అంపైరింగ్ తప్పిదాలతో చేజారిన మ్యాచ్
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదట. అలా ఉంది టీమిండియా పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొలి టెస్టులో విజయం సాధిస్తుందనుకున్న భారత జట్టు.. కేవలం అంపైరింగ్ లోపాల వల్లే ఓటమి పాలైందంటే అతిశయోక్తి కాదు. టీ విరామానికి ముందు అజింక్య రహానే 18 పరుగుల వద్ద ఉండగా బాల్ను ఎడ్జి చేసినా కూడా ఎల్బీడబ్ల్యుగా ఔట్ ఇవ్వడం విమర్శల పాలైంది. ఇక చివర్లో భారత జట్టును ఆదుకుంటున్న మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఔటయితే చిన్న పిల్లాడు కూడా వేలెత్తి చూపేలా ఉంది. కేవలం ఆ ఒక్క నిర్ణయమే భారత జట్టు పరాజయానికి కారణమైంది. నీల్ వాగ్నర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ధోనీ ఎడ్జి చేసినప్పుడు అది స్టంప్స్ మీదకు వెళ్లింది. అయితే, అది నోబాల్ అని అనుమానం రావడంతో అంపైర్ స్టీవ్ డేవిస్ థర్డ్ అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. టీవీ రీప్లేలలో వాగ్నర్ పాదం తెల్ల లైను దాటి పడినట్లు స్పష్టంగా కనిపించినా, థర్డ్ అంపైర్కు మాత్రం ధోనీని ఇంటికి పంపాలనే ఉన్ట్లు అనిపించడంతో ధోనీ ఔటయినట్లు ప్రకటించాడు. దాంతో టీవీ వ్యాఖ్యాతలు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్ భారత్ చేజారింది.
అయితే.. అంపైరింగ్ నిర్ణయాలతో పాటు కొందరు బ్యాట్స్మన్ చేజేతులారా వికెట్లను సమర్పించుకోవడం కూడా ఓటమికి కారణమైంది. విరాట్ కోహ్లీ (67), రోహిత్ శర్మ (19), రవీంద్ర జడేజా ముగ్గురూ బాగా ఆడేవాళ్లే. కానీ ఈ ముగ్గురికీ కూడా భారత పరాజయంలో కీలక పాత్ర ఉంది. టీ విరామం తర్వాత మొదటి బంతికే రోహిత్ శర్మ ఔటయ్యాడు. అప్పుడు క్రీజులోకి దిగిన రవీంద్ర జడేజా వీర విహారం చేస్తూ ధోనీకి అండగా నిలిచాడు. దాంతో కివీస్ జట్టు ఆశలు వదిలేసుకుంది. వాళ్లిద్దరూ కలిసి కేవలం 34 బంతుల్లో 54 పరుగులు చేశారు. అప్పుడే భారత్ లక్ష్యానికి చేరువగా కూడా కనిపించింది. కానీ, జడేజా ఓ చెత్తషాట్ కొట్టి మిడాన్లో క్యాచ్ ఇచ్చాడు. ఇలాంటి స్వయం కృతాపరాధాలు కూడా భారత ఓటమికి కారణాలయ్యాయి.