breaking news
BOT projects
-
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్జీపీటీ లాంటి ఏఐ చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్మన్ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్మన్ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్మన్ పోస్ట్తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్ఫేక్లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
సొంతస్థలాలను లీజుకిద్దాం.. బీవోటీ వైపు టీఎస్ఆర్టీసీ చూపు
సాక్షి, హైదరాబాద్: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న టీఎస్ఆర్టీసీ ఆదాయమార్గాలను వెతుకుతోంది. ఆదాయం పెంచుకొని నష్టాలను అధిగమించేందుకుగాను బీవోటీ (బిల్ట్–ఆపరేట్–ట్రాన్స్ఫర్) ప్రాజెక్టులపై దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానప్రాంతాల్లో ఉన్న సొంతస్థలాలను బీవోటీ ప్రాజెక్టులకు లీజుకిచ్చి ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా సర్వే నిర్వహించి 50 ప్రాంతాలను గుర్తించింది. వీటికి వీలైనంత త్వరలో టెండర్లు పిలవాలని భావిస్తోంది. వీటిద్వారా ఎంత ఆదాయం వస్తుందనేదానిపై ఇంకా ఓ అంచనాకు రాకున్నా, గరిష్టమొత్తాన్ని సంపాదించాలని మాత్రం భావిస్తోంది. ఎకరం.. ఎకరంన్నర స్థలం చొప్పున.. ఆర్టీసీకి రాష్ట్రవ్యాప్తంగా 1,400 ఎకరాల భూములున్నాయి. వీటిల్లో భవనాలు, ఇతర వినియోగాలకుపోను, 150 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. తొలుత వీటినే ఈ ప్రాజెక్టుకు వినియోగించాలని ఆర్టీసీ భావిస్తోంది. కొన్నిచోట్ల డిపోలున్నా, వాటిని మూసేయాలని యోచిస్తోంది. ప్రధానప్రాంతాలకు దగ్గరగా ఉన్న అలాంటివాటిని కూడా బీవోటీ ప్రాజెక్టుకు వినియోగించాలని భావిస్తోంది. ఇటీవల రీజియన్ స్థాయి అధికారులతో బస్భవన్ వర్గాలు ఆ వివరాలు తెప్పించుకున్నాయి. ఎకరం, ఎకరంన్నర విస్తీర్ణంలో బిట్లు, బిట్లుగా ప్రాజెక్టులకు కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. 33 ఏళ్లపాటు లీజుకు.. ఆయాస్థలాల ఎస్ఆర్వో(సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్) విలువను రెట్టింపు చేసి, అందులో 5 శాతం మొత్తాన్ని ఆఫ్ఫ్రంట్ విలువగా నిర్ధారిస్తారు. బీవోటీ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కో బిట్కు దాని విలువ ఆధారంగా లైసెన్స్ ఫీజును నిర్ధారించి టెండర్లు పిలుస్తారు. ఆయాస్థలాలను 33 ఏళ్లపాటు లీజుకు ఇస్తారు. ముందుగా నిర్ధారించిన ఆఫ్ఫ్రంట్ విలువను ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. తొలి రెండేళ్లు (నిర్మాణ సమయంగా) లైసెన్సు ఫీజు హాలీడేగా ప్రకటిస్తారు. ఆ తర్వాత నుంచి నిర్ధారిత లైసెన్సు ఫీజు వసూలు చేస్తారు. ప్రతి ఏడాది దీన్ని ఐదు శాతం మేర పెంచి, మొత్తం ఫీజుపై ఐదు శాతాన్ని ప్రతి యేడు ఫీజుగా ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా లీజు గడువు తీరేవరకు చెల్లించాలి. తర్వాత ఆ ప్రాజెక్టు ఆర్టీసీ సొంతమవుతుంది. ఆర్టీసీ ఎండీ పాత భవనం ప్రాంతం కూడా... హైదరాబాద్లోని ఆర్టీసీ పాత ప్రధాన కార్యాలయం ఉన్న స్థలం, మియాపూర్ బస్బాడీ భవన స్థలం, ఇతర ప్రాంతాల్లో డిపోలకు కేటాయించిన స్థలాలు బీవోటీ ప్రాజెక్టుకు అనువుగా ఉంటాయని ఆ సంస్థ అధికారులు భావిస్తున్నారు. ఎండీ పాత భవన ప్రాంతం ప్రస్తుతం ఖాళీగా ఉంది. మియాపూర్లోని బస్బాడీ యూనిట్ను ఉప్పల్ వర్క్షాపునకు తరలించి దాన్ని కూడా వాణిజ్య అవసరాలకు వాడాలని ఇప్పటికే నిర్ణయించారు. కానీ, అందులో భవనం ఉన్నందున ఇప్పటికిప్పుడు దాన్ని బీవోటీ ప్రాజెక్టుకు వీలుగా టెండర్లలో ఉంచాలా వద్దా అన్న విషయమై నిర్ణయం తీసుకోలేదు. -
ఇక.. వేగంగా ట్రిప్లింగ్
కాజీపేట– బల్లార్షా మధ్య నిర్మాణం రూ. 2063 కోట్ల అంచనా వ్యయం ప్రణాళిక సిద్ధం చేసిన కేంద్రం బీవోటీ పద్ధతిలో పనులు ? సాక్షి, హన్మకొండ : నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతున్న కాజీపేట–బల్లార్ష ట్రిప్లింగ్ పనులు వేగం పుంజుకోనున్నాయి. ఐదేళ్ల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీగా నిధులు సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మహారాష్ట్రలోని బల్లార్ష–కాజీపేట మధ్య ఉన్న 201 కిలోమీటర్ల డబ్లింగ్ (అప్లైన్, డౌన్లైన్) రైలు మార్గాన్ని ట్రిప్లింగ్ (మూడోలైను)గా అభివద్ధి చేస్తున్నారు. ఐదేళ్ల కిందట ఈ పనులు ప్రారంభమైనా నిధుల లేమి కారణంగా నత్తనడకన సాగుతున్నాయి. ఐదేళ్ల వ్యవధిలో కనీసం యాభై కిలోమీటర్ల ట్రాక్ను నిర్మించలేక పోయారు. కేవలం మంచిర్యాల వద్ద గోదావరి నదిపై మూడో వంతెన నిర్మాణం పూర్తయింది. ఈ వంతెనకు అటు ఇటు కొన్ని కిలోమీటర్ల వరకే ట్రిప్లింగ్ పనులు జరిగాయి. రోజురోజుకి ఈ మార్గంలో పెరుగుతున్న రద్దీని తట్టుకునేందుకు మూడో మార్గం తప్పనిసరైంది. దీంతో ట్రిప్లింగ్ పనులు వేగం పెంచేందుకు నిధుల సమీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. బల్లార్షా – కాజీపేట ట్రిప్లింగ్కు నిర్మాణంపై ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు ట్రిప్లింగ్ పనులకు రూ.2063 కోట్ల వ్యయం అవుతుందని కేంద్ర ఆర్థికశాఖ అంచనా వేసింది. ఈ నిధులను రైల్వేశాఖ, ప్రైవేటు సంస్థల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. మూడోలైను ద్వారా ఎక్కువగా వాణిజ్య పరమైన సరుకుల రవాణా (గూడ్సు)కు ఉపయోగించనున్నారు. దీంతో ట్రిప్లింగ్ పనులను బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (బీఓటీ) పద్ధతిలో చేపట్టడంపై చర్చలు జరుగుతున్నాయి. ఐదేళ్లుగా.. చెన్నై – న్యూఢిల్లీ గ్రాండ్ట్రంక్ మార్గంలో నాగ్పూర్ – విజయవాడ వరకు ఉన్న మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో బల్లార్ష – కాజీపేట – విజయవాడల మధ్య ఉన్న 400 కిలోమీటర్ల మార్గంలో ప్రస్తుతం అప్లైన్, డౌన్లైను నిరంతరం రద్దీగా ఉంటున్నాయి. ఈ మార్గంలో కొత్త రైలును ప్రవేశపెట్టడం కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. రద్దీ కారణంగా గూడ్సు రైళ్లు గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు 2012–13 రైల్వే బడ్జెట్లో బల్లార్షా – కాజీపేట – విజయవాడ మార్గాన్ని ట్రిప్లింగ్ (మూడోలైను) చేస్తామని రైల్వేమంత్రి ప్రకటించారు. గత నాలుగేళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. బెల్లంపల్లి – పెద్దపల్లిల మధ్య ఈ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. -
వచ్చే ఏడాది లాభాల్లోకి
ఐవీఆర్సీఎల్ గ్రూపు చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి ⇒రెండేళ్లలో రూ.800 కోట్ల నష్టాలు పూడ్చుకుంటాం ⇒మార్చిలోగా రూ. 2,500 కోట్ల రుణభారాన్ని వదుల్చుకుంటాం ⇒బీవోటీలకు దూరం, నీటి ప్రాజెక్టులపై ప్రధానంగా దృష్టి ⇒రెండేళ్లలో రూ. 8,000 కోట్ల ఆదాయం లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ కంపెనీ ఐవీఆర్సీఎల్ సాధ్యమైనంత తొందరగా అప్పుల భారాన్ని వదిలించుకొని లాభాల పట్టాలు ఎక్కడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా మొత్తం బీవోటీ ప్రాజెక్టులను పూర్తిగా విక్రయించడమే కాకుండా, కొత్త బీవోటీ ప్రాజెక్టులను చేపట్టకుండా ఈపీసీ ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టిసారించనున్నట్లు ఐవీఆర్సీఎల్ గ్రూపు చైర్మన్ ఇ.సుధీర్ రెడ్డి తెలిపారు. వచ్చే మూడు నెలల్లో మూడు బీవోటీ ప్రాజెక్టులను విక్రయించడం ద్వారా సుమారు రూ. 2,500 కోట్ల రుణ భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా సుమారు రూ.600-800 కోట్ల మూలధనం చేతికి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ చేతిలో మొత్తం ఎనిమిది బీవోటీ ప్రాజెక్టులు ఉన్నాయని, అందులో మూడు ఈ త్రైమాసికంలోగా, తర్వాతి తొమ్మిది నెలల్లో మిగిలిన ప్రాజెక్టులను విక్రియించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుధీర్ తెలిపారు. ఈ బీవోటీ ప్రాజెక్టులపైన సుమారు రూ. 3,500 కోట్ల రుణం ఉందని, వీటిని విక్రయించడం ద్వారా సుమారు రూ. 300 - 350 కోట్ల వడ్డీ భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గ్రూపు మొత్తంపై సుమారు రూ. 6,500 కోట్ల రుణ భారం ఉండగా, వడ్డీల కింద గతేడాది రూ. 650 కోట్లు చెల్లించింది. కంపెనీ వ్యాపార ప్రణాళికలను వివరించడానికి సోమవారం హైదరాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది కంపెనీ లాభాల్లోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీకి రూ. 800 కోట్ల పేరుకుపోయిన నష్టాలు ఉన్నాయని, వీటని వదిలించుకోవడానికి మరో రెండు మూడేళ్లు పడుతుందన్నారు. ఈపీసీపైనే దృష్టి బీవోటీ ప్రాజెక్టులకు దూరంగా ఉండి ఈపీసీ కాంట్రాక్టులపైనే దృష్టిసారించనున్నట్లు సుధీర్ తెలిపారు. అందులో అత్యంత అనుభవం ఉన్న నీటిపారుదల విభాగంపైనే అత్యధికంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐవీఆర్సీఎల్ రూ. 18,000 కోట్ల ఆర్డర్లలో 50 శాతం నీటిపారుదల విభాగం నుంచే ఉండగా, ఆదాయంలో 70 శాతం, లాభాల్లో 80 శాతం నుంచే వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టిసారించడం, వాటర్గ్రిడ్, నూతన రాజధాని నిర్మాణం వంటి అంశాలు కలిసొస్తాయన్నారు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం సుమారుగా రూ. 5,000 కోట్లు దాటనుందని, ఇది వచ్చే ఏడాది రూ. 6,500 కోట్లకు, రెండేళ్లలో రూ. 8,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. బీవోటీ ప్రాజెక్టులను విక్రయించిన తర్వాత కంపెనీ చేతిలో ఉన్న 1,700 ఎకరాల భూమిని విక్రయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం చూస్తే ఈ భూమి విలువ సుమారుగా రూ. 3,000 కోట్లుగా ఉంది. రూ. 300 కోట్ల క్విప్ ఇష్యూకి వాటాదారుల అనుమతి ఇప్పటికే లభించిందని, ఈ ఇష్యూ వచ్చే ఏడాది ఉండొచ్చన్నారు.