వివాదానికి దారితీసిన అవిశ్వాసం | DCO escape form management of special meeting | Sakshi
Sakshi News home page

వివాదానికి దారితీసిన అవిశ్వాసం

Aug 9 2014 1:04 AM | Updated on Sep 2 2017 11:35 AM

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అవిశ్వాసం అంశం కొత్త వివాదానికి దారితీస్తోంది.

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ అవిశ్వాసం అంశం కొత్త వివాదానికి దారితీస్తోంది. గురువారం నాటి డీసీసీబీ ప్రత్యేక సమావేశం విషయంలో గందరగోళం నెలకొనడంతో ఈ ప్రత్యేక సమావేశాన్ని రేపటికి వాయిదా వేశామని ప్రకటించిన జిల్లా సహకార అధికారి(డీసీవో) సూర్యచంద్రరావు.. శుక్రవారం డీసీసీబీ సమావేశం హాలు వైపే రాకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టిన చంద్రశేఖర్‌రెడ్డితోపాటు అవిశ్వాసానికి మద్దతిస్తున్న డెరైక్టర్లు మాత్రం శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం హాల్‌కు వచ్చారు.

డీసీవోతోపాటు అధికారులెవరూ అక్కడ లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో డీసీవో తన సెల్‌ఫోన్‌ను స్విచ్‌ఆఫ్ చేశారని డెరైక్టర్లు తెలి పారు. డీసీవో పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఉద యం నుంచి రాత్రి వరకు డీసీసీబీ కార్యాల యంలో ఆందోళనకు దిగారు. డీసీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చేవరకు కార్యాలయం నుంచి కదిలేది లేదని వారు స్పష్టం చేశారు.

 డీసీవో తీరు వివాదాస్పదమవుతోంది. ప్రత్యేక సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి న డీసీవో శుక్రవారం ఉదయం చేతులెత్తేయడం అవిశ్వాస తీర్మానం పెట్టిన డెరైక్టర్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. శుక్రవారం సాయంత్రం వరకు ఎలాంటి సమావేశం నిర్వహించకపోవడంతో చైర్మన్ దామోదర్‌రెడ్డిపై పెట్టిన అవి శ్వాస తీర్మానం వీగిపోయిందా? నెగ్గిందా? అని ఎటూ తేలలేదు. డీసీవో మాత్రం గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటన మినహా అవిశ్వాసంపై స్పష్టత ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కాగా, డీసీవో వైఖరిని నిరసిస్తూ డీసీసీబీ డెరైక్టర్లు రాత్రి 9.30 గంటల వరకు కార్యాలయం గదిలో ఉండి గడియ పెట్టుకుని నిరసన తెలిపారు.

 న్యాయ పోరాటం చేస్తాం : చంద్రశేఖర్‌రెడ్డి
 అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో డీసీవో వైఖరిపై న్యాయపోరాటం చేస్తామని వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. డీసీవో చైర్మన్‌కు వత్తాసు పలుకుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక సమావేశానికి 11 మంది డెరైక్టర్లు హాజరైతే కేవలం తొమ్మిది మంది సంతకాలు మాత్రమే తీసుకుని కోరం లేదనడం దారుణమని వివరించారు.

 ఎవరి ప్రయోజనాల కోసం డీసీవో ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం సమావేశం నిర్వహిస్తామని చెప్పిన జిల్లా సహకార అధికారి తప్పించుకుని తిరుగుతున్నారని అన్నారు. ఆయనపై కలెక్టర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement