ఈ నాయకులు.. మాకొద్దు | 16000 above voter used none of the above | Sakshi
Sakshi News home page

ఈ నాయకులు.. మాకొద్దు

May 19 2014 1:37 AM | Updated on Oct 17 2018 6:06 PM

ఈ నాయకులు మాకొద్దంటూ పలువురు ఓటర్లు నోటా(నన్ ఆఫ్ ది ఎబో) మీట నొక్కారు. నిజామాబాద్ అర్బన్‌లో అతి తక్కువగా ఈ మీటను ఉపయోగించుకోగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా నోటాకు ఓటేశారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఈ నాయకులు మాకొద్దంటూ పలువురు ఓటర్లు నోటా(నన్ ఆఫ్ ది ఎబో) మీట నొక్కారు. నిజామాబాద్ అర్బన్‌లో అతి తక్కువగా ఈ మీటను ఉపయోగించుకోగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా నోటాకు ఓటేశారు. ఎలక్షన్ కమిషన్ ఎన్ని చర్యలు తీసుకున్నా చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. నచ్చిన అభ్యర్థులు ఎవరూ లేనందున తాము ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని సాకులు చెప్పేవారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బ్యాలెట్‌లో నోటాను చేర్చారు. ఈ సార్వత్రిక ఎన్నికలలో దీనిని చాలామంది వినియోగించుకున్నారు.

 నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో 7,766 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో 8,264 మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. ఇక నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో 695 మంది, నిజామాబాద్ రూరల్ స్థానంలో 2 వేల మంది, కామారెడ్డిలో 1,479, బాన్సువాడలో 1,313, జుక్కల్‌లో 1,430, బోధన్‌లో 1,397, ఆర్మూర్‌లో 1,435, బాల్కొండలో 1,525, ఎల్లారెడ్డిలో 2,212 మంది నోటాను వినియోగించుకున్నారు. జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సుమారు 16 వేలపైచిలుకు మంది ఓటర్లు నోటాకు ఓటేసి అభ్యర్థులెవరూ నచ్చలేదని చెప్పడం గమనార్హం.
 
 మహిళ మెడలోంచి చైన్ చోరీ
 నిజామాబాద్‌క్రైం, న్యూస్‌లైన్ : ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ మెడలోంచి దొంగలు బంగారు గొలుసును తెంపుకొని పరారయ్యారు. ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌ఓ నర్సింగ్ యాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన సరిత తన తోటి కోడలుతో కలిసి శనివారం నిజామాబాద్‌లోని ద్వారకానగర్‌లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో చూపించుకుని నడుచుకుంటూ వెళ్తుండగా వీరి వద్దకు బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చారు. సరిత మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును తెంపుకొని పారిపోయారు. ఆమె తేరుకుని అరిచేలోపే దొంగలు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement