‘బీసీలకు సీట్లివ్వకుంటే దాడులే’
హైదరాబాద్: బీసీలకు సీట్లు కేటాయించడంలో అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని, జనాభా ప్రాతిపదికన 65 సీట్లు కేటాయించని పార్టీల ఆఫీసులపై దాడులు చేస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గంగపుత్ర మహాసభ నిర్వహించిన రాజకీయ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు.
టీఆర్ఎస్ ప్రకటించిన 105 సీట్లలో 20 మంది, కాంగ్రెస్ కేటాయించిన 65 సీట్లలో 15 మంది బీసీలకు మాత్రమే సీట్లిచ్చారని విమర్శించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, నాయకులు గుజ్జ కృష్ణ, పద్మ, సాయి, సూర్యప్రకాశ్ పాల్గొన్నారు.