నగదు తక్కువ.. ఆస్తులు ఎక్కువ | Sakshi
Sakshi News home page

నగదు తక్కువ.. ఆస్తులు ఎక్కువ

Published Fri, Nov 16 2018 7:07 PM

Assets of Manchireddi Kishan Reddy - Sakshi

సాక్షి, ఇబ్రహీంపట్నం: అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అఫిడవిట్‌లో ప్రకటించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.  ఆయన పేరుపై రూ.1.56 కోట్లు, భార్య ముకుంద పేరుపై రూ.48.49 లక్షల చరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయనతో నగదు రూ.60 వేలు, భార్యతో రూ.40 వేలు ఉన్నట్టు చూపారు. ఒక బ్యాంకు ఖాతాలో రూ.31.43లక్షలు, మరో ఖాతాలో రూ.6,384 ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే భార్య పేరు మీద ఒక ఖాతాలో రూ. 26 వేలు, మరో ఖాతాలో రూ.5.11లక్షలు ఉన్నట్టు చూపారు. ఎల్‌ఐసీ బాండ్లు రూ.5లక్షల విలువగలవి, భార్యపేరుతో రూ. 10లక్షల విలువ గలవి ఉన్నట్టు పేర్కొన్నారు.  హోండా సిటీ సీఆర్‌వీ, బీఎండబ్ల్యూ, ఇన్నోవా వాహనాలు ఉన్నాయని తెలిపారు.

బంగారు ఆభరణాల విషయానికి వస్తే.. ఆయన పేరుతో 50 గ్రాములు, భార్య పేరుపై కిలో బంగారు, 3 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్టు చూపారు. ఇబ్రహీంపట్నంలోని పద్మావతి సర్వీస్‌ స్టేషన్‌లో వాటా(రూ.20లక్షలు) ఉందన్నారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే ఎలిమినేడు గ్రామంలో 29.39 ఎకరాలు, కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో 11.35ఎకరాలు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 16.28 ఎకరాలు.. మొత్తం 58.22 ఎకరాలు ఉండగా, మార్కెట్‌ విలువ రూ.11 కోట్లుగా చూపారు. అలాగే భార్యపేరుపై సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 12.36 ఎకరాలు, కీసర మండలం రాంపల్లిదాయరలో 4.09ఎకరాలు.. మొత్తం 17.15 ఎకరాలు ఉందని, దీని విలువ రూ.2.75 కోట్లుగా పేర్కొన్నారు. అలాగే తిరుమల హిల్స్‌లో 220 గజాల ఇల్లు, ఎల్మినేడులో మరో ఇల్లు, భార్య పేరుపై తిరుమల హిల్స్‌లో 320 గజాల ఇల్లు ఉందన్నారు. వాహనంపై ప్రస్తుతం రూ.14 లక్షల రుణం ఉన్నట్టు చూపారు. 

Advertisement
Advertisement