ్యంలో.. జిల్లాలో టీడీపీ నేతలకు అందులో చోటు ఇవ్వకూడదని చంద్రబాబు నిశ్చయించారు. జిల్లా నుంచి బీజేపీ నేత భానుప్రకాష్రెడ్డికి మాత్రమే టీటీడీ బోర్డులో చోటు కల్పించారు. సినీ దర్శకుడు కే.రాఘవేంద్రరావు, సీఎం రవిశంకర్, కర్ణాటకకు చెందిన అనంత్, ఎమ్మెల్యేలు నారాయణస్వామినాయుడు, ఆకుల సత్యనారాయణ, బండారు సత్యనారాయణమూర్తి, తెలంగాణ, తమిళనాడుల నుంచి ఒక్కొక్కరికి బోర్డులో అవకాశం కల్పించాలని నిర్ణయించారు. టీటీడీ పాలక మండలి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు అక్టోబర్ మొదటివారంలో మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత వెలువడే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.