breaking news
Bombs blasts
-
కృష్ణపట్టెలో బాంబుల మోత
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : బాంబుల మోతతో కృష్ణపట్టె ఒక్కసారిగా దద్దరిల్లింది. ఆదివారం అర్ధరాత్రి తిరుమలగిరి మండలం నాయకునితండాలో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తలపించే విధంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు బాంబులు(చేపల వేటకు ఉపయోగించేవి), బీరు సీసాలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో సుమారు 40 ఇళ్లు ధ్వంసం కాగా కూలర్లు, టీవీలు, మంచాలు, వాహనాలు తదితర సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. ఆధిపత్య పోరుకోసం తండాలో తామంటే తామే పై చేయి సాధించాలనే భావనతో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కొంతకాలంగా పోటీపడుతున్నారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓట్లు రావడంతో పాటు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందాడు. ఈనెల 13వ తేదీన శనివారం సఫావత్ తండాలో ఓ శుభకార్యానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మేరావత్ భిక్షాలు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన మేరావత్ స్వామి వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన భిక్షాలు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్వామితో మీకు ఇంత సహాయం చేసినా రాజకీయంగా మాకు ఎందుకు సపోర్టు చేయడం లేదు అని స్వామిని భిక్షాలు నిలదీశారు. దీంతో తండాకు చేరుకున్న స్వామి తన కుమారుడు మేరావత్ దస్రూకు ఆదివారం రాత్రి చెప్పడంతో తన తండ్రిని తిడతావా అని భిక్షాలును దస్రూ నిలదీయడంతో ఘర్షణ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఒకరిపై ఒకరు రాళ్లు, బీరు సీసాలు వేసుకుంటూ దాడికి పాల్పడడంతో ఇళ్లలోని సామగ్రి కూలర్లు, టీవీలు, మంచాలు, వాహనాలు, సుమారు 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్రామంలో భయాందోళన సృష్టించేం దుకు బాంబులు (చేపల వేటకు ఉపయోగించేవి) రువ్వుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దస్లీ, మేరావత్ సోమ్లాకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఇరు వర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కుర్మయ్య తెలిపారు. కృష్ణపట్టెలో బాంబుల సంస్కృతి కృష్ణా పరీవాహక గ్రామాలు కావడం, అటవీ ప్రాంతానికి సమీపాన ఉండడంతో ఈ ప్రాంత ప్రజలు ప్రధానంగా చేపల వేట కోసం తమ పొలాల్లోని అడవి పందుల బారి నుంచి కాపాడుకోవడానికి బాంబులను ఉపయోగిస్తారు. వీటిని సమీపంలో ఉన్న ఆంధ్ర పరిసర ప్రాంతాల నుంచి బాంబుల ముడిసరుకులను తీసుకువచ్చి నిల్వచేస్తారు. అయితే గ్రామాల్లో పార్టీల మధ్య, గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగే క్రమంలో అందుబాటులో ఉన్న బాంబులను ఒకరిపై ఒకరు విసురుకొని భయభ్రాంతులకు గురిచేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారు. తండాలో పోలీసుల పహారా తండాలో చోటుచేసుకున్న ఘర్షణలతో చుట్టుపక్కల తండాల ప్రజలు, గ్రామస్తులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తండాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నాగార్జునసాగర్ సీఐ వేణుగోపాల్, హాలియా సీఐ ధనుంజయ్గౌల ఆధ్వర్యంలో భారీగా పోలీసు పహారా నిర్వహించారు. తిరుమలగిరి, నిడ్మనూరు, హాలియా ఎస్ఐలు కుర్మయ్య, యాదయ్య, వీరరాఘవులు, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. కృష్ణపట్టెలో ఫ్యాక్షన్...యాక్షన్ చందంపేట(దేవరకొండ) : జిల్లాలో నాటు బాంబుదాడుల సంస్కృతి ఎప్పటినుంచో ఉంది. కొన్ని సంవత్సరాలుగా దాడుల సంస్కృతి తగ్గుముఖం పట్టినా అప్పుడప్పుడూ జిల్లా సరిహద్దు గ్రామాల్లో జరిగిన ఘర్షణల్లో వీటిని వాడుతున్నారు. తాజాగా తిరుమలగిరి మండలం నాయకునితండాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య బాంబులదాడి జరగడంతో మరోసారి కంబాలపల్లి బాంబుల దాడులు గుర్తుకొచ్చాయి. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న కంబాలపల్లి గ్రామంలో మాజీఎంపీపీ ముత్యాల సర్వయ్యకు నక్సలైట్ల చేతిలో హతమైన మేకల మల్లయ్యకు ఆధిపత్య పోరు ఉండేది. అప్పుడు టీడీపీ–కాంగ్రెస్ల మధ్య ఉన్న పోరు కాస్త ఇప్పుడు తెలంగాణ పార్టీలో ఉన్న ఇద్దరి మధ్య సాగుతోంది. అప్పట్లో మేకల మల్లయ్య, సర్వయ్యల మధ్య ఎన్నోసార్లు బాంబు, రాళ్లదాడులు జరిగాయి. ఇప్పుడు తెలంగాణ పార్టీలోనే ఉన్న ఇద్దరి మధ్య గత ఏడాది ఫిబ్రవరిలో ఇరువర్గాలు రాళ్లదాడులు చేసుకున్నారు. మేకల మల్లయ్య హత్యకు గురైన అనంతరం ఆ గ్రామంలో జెడ్పీటీసీగా ఉన్న కిషన్రెడ్డి, సర్వయ్యల మధ్య కొంత కాలం ఆధిపత్య పోరు నడిచి పరసర్పర దాడులకు దారితీసింది. వారి మధ్య నాటుబాంబుల దాడి జరిగి ఆ గ్రామం సంచనాలకు కేంద్రబిందువైంది. అయితే కిషన్రెడ్డి గ్రామాన్ని విడిచి ప్రస్తుతం హైదరాబాద్లో ఉండడంతో ఆ వర్గాల మధ్య గొడవలు సద్దుమణిగాయి. అనంతరం సర్వయ్య వర్గంలోనే ఉండి సర్పంచ్గా గెలుపొందిన సర్వయ్యకు గోవిందుకు మధ్య విబేధాలు మొదలయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీపీ రేసులో ఉండి దాదాపు ఎంపీపీ అవుతాడనుకున్న ముత్యాల సర్వయ్య అనుహ్యంగా ఓటమి పాలవ్వడంతో అదే సమయంలో గోవిందుభార్య ఎంపీటీసీగా గెలుపొం దడంతో సర్వయ్యకు దక్కాల్సిన ఆపదవి కాస్త గోవిందు భార్యకు దక్కింది. అప్పటి నుంచి ఈ గొడవలు మరింత తార స్థాయికి చేరాయి. ఎక్కడ బాంబులు పేలినా కంబాలపల్లి గ్రామం ఒక్కసారిగా ఉలికి పడుతుంటుంది. ఆడమనిషని కూడా చూడలే.. ఆడమనిషి అని కూడా చూడకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది వచ్చి మా ఇంటిపై బాంబులతో దాడి చేసి నన్ను చితకబాదారు. ఇంటిపై దాడి చేయడంతో ఇంట్లో సామాను మొత్తం పాడైపోయింది. బాణావత్ దర్సి పార్టీ మారామనే.. మేము ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారమనే కక్షతోనే మా ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. ఓట్లు మాత్రమే వేశాము కాని అసలు పార్టీలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. కక్షపూరితంగా మా ఇంటిపై రాళ్లు, బాంబులు, బీరు సీసాలతో దాడి చేశారు. – మేరావత్ నేజా కళ్లల్లో కారంచల్లి కొట్టారు మేం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామని, గతంలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేశామని కక్ష కట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్లు నాపై దాడి చేశారు. ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి కళ్లల్లో కారం చల్లి నన్ను కొట్టారు. ఆడమనిషి అని కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ కాళ్లతో తన్నారు. – మేరావత్ బుజ్జి -
గుండెల్లో పేలుళ్లు
సాక్షి టాస్క్ఫోర్స్: భారీ పేలుళ్లు.. అడ్డగోలుగా యంత్రాలతో తవ్వకాలు.. రేయింబవళ్లు దూసుకెళుతున్న ట్రాక్టర్లు, టిప్పర్లతో క్వారీల ప్రాంతాల్లో ప్రజల గుండెలు అదురుతున్నాయి. అనుమతి నుంచి బ్లాస్టింగ్ చేసే వరకు క్వారీల నిర్వాహకులు అడుగడుగునా నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. కూలీల రక్షణను గాలికి వదిలేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దీంతో అధికార పార్టీ నేతల అండదండలతో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా అక్రమ మైనింగ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా అధికారుల్లో మార్పు రాలేదు. అక్రమ మైనింగ్కు పాల్పడిన భారీ యంత్రాలను సీజ్ చేయడంగానీ, మందు గుండు సామగ్రి సరఫరాపై చర్యలుగానీ తీసుకోలేదు. వణుకు పుట్టిస్తున్న బ్లాస్టింగ్స్ పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం నడికుడి, కేసానుపల్లి గ్రామాల్లో పేలుడు పదార్థాలతో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల పర్యవేక్షణలో ఇవి కొనసాగుతున్నాయి. మైనింగ్ లీజు ఉన్న కొంత మందిని అడ్డు పెట్టుకుని.. పేలుడు పదార్థాలను వారి పేరు మీద తీసుకుంటున్నారు. శిక్షణలేని కార్మికులతో 20 అడుగుల లోతులో బ్లాస్టింగ్ చేయిస్తున్నారు. నాలుగేళ్లలో సుమారుగా లక్ష మెట్రిక్ టన్నుల తెల్లరాయి తవ్వేశారు. దీనికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాల్లో 295 క్వారీలు, 60 గ్రానైట్, 7 మోజాక్, 17 గ్రావెల్, 102 స్టోన్క్రషర్స్ ఉన్నాయి. జిల్లా మొత్తంలో ఆరుగురికి మాత్రమే బ్లాస్టింగ్ అనుమతి లైసెన్సులు ఉన్నట్టు సమాచారం. అడ్డదారుల్లో జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, అమ్మోనియా నైట్రేట్లను తీసుకొచ్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఇన్సూరెన్స్ ఊసే లేదు కార్మికులకు మైన్స్ సేఫ్టీ నిబంధనల ప్రకారం గ్రూపు ఇన్సూరెన్స్ తప్పనిసరి. అది ఎక్కడా అమలు కావడం లేదు. గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటే ప్రమాదాలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతుంది. ప్రీమియం ఎక్కువగా ఉందని చాలామంది కార్మికులకు లీజుదారులు బీమా చేయడం లేదు. అమ్మోనియా వాడకానికి ప్రాధాన్యం డిటోనేటర్లో లెడ్ ఆక్సైడ్ అనే పేలుడు పదార్థం ఉంటుంది. దాన్ని కేవలం చేతితో రాపిడి చేస్తే పేలుతుంది. జిలెటిన్ స్టిక్స్ వైర్లు కలిపి పేల్చాలి. ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యంతోపాటు శ్రమతో కూడు కున్నది. ఈ నేపథ్యంలో అమ్మోనియం నైట్రేట్ పొడిని రంధ్రాల్లో కూర్చి పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఎక్కువ మంది క్వారీ యజమానులు ఈ పద్ధతికి అలవాటు పడా ్డరు. పిడుగురాళ్లకు చెందిన ఇసాక్ అనే వ్యా పారి తెలంగాణాలోని నల్లగొండ వైపుగా అ డ్డదారుల్లో అమ్మోనియాను జిల్లాకు తరలిం చి వ్యానులో యథేచ్ఛగా విక్రయిస్తున్నాడు. ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వరా ? ఫిరంగిపురం మండలం గొల్లపాలెం క్వారీలో గత ఏడాది మే 27న బ్లాస్టింగ్ కోసం ప్రయత్నిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. ఈ సమయంలో ఉపయోగించిన పేలుడు పదార్థాలకు అనుమతులు లేవు. అప్పటి నుంచి మందు గుండు సామగ్రి రవాణా, నిల్వలపై ఆరా తీసిన వారు లేరు. -
మోడీ టార్గెట్గా బాంబులు పేల్చారు: వెంకయ్యనాయుడు
ఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సహా కీలక నేతలను టార్గెట్గా చేసుకొని బాంబులు పేల్చారని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తాము దేనికీ బెదరం, ర్యాలీలు నిర్వహిస్తారమని చెప్పారు. భద్రతా వైఫల్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. మోడీకి ప్రధాని స్థాయి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను కాంగ్రెస్ విస్మరించిందన్నారు. 182 మీటర్ల అతిపొడవైన వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఈ నెల 31న భూమిపూజ చేస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు.