విచారణ చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం | Ward Members Commits Suicide Attempt On Inquiry | Sakshi
Sakshi News home page

విచారణ చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం

Apr 25 2018 12:38 PM | Updated on Apr 25 2018 12:38 PM

Ward Members Commits Suicide Attempt On Inquiry - Sakshi

హసన్‌పర్తి: ఏఈతో వార్డు సభ్యుడి వాగ్వాదం

హసన్‌పర్తి: పనులపై విచారణ చేస్తే ఆత్మహత్య చేసుకుంటామని వార్డు సభ్యులు హెచ్చరించారు. ఈ మేరకు ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో విచారణకు వచ్చిన అధికారులు వెనుదిగిరారు. వివరాల్లోకి వెళితే.. హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామంలో వివిధ పనుల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని వెంటనే విచారణ జరపాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గిన్నారపు రోహిత్‌ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ వరంగల్‌ అర్బన్‌ జిల్లా డీఈఈ సునీత, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎల్కతుర్తి సబ్‌ డివిజన్‌ డీఈఈ శ్వేతలను విచారణాధికారిగా నియమించారు. ఈ మేరకు మంగళవారం వారు విచారణకు రాగా అప్పటికే అక్కడ ఉన్న నలుగురు వార్డుసభ్యులు విచారణను అడ్డుకున్నారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం..
గ్రామసర్పంచ్, ఎంపీటీసీ సభ్యుల వల్ల గ్రామాభివృద్ధి కుంటుపడిందని వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మద్య ఉన్న వైరం వల్ల గ్రామంలో అభివృద్ధి జరగడం లేదని పేర్కొన్నారు.

గో–బ్యాక్‌ అంటూ నినాదాలు..
విచారణ చేపట్టొదని వార్డు సభ్యులు డిమాండ్‌ చేశారు. గో–బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో సీతంపేటలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అధికారులు విచారణ చేపట్టకుండా వెనుదిరిగారు.

రూ.55 లక్షల అవినీతి..
సీతంపేటలో రూ.55లక్షల అవినీతి జరిగిందని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 1100 మీటర్ల పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా కేవలం 340 మీటర్లు మాత్రమే పైప్‌లైన్‌ వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మురికికాల్వలు నిర్మించి ఒకే పనికి రెండు బిల్లులు డ్రా చేశారని పేర్కొన్నారు. వీటిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు.

విచారణను అడ్డుకున్నారు
కలెక్టర్‌ ఆదేశాల మేరకు పైప్‌లైన్‌ల నిర్మాణంపై విచారణ చేపట్టడానికి వెళ్లాం. కాగా, కొంతమంది వార్డుసభ్యులు అడ్డుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటామని కిరోసిన్‌ పోసుకున్నారు. దీంతో వెనుతిరిగాం.    – హంజ, ఏఈ

Advertisement
 
Advertisement
Advertisement