breaking news
cancer disease woman
-
బంగారం.. నీకెన్ని కష్టాలు..
ఆమె పేరు బంగారు లక్ష్మి.. పేరులో ఉన్న కళ.. ఆమె జీవితంలో లేకపోయింది. చదువులో బంగారమైనా.. లక్ష్మీ కటాక్షం లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తోంది. క్యాన్సర్ సోకడంతో ఆమె ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఆ మహమ్మారి కారణంగా ఎడమ కాలిని తీసేశారు. ఏ రోజు కూలి పనులకు వెళ్తే.. ఆ రోజు కడుపు నింపుకునే కుటుంబం వారిది. లేకపోతే పస్తులే. తండ్రి చనిపోయాడు. తల్లి రెక్కల కష్టమే ఆ కుటుంబానికి ఆధారం. చదువు కోవాలన్న కోరిక ఉంది. అందమైన జీవనం సాగించాలన్న ఆశా ఉంది. దీనికి పేదరికమే అడ్డుగా మారింది. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేస్తే ఆమె ప్రాణం నిలబడుతుంది. ఆమె ఆశయం నెరవేరుతుంది. తగరపువలస(భీమిలి): పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయతీకి చెందిన పాండ్రంగి బంగారులక్ష్మి బంగారు భవిష్యత్ను క్యాన్సర్ కబలిస్తోంది. చిన్న కుటుంబం.. కలతలు లేకుం డా సాగిపోతున్న వీరి జీవన గమనంలో విధి ఆటలాడుకుంది. అయిదేళ్ల కిందట బంగారులక్ష్మి తండ్రి కృష్ణ అనారోగ్యంతో మృత్యువాత పడగా, సోదరి నాగమణి వివాహం కోసం ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తల్లి అప్పయ్యమ్మ రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయ పనులకు వెళ్తూ బంగారులక్ష్మిని, కుమారుడు కృష్ణకు చదివిం చింది. బంగారులక్ష్మి ఏడో తరగతి వరకు పాం డ్రంగి యూపీ పాఠశాలలో చదువుకుని ఎనిమిదో తరగతికి గాను పద్మనాభం కేజీబీవీ పాఠశాలలో చేరింది. అప్పటికే ఒంట్లో తిష్టవేసిన బోన్ క్యాన్సర్ ఆమె ఎడమకాలిని తినేసింది. మోకాలి భాగం బాగా వాచిపోవడంతో అక్కడి వరకు కాలిని తీసేయాల్సి వచ్చింది. ఏడాది పాటు ఇంట్లోనే ఉండిపోయిన ఆమె ఆరో గ్యం తరువాత కూడా క్షీణిస్తుండటంతో ఊపిరితిత్తులకు కూడా క్యాన్సర్ సోకినట్టు వైద్యులు వెల్లడించారు. వర్షం పడితే జాగారమే.. గట్టిగా వర్షం పడితే ఆ రాత్రి వారికి జాగారమే. కారిపోయే ఇంటిలో తెల్లార్లూ ముగ్గురూ వర్షం ఆగేవరకు ఎదురు చూస్తుంటారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని వేధించే ప్రభుత్వం వీరి ఇంటికి మాత్రం ఆ అవసరాన్ని గుర్తించ లేదు. రాత్రయినా, వానయినా బహిర్భూమికి వెళ్లాలంటే బంగారు లక్ష్మి ఊత కర్రలతో వ్యవసాయ భూముల్లోకి వెళ్లాల్సిందే. అందుబాటులో తల్లి ఉంటే ఆమెకు తోడుగా వెళ్తుంది. బాధతోనే చదువు పూర్తి క్యాన్సర్ కారణంగా శరీరానికి వచ్చిన బాధను పంటి బిగువున భరిస్తూనే 2015–2018 మధ్య రేవిడి–వెంకటాపురం ఉన్నత పాఠశాలలో 8, 9, 10 తరగతులు పూర్తి చేసింది. పదో తరగతిలో 8.3 గ్రేడ్ పాయిం ట్లు సాధించింది. పాండ్రంగి నుంచి రేవిడి హైస్కూల్కు మూడు కిలోమీటర్లు ఆమె బస్సులలోనే ప్రయాణించి చదువు పూర్తి చేసింది. ఇంటర్మీడియెట్ బైపీసీలో చేరాలన్న ఆమె కోరికకు పేదరికం అడ్డంగా నిలిచింది. మరోవైపు క్యాన్సర్కు చికిత్స కోసం కీమో థెరపీ చేయించుకోవాలన్నా.. ఆర్థిక పరిస్థితి సహకరించక ఇంటి వద్దే దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఒకసారి కీమో థెరపీకి రూ.30 వేలు వరకు అవుతుందని వైద్యులు తెలిపారు. మరో వైపు సోదరుడు కృష్ణ డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నాడు. తల్లి కూలికి వెళితేనే వారికి బువ్వ.. తల్లి అప్పయ్యమ్మ వ్యవసాయ పనులు ఉండి వెళ్తే వచ్చే రూ.150–200లే వారికి ఆధారం. చెరువు పనులకు వెళ్లినా రోజుకు రూ.100 వస్తుందో లేదో తెలియని అయోమయం. ఏ పనీ లేనినాడు ఆ కుటుంబానికి పస్తులే. తినడానికే కష్టంగా ఉన్న ఆ కుటుంబంలో బంగారులక్ష్మికి ఖరీదైన వైద్యం కాదు కదా.. క్యాన్సర్ కారణంగా రోజూ వెంటాడే ఒంటి నొప్పులకు మందులు కూడా కొనుక్కోలేని దయనీయస్థితిలో ఉన్నారు. అప్పయ్యమ్మ ఉదయాన్నే వంట చేసి కూలి పనులకు వెళ్లిపోతుంది. ఆమె వచ్చే వరకు బంగారులక్ష్మి ఇంటి వద్ద ఒంటరిగా బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతుంది. చదువుకోవాలని ఉన్నా.. నాకు స్నేహితులతో కలసి చదువుకోవాలని ఉన్నా ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. దీంతో పదో తరగతి తర్వాత ఇంటికే పరిమితమయ్యాను. రాత్రి వేళ వెన్ను వైపు విపరీతమైన నొప్పి వస్తుంది. ఊర్లో మందుల షాపు నుంచి మందులు కొనుక్కుని వేసుకుంటే ఆ సమయానికి నిద్ర పడుతుంది. నాలాంటి కష్టం ఎవరికీ రాకూడదు. – పాండ్రంగి బంగారులక్ష్మి నా కుమారుడికి దారి దొరికే వరకు.. నేను కూలికి వెళ్తేనే ఇంట్లో పొయ్యి వెలిగేది. ప్రస్తుతం రూ. 1.50 లక్షల వరకు అప్పు ఉంది. నా కొడుకు కృష్ణ ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. బంగారు లక్ష్మికి వైద్యం చేయించాలన్నా.. తలకుమించి భారంగా ఉంది. పాపకు మెరుగైన వైద్యం చే యించడానికి దాతలు ముందుకు వస్తే ఆరోగ్యం స్థిమితపడి చదువుకుంటుంది. వైద్యం కోసం సాయం చేయాలనుకునే వారు పద్మనాభంలోని ఆంధ్రాబ్యాంకు ఖాతా నంబర్ 040610100100097 లేదా 79813 49907లో సంప్రదించవచ్చు. – పాండ్రంగి అప్పయ్యమ్మ, పాండ్రంగి, పద్మనాభం మండలం -
బాధను దిగమింగి...
విధి ఆటలో వారు పావులుగా మారారు....వారిది ఎవరూ తీర్చలేని బాధ. అయినా ధైర్యంగా ముందడుగు వేశారు. గుండెల్లో గూడుకట్టుకున్న విషాదానికి అక్కడే సమాధి చేశారు. లక్ష్యం చూపిన మార్గంలో పయనించారు. చిన్నచిన్న సమస్యలను ఎదుర్కోలేక వణికిపోతున్న యువతకు వారు మార్గదర్శకులయ్యారు. ఒకరు పుట్టెడు దుఃఖం, మరొకరు చర్మాన్ని దహించివేస్తున్న వ్యాధితో గురువారం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. బొబ్బిలి:నాన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన దుఃఖంలో ఒకరు.. శరీరాన్ని పట్టి పీడిస్తున్న రోగాన్ని అదిమిపట్టి మరొకరు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు గురువారం హాజరయ్యారు... విషాదంలో ఉన్నా కొండంత బలాన్ని తెచ్చుకుని పార్వతీపురం పట్టణంలోని కుసుమ గుడ్డి వీధికి చెందిన సంచాన శ్రీవల్లి భాస్కర కళాశాలలో పరీక్షకు హాజరైంది. అలాగే ఎనిమిదో ఏట నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చదువే లక్ష్యంగా బొబ్బిలి అంధుల పాఠశాలలో ఉంటున్న చిన్ని లక్ష్మి బొబ్బిలి వాసు జూనియర్ కళాశాలలో పరీక్షకు హాజరైంది. వీరిద్దరూ యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచారు.. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. పార్వతీపురం పట్టణంలోని కుసుమగుడ్డివీధికి చెందిన సంచాన శ్రీనివాసరావు టైలర్ వృత్తి చేస్తున్నాడు. స్నేహితుడి పెళ్లికి బయలుదేరి బొబ్బిలి సమీపంలో బుధవారం రాత్రి మృత్యువాత పడ్డాడు... తెల్లారితే కూతురు శ్రీవల్లికి పరీక్ష... మొదటి రోజు పరీక్షకు తానే ద గ్గరుండి దింపి ధైర్యం చెప్తానని ఇంట్లో చె ప్పి వెళ్లిన ఆయన మరణ వార్త గంటలోగానే కుటుంబ సభ్యులు వినాల్సి వచ్చింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు శ్రీవల్లి గుండలలిసేలా రోదిస్తోంది, తెల్లారగానే బొబ్బిలి వచ్చి తండ్రి మృతదేహాన్ని చూసి భోరుమంది... పరీక్ష రాయడానికి నన్ను ఎవరు తీసుకెళతారంటూ తండ్రి మృతదేహం వద్ద రోదించింది.. చివరకు తండ్రి మాటలు గుర్తుకు వచ్చి తాను చదివి ఉత్తీర్ణురాలై ప్రయోజకురాలుగా నిలబడతానని తనను తాను సముదాయించుకుంది. గుండెనిండా ధైర్యాన్ని నింపుకొని పార్వతీపురం వెళ్లి పరీక్షా కేంద్రంలో కూర్చుంది.. అలాగే శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన చిన్ని లక్ష్మి చర్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. చిన్నప్పటి నుంచి కళ్లు కనపడకపోవడంతో బొబ్బిలి సమీపంలోని భోజరాజపురం వద్ద ఉన్న అంధుల పాఠశాలలో ఉంటూ చదువుతోంది. ఆమె నాలుగో తరగతిలో ఉండగానే క్యాన్సర్ సోకింది. అప్పటి నుంచి అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాల యాజమాన్యం మందులు ఇప్పిస్తున్నారు.. ఆ వ్యాధి రోజు రోజుకూ ఎక్కువవుతూ వచ్చింది. రోగం ముదురుతున్నా చదువు కోవాలన్న పట్టుదల లక్ష్మిలో మరింత పెరిగింది. ఆ వ్యాధితో బాధపడుతూనే పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. గురువారం నుంచి ప్రారంభమైన ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షకు స్థానిక వాసు జూనియర్ కళాశాలకు హాజరైంది. పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహంతో తాను ఇంతవరకూ వచ్చానని, తనకు టీచరు కావాలని ఆశగా ఉందని లక్ష్మి చెబుతోంది. లక్ష్మి పరీక్షలు రాసేందుకు సహాయకారిగా (స్క్రైబ్) అవసరమున్నా ఏ విద్యార్థీ రావడానికి సుముఖత చూపకపోవడంతో అంధుల పాఠశాల టీచర్నే ఇందుకు వినియోగించారు. లక్ష్మి ఎంత వరకూ చదివితే అంతవరకూ అండగా ఉంటామని అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ పాల్సన్ చెప్పారు.