ఏం.. కష్టమొచ్చిందో..! | mother two children died in Nidamanuru | Sakshi
Sakshi News home page

ఏం.. కష్టమొచ్చిందో..!

Jul 19 2015 12:00 AM | Updated on Sep 3 2017 5:45 AM

కుటుంబ కలహాలో.. మరో కారణమో తెలియదు కానీ ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

రేకులగడ్డ (నిడమనూరు): కుటుంబ కలహాలో.. మరో కారణమో తెలియదు కానీ ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన రేకులగడ్డలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  రేగులగడ్డకు చెందిన నాయినాని గంగరాజుకు అదే మండలం వల్లభాపురానికి చెందిన లక్ష్మితో   14సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ప్రశాంత్(12), యమున(9) పిల్లలున్నారు. ఉన్నట్టుండి శనివారం సాయంత్రం 4,5 గంటల ప్రాంతంలో లక్ష్మి పురుగులమందు తాగి ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి గడియ వేసుకుంది. ఆమె మామ తలుపు తట్టి ఏమైందని అడిగితే చెప్పలేకపోయింది. అప్పుడే అపస్మారకస్థితిలోకి వెళుతున్న ఆమెను పిల్లలు ఏరి అని గట్టిగా అడిగితే బావిలో అంటూ.. ఆపై ఏమీ చెప్పలేకపోయింది. అనుమానం వచ్చి సమీపంలోని బావిలోకి వెళ్లి చూడగా చిన్నారుల మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. గ్రామస్తులు వెంటనే బావిలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. అపస్మారకస్థితిలోకి వెళ్తున్న లక్ష్మిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
 
 కన్నీటి పర్యంతమవుతున్న గ్రామస్తులు
 బావిలో నుంచి తీసిన చిన్నారుల మృతదేహాలు చూసిన గ్రామస్తులు కన్నీటి పర్యం తమవుతున్నారు. ప్రశాంత్‌కు ఇటీవలనే గురుకుల పాఠశాలలో సీటు వచ్చినట్లు గ్రా మస్తులు తెలిపారు. ఏ కోపం, ఆవేశం ఉన్నా బడ్డలను చంపుకుని ఇప్పుడు ఏం సా ధిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని రాత్రి 9గంటలకు హాలియా సీఐ పార్థసారథి, నిడమనూరు ఎస్‌ఐ నర్సింహారాజు పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
 
 గతంలోనూ..
 లక్ష్మి గతంలోనూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే అప్పుడు కుటుంబ సమస్యలు కావని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం సంఘబంధానికి సంబంధించిన రూ.25వేలు బ్యాంక్ నుంచి తీసుకుని ఆటోలో వస్తుండగా ఎక్కడో పడిపోయాయి. పోయిన రూపాయలు ఆచూకీ దొరకకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స చేయించడంతోప్రాణాలతో ఇంటికి వచ్చిందని, ఇప్పుడేమో ఇద్దరి పిల్లల ప్రాణాలు తీసి, తను కూడా తీసుకోబోయిందని రోదిస్తూ కుటుంబసభ్యులు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement