breaking news
anjayya
-
మృతి చెందాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం
గన్ ఫౌండ్రి(హైదరాబాద్): ఆ ఇంటి పెద్ద చనిపోయాడు. కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. మృతదేహానికి అంత్యక్రియలు సైతం నిర్వహించారు. తెల్లారితే దశదిన కర్మ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో చనిపోయాడకున్న వ్యక్తి అనూహ్యంగా బతికొచ్చాడు. సినిమా కథను తలపిస్తున్నా ఈ సంఘటన శనివారం గోల్నాక ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబర్పేట్ గోల్నాక హనుమాన్ నగర్కు చెందిన అంజయ్య (50) మలక్పేట్లోని చాందినీ ఫంక్షన్ హాల్లో పనిచేస్తుంటాడు. మద్యం అలవాటున్న అంజయ్య ఈనెల 1న ఫంక్షన్ హాల్కు వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. ఆ రోజు అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సరోజ, కుమారుడు సాయి, కుమార్తె స్వప్న ఆందోళనకు గురయ్యారు. ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వాకబు చేశారు. అంజయ్య ఫొటోను చూపిస్తూ పలు ప్రాంతాల్లో వెతకసాగారు. ఇదిలావుండగా.. ఈనెల 1వ తేదీన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో గాయాలతో ఉన్న 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ వ్యక్తి మత్తు దిగగానే వైద్యులకు చెప్పకుండా ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఇదే వ్యక్తి మద్యం తాగి ఎంజీబీఎస్ వద్ద అపస్మారక స్థితిలో పడివుండగా పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. రెండోసారి కూడా మత్తు దిగగానే తిరిగి వెళ్లిపోయాడు. ఇదిలావుండగా, సుమారు అదే వయసున్న గుర్తు తెలియని వ్యక్తి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషషన్ పరిధిలోని రాష్ట్ర గ్రంథాలయం ముందు గాయాలతో పడి ఉండడాన్ని గుర్తించి చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ నేపథ్యంలో అంజయ్యను వెదికి పెట్టాలని అతడి కొడుకు ఫొటోతో మీర్పేట్ పోలీస్ స్టేషషన్లో ఫిర్యాదు చేశాడు. అంజయ్య ఫొటోను చూసిన పోలీసులు గాయపడ్డ అతడిని ఉస్మానియాలో చేర్పించినట్లు చెప్పారు. దీంతో అంజయ్య కుటుంబ సభ్యలు ఆస్పత్రికి చేరుకుని అఫ్జల్గంజ్ పోలీసులు ఈనెల 4న వైద్యం కోసం చేర్పించిన వ్యక్తిని తమ తండ్రిగా భావించి మూడు రోజుల పాటు సపర్యలు చేయగా ఈనెల 8న ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈమేరకు అఫ్జల్గంజ్ పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు సైతం చేసేశారు. ఆదివారం అంజయ్యకు దశదిన కర్మ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో అతడు బతికే ఉన్నాడన్న సమాచారం అందడంతో కుటుంబమంతా ఆశ్చర్యపోయారు. అంజయ్యను గుర్తించింది ఇలా.. పదిహేడు రోజుల క్రితం అదృశ్యమైన అంజయ్య శనివారం బడీచౌడీలోని కూరగాయల మార్కెట్ వద్ద కూరగాయలు అమ్మే మంజుల అనే మహిళకు తారసపడ్డారు. అతడిని గుర్తించిన ఆమె అంజయ్య బంధువులకు సమాచారం అందించింది. అంజయ్య బతికే ఉన్నాడని, తాను చూసినట్టు గట్టిగా చెప్పడంతో అవతలివారు నమ్మి అక్కడకు చేరుకుని ఆశ్చర్యపోయారు. చనిపోయాడకున్న అంజయ్య బతికే ఉన్నాడని ఆనందంలో విషయాన్ని అఫ్జల్గంజ్ పోలీసులకు చేరవేశారు. అయితే, ఇప్పుడు అంజయ్య కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసిన వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మిగిలింది. -
కత్తితో దాడి చేసి దోపిడీకి యత్నం
స్థానికులు రావడంతో మంగళసూత్రం పడేసి పరార్ లంగర్హౌస్: పట్టపగలు దుండగుడు బరితెగించాడు. అపార్ట్మెంట్లోని 4వ అంతస్తులోకి వెళ్లి మహిళపై కర్రతో దాడి చేసి, కత్తితో గాయపర్చి మంగళసూత్రం దోచుకున్నాడు. స్థానికులు రావడంతో మంగళసూత్రాన్ని అక్కడే పడేసి పారిపోయాడు. లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. ఎస్సై అంజయ్య కథనం ప్రకారం... లంగర్హౌస్ బాపూనగర్ బస్టాప్ ప్రాంతం నిత్యం నగర శివార్లతో పాటు కర్ణాటక తదితర రాష్ట్రాల ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఈ బస్టాప్ ఎదురుగా ఉన్న ఓం చైతన్య సమృద్ధి అపార్ట్మెంట్ 4వ అంతస్తులోని 303 ఫ్లాటులో ఐఐఐటీఉద్యోగి, ప్రముఖ సంగీతకారుడు దేవీప్రసాద్, సుధారాణి దంపతులు నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30కి దాదాపు 25 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని యువకుడు అపార్ట్మెంట్లోకి వచ్చి దేవీప్రసాద్ ఫ్లాటు తలుపు తట్టాడు. రోజు అదే సమయంలో దేవీప్రసాద్ ఇంటికి వస్తుండటంతో ఆయనే అనుకొని భార్య సుధారాణి తలుపు తీసింది. తనతో తెచ్చుకున్న కర్రతో వెంటనే ఆ దుండగుడు ఆమె తలపై కొట్టాడు. అంతటితో ఆగకుండా పిడిగుద్దులు గుద్దుతూ గాయపరిచాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. కత్తితో చేతిని గాయపరిచి.. ‘‘అరిస్తే చంపేస్తా’నంటూ మెడపై కత్తి పెట్టాడు. తర్వాత ఆమె మెడలోని 3 తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అలికిడికి చుట్టు పక్కల ఫ్లాట్ల వారు బయటకు రావడంతో గమనించిన దొంగ మంగళసూత్రాన్ని అక్కడే పడేసి మెట్ల మీదుగా పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ సుధారాణిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. భాదితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.