
కర్రలు, రాడ్లతో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
ముఖాలకు ముసుగులు వేసుకుని, బనియన్లు.. చెడ్డీలు ధరించిన గ్యాంగ్ ఒకటి మధ్యప్రదేశ్ గ్రామాల్లో హల్చల్ చేస్తోంది.
ముఖాలకు ముసుగులు వేసుకుని, బనియన్లు.. చెడ్డీలు ధరించిన గ్యాంగ్ ఒకటి మధ్యప్రదేశ్ గ్రామాల్లో హల్చల్ చేస్తోంది. తేతుల్లో కర్రలు, రాడ్లు పట్టుకుని 12 మంది సభ్యులున్న కుటుంబాన్ని బందీలుగా చేసి ఆ ఇంట్లో దోపిడీకి పాల్పడింది. సుమారు 8-10 మంది సభ్యులున్న ఈ గ్యాంగ్ ఒక ఇంట్లోకి ప్రవేశించి, అక్కడున్న ముగ్గురు సోదరులను కొట్టి, మగవాళ్లందరినీ ఒక గదిలో బంధించారు. తర్వాత మహిళలందరినీ వరుసలో నిల్చోబెట్టి వారి వద్ద ఉన్న బంగారాన్ని వలిచేసుకున్నారు. తర్వాత ఇంట్లో ఉన్న నగదు, మిగిలిన నగలను కూడా దోచుకుని అక్కడినుంచి పారిపోయారు. కోలార్-మిస్రాడ్ నగరాల సరిహద్దులలో గల హిన్నోటియా ఆలం అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది.
గ్యాంగ్ సభ్యులు పారిపోగా కేదార్ పెద్ద కొడుకు ఎలాగోలా తప్పించుకుని గ్రామస్తుల సాయం కోరాడు. వాళ్లంతా చెడ్డీ బనియన్ గ్యాంగ్ సభ్యులే అయి ఉంటారని గ్రామస్తులతో పాటు పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. వాళ్లు సాధారణంగా ఈ నెలలోనే ఎక్కువగా దోపిడీలకు పాల్పడుతుంటారు. దాదాపు గంట పాటు ఇంట్లోనే ఉండి, బీరువాలు పగలగొట్టి, ఇల్లు నలుమూలలా గాలించి మొత్తం ఇంట్లో ఉన్న నగదు, నగలు అన్నింటినీ తీసుకెళ్లిపోయారు. బాధితుల్లో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. కేదార్, రాకేష్, సూరజ్, వాల్ల భార్యలు అనిత, రేఖ, దీపిక, వాళ్ల పిల్లలు అంతా కలిసి పొలం దగ్గరలో్ ఉన్న ఇంట్లోనే ఉంటారు. మరో సోదరుడు విజయ్ మాత్రం గ్రామంలో వేరు కాపురం ఉంటున్నాడు. దొంగల దాడిలో సోదరులు ముగ్గురికీ గాయాలయ్యాయి. మహిళలు ఒక గదిలో దాక్కునేందుకు ప్రయత్నించినా, తలుపులు పగలగొట్టుకుని మరీ ఆ గదిలోకి దొంగలు వెళ్లారు.