
రైతుల హక్కులు కాపాడేందుకే..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అర్ధం లేని వాగ్ధానాలతో రైతులను మోసం చేయడం తగదని, కేఎల్ఐ మూడో లిఫ్ట్ పనులు ప్రారంభం కాకుండానే పనులు..
నాగర్కర్నూల్రూరల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అర్ధం లేని వాగ్ధానాలతో రైతులను మోసం చేయడం తగదని, కేఎల్ఐ మూడో లిఫ్ట్ పనులు ప్రారంభం కాకుండానే పనులు ప్రారంభించినట్లు చెప్పడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, నాగం జనార్దన్రెడ్డి అన్నారు. రైతుల హక్కులను కాపాడేందుకే ఈ నెల 17న స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం స్థానిక పీఆర్ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు కేఎల్ఐ పనులు ప్రారంభమైనట్లు చెప్పుకోవడం సరైంది కాదన్నారు.
వాప్తవానికి అక్కడ పనులు చేయాల్సింది గామన్ ఇండియా కంపెనీ అయితే, ఆ కాంట్రాక్టర్ ఇంతవరకు ప్రాజెక్టును పరిశీలించలేదన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్టర్కు అనుభవం, అర్హతలు లేవని పనుల్లో అక్రమాలపై 2005 నుంచి తాను క్వాలిటీ కంట్రోల్, ఏసీపీ, కాగ్, ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. తన ఫిర్యాదుల కారణంగానే రూ. 500కోట్లు కాగ్ రిటర్న్ కట్టమని చెప్పిందని, సత్తిరెడ్డిని జైలుకు పంపింది కూడా తన ఫిర్యాదుల కారణంగానేనన్నారు. ప్రాజెక్టు నాణ్యతపై తానెప్పుడూ రాజీ పడలేదన్నారు.
ఈ ప్రాజెక్టు రైతుల హక్కని, 52 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా నేటికి పూర్తి చేయకపోవడం రైతులను మోసగించినట్లేనన్నారు. 2004 సెప్టెంబర్ 25న టెండర్లు పిలిచి ప్రాజెక్టు నిర్మాణానికి *2990 కోట్లుగా నిర్ధారించారని, ఇప్పటికి *2739 కోట్లు ఖర్చయినా పనులు పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం పనులు నిర్వహిస్తున్న దీపిక కన్స్ట్రక్షన్ కంపెనీకి పనుల్లో అనుభవం, అర్హత లేవని, వారు పనులు కొనసాగిసే మరో ఐదేళ్లకు కూడా పూర్తి కావన్నారు.
ఇంకా 50వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేయాల్సి ఉందన్నారు. తక్షణమే పనులను గామన్ ఇండియాకు అప్పగించి 15 రోజులకోసారి నివేదికను తెప్పించుకుంటూ వేగవంతం చేయాలన్నారు. జూన్, జులై నాటికి మూడో లిఫ్ట్ ద్వారా రెండు మోటార్లు నడిపించి నీటిని పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 17 లోపు పనులకు సరిపడా మెటీరియల్ అక్కడికి తీసుకురావటంతోపాటు రోజుకు 500 క్యూబిక్ మీటర్ల పని జరగాలని, అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈనెల 16న నాగర్కర్నూల్లో నిర్వహించనున్న అఖిల పక్ష సమావేశానికి ఇంజనీర్లను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 17న ఉదయం 10గంటలకు కేఎల్ఐ మూడో లిఫ్ట్ ప్రాజెక్టు వద్దకు వెళ్లి అక్కడి నుంచి నేరుగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరానికి చేరుకుని దీక్ష ప్రారంభిస్తానని అన్నారు. ఈ దీక్షను ఈ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలన్నారు.