ఇంకా మిస్టరీలే!

Crime Cases Still Pending in Hyderabad - Sakshi

ఇప్పటికీ కొలిక్కి చేరని సంచలనాత్మక కేసులు   

పాత కేసుల్లోనూ ఇంకా అంతుచిక్కనివి ఎన్నో  

టెక్నాలజీ ఉన్నా సవాల్‌ విసురుతున్న నేరగాళ్లు

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది... పోలీసింగ్‌ ప్రభావం పెరిగింది... కేసుల దర్యాప్తులో యాప్‌లు సైతం సహకరిస్తున్నాయి.. క్లూస్‌ టీమ్స్‌ పరిపుష్టంగా మారాయి.. వెరసి నగరంలో కేసులు తగ్గుతూ, శిక్షల శాతం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనూ మిస్టరీగా మిగిలిపోతున్న కేసులు పోలీసులకు సవాల్‌ విసురుతున్నాయి. గడిచిన రెండేళ్ళల్లో చోటు చేసుకున్న భారీ నేరాల్లో అనేకం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. వీటితోపాటు పాత సంచలనాత్మక కేసులు కూడా ఉన్నాయి.అలాంటి సంచలనాత్మక కేసుల్లో కీలకమైనవి...

ఆ దోపిడీ ముఠా ఆచూకీ లేదు...
జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెం.10లో, పాతబస్తీలో గత ఏడాది జనవరిలో విరుచుకుపడిన దోపిడీ ముఠాల గుట్టు వీడలేదు. జూబ్లీహిల్స్‌ బాలాజీ డిస్ట్రిబ్యూటర్స్‌  కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పని చేస్తున్న యాదగిరి నుంచి ముగ్గురు దుండగులు గత ఏడాది జనవరి 4 ఉదయం 11.35 గంటల ప్రాంతంలో వాహనం, సెల్‌ఫోన్లు దోచుకుపోయారు. ఈ ఉదంతం న్యూ సిటీలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లో చోటు చేసుకుంది. ఆ మరుసటి రోజే ఇదే ముఠా ఓల్డ్‌ సిటీలో ఉన్న బహదూర్‌పు ప్రాంతంలో పంజా విసిరింది. అక్కడి ప్రధాన రహదారిపై ఉన్న ఎస్బీఐ వద్దకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో దోచుకున్న ద్విచక్ర వాహనంపై ముగ్గురు దుండగులూ చేరుకున్నారు. ఇద్దరు వాహనంతో బయటే వేచి ఉండగా... మరొకరు బ్యాంకు లోపలకు వెళ్ళి నగదు లావాదేవీలు చేస్తున్న వారిని దాదాపు అర్ధగంటకు పైగా గమనించాడు. ఈ దృశ్యాలు బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రామ్నాస్‌పురాకు చెందిన విద్యార్థి అబ్దుల్లా తన వద్ద ఉన్న రూ.70 వేల ఎస్‌బీఐ బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసేందుకు మధ్యాహ్నం 3.40 గంటలకు వచ్చాడు. అప్పటికే బ్యాంక్‌లో డిపాజిట్లు స్వీకరించే సమయం మించిపోవడంతో బ్యాంక్‌ అధికారులు నగదు తీసుకోవడానికి నిరాకరించారు. దీంతో అబ్దుల్లా డబ్బుతో తిరిగి వెళ్తున్నాడు. ఇతడి వెనుకే బ్యాంక్‌ నుంచి బయటకు వచ్చిన దుండగుడు మిగిలిన ఇద్దరినీ కలిశాడు. ఈ ముగ్గురూ జూబ్లీహిల్స్‌లో దోచుకుపోయిన వాహనం పైనే అబ్దుల్లాను వెంబడించారు. అక్కడి పాలిటెక్నిక్‌ కళాశాలకు వెళ్లే మలుపు వద్ద అబ్దుల్లా ప్రయాణిస్తున్న వాహనాలను తమ వాహనాన్ని అడ్డుపెట్టి ఆపారు. తమ వద్ద ఉన్న కత్తితో బెదిరించి నగదును లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో అబ్దుల్లా ప్రతిఘటిస్తూ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకునే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన దుండగులు తమ వాహనంపై ఫలక్‌నుమ వైపు పారిపోయారు. ఈ రెండు కేసులూ ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు.

ఆ చిన్నారి ఎవరో తెలియలేదు...
ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద వెలుగులోకి వచ్చిన అత్యంత పాశవిక నరబలి కేసులో కొన్ని ప్రశ్నలు అలానే ఉండిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంలో హతురాలు రోజుల చిన్నారి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. చిలుకానగర్‌ వాసి రాజశేఖర్‌ (35) క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. కుటుంబంతో సహా మేడారం జాతర వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈలోపు ఆయన అత్త బాలలక్ష్మీ ఉతికిన వస్త్రాలకు ఆరేసేందుకు వారి డాబాపైన వెళ్ళారు. అక్కడ ఓ చిన్నారి తల కనిపించడంతో తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఈ విషయం రాష్ట్రం మొత్తం దావానలంగా వ్యాపించింది. ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన రాచకొండ పోలీసులు రాజశేఖరే నిందితుడిగా గుర్తించారు. అయితే ఆ చిన్నారి ఎవరు? మొండెం ఎక్కడ ఉంది? తదితర విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.  

ఆమెను చంపింది ఎవరు?
జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో అదృశ్యమైంది... రెండు రోజులకే ఎస్సార్‌ నగర్‌ లిమిట్స్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో శవమై కనిపించింది. అత్యంత దారుణంగా జరిగిన ఈ హత్య కేసులోనూ నిందితులు ఇప్పటి వరకు చిక్కలేదు. రెహ్మత్‌నగర్‌కు చెందిన నర్సమ్మ 2018 జూన్‌ 13న కల్లు తాగడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆమెను తీసుకురావడానికి అల్లుడు ఆనంద్‌కుమార్‌ ఆటోలో వెళ్లాడు. అయితే అప్పటికే నర్సమ్మ వెళ్లిపోయినట్లు తెలుసుకున్నాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఎర్రగడ్డ ఆస్పత్రి ఆవరణలో శవమై కనిపించింది. ఆమె కాళ్లకు ఉన్న వెండి కడియాల కోసం హత్య చేసిన దుండగులు వాటిని తీయడానికి కాళ్లను సైతం శరీరం నుంచి వేరు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్సార్‌నగర్‌ పోలీసులు ఆ రోజు నర్సమ్మ మరో మహిళతో కలిసి కల్లు కాంపౌండ్‌ నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఆధారాలను బట్టి మరో పురుషుడూ వీరికి జత కట్టినట్లు తేల్చారు. ఈ ముగ్గురూ ఎర్రగడ్డ ఆస్పత్రి ఆవరణలోకి వచ్చారు. సీన్‌ కట్‌ చేస్తే మరుసటి రోజు నర్సమ్మ శవంగా కనిపించింది. ఈ కేసు మాత్రం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఫలితంగా దారుణంగా హత్య చేసిన వాళ్లు స్వేచ్ఛగా సమాజంలో విహరించేస్తున్నారు.  

ఆ నేపాలీల జాడెక్కడ?
నార్త్‌జోన్‌ పరిధిలో నివసించే ఆర్మీ మాజీ ఉన్నతాధికారి ఇంట్లో దాదాపు రూ.2 కోట్ల సొత్తు చోరీ అయింది. ఈ నేరం చేసిన నేపాలీలు ఇప్పటి వరకు దొరకలేదు. ఇదిలా ఉండగా... గత నెల్లో అబిడ్స్‌ పరిధిలోని మరో ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసు కొలిక్కి రాలేదు. మహేష్‌నగర్‌ కాలనీ ఫతేసుల్తాన్‌ లైన్‌లో నివసించే సునీల్‌ అగర్వాల్‌ వ్యాపారి. ఇతడి ఇంట్లో నేపాల్‌కు చెందిన దంపతులు యజమానులు లేని సమయం చూసుకుని, పక్కా పథకం ప్రకారం మరికొందరితో కలిసి పంజా విసిరారు. ఈ కేసులో దాదాపు రూ.కోటి విలువైన సొత్తు దుండగుల పాలైంది. నేపాలీల ఆచూకీ కనిపెట్టడమూ కష్టసాధ్యంగా మారింది. ఇటీవల అబిడ్స్, నారాయణగూడ ఠాణా పరిధిల్లోనూ నేపాలీల నేరాలు చోటు చేసుకున్నాయి.  

వాంటెడ్‌గానే  అంతరాష్ట్ర ముఠా
పంజగుట్ట ఠాణా పరిధిలో చోటు చేసుకున్న దారి దోపిడీ కేసులో నిందితులుగా ఉన్న అంతరాష్ట్ర ముఠాలో అందరు సభ్యులు చిక్కలేదు. దీంతో పాటు ఆ డబ్బు కూడా రికవరీ కాలేదు. గత ఏడాది మేలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. తార్నాక ప్రాంతానికి చెందిన భార్యభర్తలు పద్మ, నర్సింగ్‌రావు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లో ఉన్న యాక్సిస్‌ బ్యాంక్‌లో రూ.2.1 లక్షలు డ్రా చేసుకుని వెళ్తుండగా నల్లరంగు పల్సర్‌పై వచ్చిన దుండగులు బ్యాగ్‌ లాక్కుని పారిపోయారు. దీనిపై పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలితో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను «అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే దుండగులు ఇద్దరు కాదు నలుగురని తేలింది. ముందు వచ్చిన ఇద్దరూ బ్యాగ్‌ లాక్కుని వెళ్ళిపోగా... వారి వెనుకే మరో వాహనంపై మరో ఇద్దరు వెంట వెళ్ళినట్లు గుర్తించారు.  ఇది పశ్చిమ బెంగాల్‌కు చెందిన గ్యాంగ్‌గా తేలింది. స్థానిక పోలీసులు వివిధ ప్రాంతాల్లో గాలించినప్పటికీ సూత్రధారులు దొరకలేదు.  ఏ పాత్రధారిని మాత్రమే పట్టుకోగలిగారు.  

నరికి పారేసినా దొరకని నేరగాళ్లు
మెహిదీపట్నం ప్రధాన బస్టాప్‌లో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నెం.12 ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్‌ నెం.3 వద్దకు 2010 ఆగస్టు 3 మధ్యాహ్నం టోలిచౌకి వైపు నుంచి ఓ ఇండికా కారు వచ్చి ఆగింది. తొలుత అందులో నుంచి ఓ యువతి కిందికి దిగింది. వెనక్కు వెళ్లి కారు డిక్కీ తెరిచి అందులో నుంచి సూట్‌కేస్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించింది. అయితే అది బరువుగా ఉండటంతో డ్రైవర్‌ను పిలిచి అతని సహాయంతో కిందికి దించి బస్టాప్‌లోకి చేర్చింది. అదే కారులోంచి దిగిన మరో మహిళతో కలిసి ఆ సూట్‌కేస్‌ పక్కనే బస్టాప్‌లో కాసేపు కూర్చుంది. అలా కాసేపు కూర్చున్న ఇద్దరూ అదే కారులో వెళ్లిపోయారు. ఆటోడ్రైవర్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సూట్‌కేస్‌ తెరిస్తే అందులో మహిళ శవం లభించింది.  
– సుల్తాన్‌బజార్‌ ఠాణా పరిధిలోని రామ్‌కోఠి చౌరస్తాలోని సిద్ధార్థ ఏజెన్సీస్‌  వద్ద 2010 డిసెంబర్‌ 20న ఓ మృతదేహం ‘ముక్కలుగా’ లభించింది. ఓ ప్లాస్టిక్‌ సంచిలో తల, కాళ్లు లేని మొండెం కనిపించింది. మృతదేహాన్ని బట్టి వయస్సు 16 నుండి 20 ఏళ్ళ మధ్య ఉంటుందని నిర్థారించారు. సర్జికల్‌ బ్లేడ్‌తో తల, కాళ్ళు కోసినట్లు స్పష్టమైంది. ఇది జరిగిన రెండో రోజున నారాయణగూడ ఠాణా పరిధిలో ఈ మృతదేహం కాళ్లు లభించాయి. దీని తల ఇప్పటికీ లభించకపోగా... కేసు సైతం కొలిక్కి రాలేదు.  

వనస్థలిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీలో ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో 2012 జూన్‌ 28న మరో డెడ్‌బాడీ బయటపడింది. నిలబెట్టి ఉన్న ప్లాస్టిక్‌ డ్రమ్‌ను చిత్తుకాగితాలు ఏరుకునే వ్యక్తులు గుర్తించారు. తీసుకువెళ్దామనే ఉద్దేశంతో దాన్ని పరికించి చూడగా డ్రమ్‌ పైభాగంలో తెలిరిచి ఉన్న ప్రాంతంలో ప్లాస్టిక్‌ గన్నీ బ్యాగ్‌లతో పార్సిల్‌ చేసి టేప్‌ వేసినట్లు గుర్తించారు. వీటిని తొలగించగా అందులో శవం ఉన్నట్లు బయటపడటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసూ కొలిక్కి చేరలేదు. వికలాంగుడైన హతుడిది నల్లగొండ, మహబూబ్‌నగర్‌ అయి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top