-
వినబడకున్నా.. కనిపిస్తుంది! ఖమ్మం కుర్రాడి ఆవిష్కరణ!
సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహనాలు నడిపే చెవిటి, మూగ దివ్యాంగులకు శుభవార్త. వెనుక నుంచి వస్తున్న వాహనాల హారన్ శబ్దం వినిపించక దివ్యాంగులు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటివారి కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్కే రజలిపాషా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినూత్న హెల్మెట్ను తయారు చేశారు. వెనుక నుంచి వచ్చే వాహనాలు హారన్ మోగించినప్పుడు.. వెంటనే హెల్మెట్ ముందుభాగంలో దీపం వెలుగుతుంది. అలా వెలగడంతో ఆ కాంతి హెల్మెట్ అద్దంపై కనిపిస్తుంది.దీంతో అప్రమత్తమై వాహనాన్ని మరింత జాగ్రత్తగా నడపవచ్చు. హారన్ నుంచి వచ్చే ధ్వని తరంగాల ఆధారంగా ఈ హెల్మెట్ దీపాలు వెలిగేలా రూపకల్పన చేయడం విశేషం. -
రంగులు మార్చే చీర!
సాక్షి, సిరిసిల్ల, హైదరాబాద్: చీరను కదిలిస్తే చాలు.. రంగులు మారతాయి.. బంగారు, వెండి పోగులు మెరిసిపోతాయి. వనితల దేహంపై మెరిసిపోతాయి. బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో పట్టు చీర నేశాడు సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్. నెల రోజులపాటు మగ్గంపై శ్రమించి ఈ చీరను నేశాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిపోగులతోపాటు పట్టు పోగులతో రూపొందించాడు. ఈ చీర పొడవు 6.30 మీటర్లు ఉండగా.. 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువుంటుంది. ప్రముఖ వ్యాపారి దూరపూడి విష్ణు ఆర్డర్ మేరకు రూ.2.8 లక్షలు వెచ్చించి ఈ చీరను నేసినట్లు విజయ్కుమార్ తెలిపారు. ఈ చీరను మంత్రి కె.తారక రామారావు సోమవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్ను మంత్రి అభినందించారు. -
కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో బీటీ రోడ్డు..!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో సరికొత్త మార్పులు, ప్రయోగాలకు సిద్దిపేట కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణంలో మరో కొత్త విధానానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కాయిర్ జియో టెక్స్టైల్ (కొబ్బరినార) సాంకేతికతతో తొలిసారిగా రోడ్డు నిర్మించడంతో.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు ముందుగా నేలను చదును చేస్తారు. ఆ తర్వాత వివిధ సైజుల్లో ఉన్న కంకరను పొరలు పొరలుగా పోసి రోలర్ సాయంతో తొక్కిస్తారు. ఆ మార్గం గట్టిపడిందని నిర్ధారించుకున్న తర్వాత బ్లాక్టేప్ (బీటీ) మిశ్రమంతో రోడ్డును నిర్మిస్తారు. లేదంటే నేరుగా సిమెంట్ రోడ్డును నిర్మించడం ఇప్పటివరకు చూశాం. అయితే, ఇటీవల సిద్దిపేటలో కొత్తగా కొబ్బరినారతో రోడ్డును నిర్మించారు. కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో హుస్నాబాద్లో ఉమ్మాపూర్ నుంచి పోతారం(ఎస్) వరకు నాగారం మీదుగా 3.5 కి.మీ. నిడివితో బీటీ రోడ్డు వేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.2.31 కోట్లు కేటాయించారు. అయితే నేషనల్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్ఆర్ఆర్డీ) సూచనలతో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో ఈ రోడ్డు నిర్మించారు. ఈ విధానంలో తాగి పడేసిన కొబ్బరి బొండాల నుంచి నారును వేరు చేశారు. దీన్ని ఒక మిషన్లో వేసి జాలీ మాదిరిగా అల్లారు. ముందుగా నేలను చదునుగా చేసి రోలర్తో తొక్కించిన తర్వాత కొబ్బరి నారతో చేసిన జాలీని పరిచారు. దీనిపై 5 అంగుళాల సన్న కంకరను ఒక పొరగా వేసి.. దానిపై 6 అంగుళాల మందంతో కంకరను మరో పొరగా పోసి రోలర్తో తొక్కించారు. అనంతరం పై నుంచి బ్లాక్టేప్ డాంబర్ వేసి రోడ్డును వేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వేసిన ఈ రోడ్డును పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల పరిశీలించారు. ఇలాంటి రోడ్ల నిర్మాణానికి డబ్బు ఆదా అవుతుందని, నాణ్యత కూడా బాగా ఉంటుందని ఆయన చెప్పారు. ఖర్చు తక్కువ.. సాధారణ రోడ్ల నిర్మాణంలో 9 అంగుళాలు, 6 అంగుళాల మందంతో కూడిన కంకరను వినియోగిస్తారు. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా రోడ్డు వాడకంలోకి వచ్చాక వాహనాల బరువుతో కలిగే ఒత్తిడి వల్ల 9 అంగుళాల మందమున్న కంకర స్థానభ్రంశం చెంది రోడ్డు కుంగిపోతుంది. ఇలా వచి్చన పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిలుస్తుంది. దీని వల్ల బ్లాక్టేప్లో ఉండే పటుత్వం తగ్గుతుంది. ఫలితంగా రోడ్డులో గుంతలు ఏర్పడతాయి. అదీగాక, 15 అంగుళాల ఎత్తుతో రోడ్డు నిర్మించడం వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల కంటే రోడ్డు ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుంది. రోడ్డు నిర్మాణంలో కొబ్బరి పీచు వాడితే నిర్మాణ వ్యయం ప్రతీ కిలోమీటరుకు రూ.2 లక్షల వరకు తక్కువ అవుతుంది. దీంతోపాటు వృథాగా ఉంటూ దోమల పెరుగుదలకు కారణమయ్యే కొబ్బరి బొండాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. రోడ్డుపై వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా హుస్నాబాద్లో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించాం. రోడ్డు పైన పడే వర్షపు నీరు భూమిలోకి వెళ్లకుండా కొబ్బరి పీచులోకి ఇంకుతుంది. తర్వాత ఈ నీరు బయటకు రావడం వల్ల రోడ్డు చాలా రోజులు మన్నికగా ఉంటుంది. గుంతలు పడే అవకాశాలు తక్కువ. ఇదే విధంగా మరిన్ని రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం చెప్పింది. –సదాశివరెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -
వామ్మో..! చిరుత పులి పిల్లలా.. అడవి పిల్లులా ?
సాక్షి, నల్గొండ: దామరచర్ల మండలం ఇర్కిగూడెంలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో చిరుత పులి పిల్లలవిగా భావిస్తున్న పాదముద్రలు కలకలం రేపాయి. స్థాని కులు ఫారెస్ట్, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇవ్వడంతో శనివారం ఇర్కిగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అద్దంకి– నార్కట్పల్లి రహదారి పక్కన కృష్ణానది సమీపంలో రెండు చిరుతపులి పిల్లలు తిరుగుతున్నాయని కొందరు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, పోలీసు అధికారులు పరిసర ప్రాంతాలను గాలించారు. పాదముద్రలను పరిశీలించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అవి చిరుత పిల్లలు కావని అడవి పిల్లికి చెందిన పాదముద్రలుగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. రాత్రి వేళ అటవీ సిబ్బందిని నిఘా ఉంచామని, అవి పులి పిల్లలా, అడవిపిల్లులా అనేది నిర్ధారణ అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఆనంద్రెడ్డి, మిర్యాలగూడ సీఐ సత్యనారాయణ, వాడపల్లి ఎస్ఐ రవికుమార్, బీట్ ఆఫీసర్ ముఖేష్, బీట్ ఆఫీసర్లు ప్రవీణ్కుమార్, ఆజం పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 17 : BRS పునరుజ్జీవనం vs BJP విమోచనం
సెప్టెంబర్ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీలు కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది.. ఇది మా వాదన అంటూ ఒక్కో రకంగా చెప్పుకుంటున్నాయి. నిజంగా ఏం జరిగిందన్నది మరుగునపడి పార్టీలు తీసుకొస్తున్న కొత్త వాదన మీద వర్తమానం నడుస్తోంది. నాడు ఏం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తోన్న రాజకీయనాయకులు జరిగిన దానికి తమదైన భాష్యం చెప్పుకుంటున్నాయి. సాక్షికి ఇచ్చిన వ్యాసాల్లో రెండు విరుద్ధ భావాలను పంచుకున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. బీఆర్ఎస్ తరపున మంత్రి శ్రీనివాసగౌడ్, బీజేపీ తరపును విద్యాసాగర్రావు అందించిన ప్రత్యేక వ్యాసాలు ఇవి. BRS : పునరుజ్జీవనం : ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యమంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కృష్ణా–గోదావరీ జలాలను తెలంగాణలోని చేను చెల్కలను తడపడానికీ, చెరువులను నింపడానికీ, తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమానికీ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. అలా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రతిష్ఠాత్మకమైనది ‘పాలమూరు–రంగారెడ్డి.’ తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు.’ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష, ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా–గోదావరీ జలాలను చేను చెల్కలకు, చెరువులను నింపడానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమాన్ని ప్రథమ ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ఉన్న దక్కన్ పీఠభూమి శిఖరంగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ సీమగా మలిచే బృహత్తర కార్యక్రమాన్ని కేసీర్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సమాంతరంగా నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపు ప్రాతిపదికగా ప్రజల భాగ స్వామ్యంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ అపూర్వ ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసం పునరుజ్జీవం పొందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల దాష్టీకాల వలన తెలంగాణ సంక్షుభితంగా మారింది. పాలమూరు జిల్లాలో మానవ జీవన విధ్వంసం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ మనిషికి మనుగడకు మహా యుద్ధమే జరిగింది. ‘నీరు పల్లమెరుగు’ అనే కాలం చెల్లిన నమూనాతో తెలంగాణలో అత్యధిక చెరువులు ఉన్న ఉమ్మడి పాలమూరుపై నిర్లక్ష్యం చేసి బిరా బిరా కృష్ణమ్మను రానివ్వకుండా దగా చేశారు. తమ కళ్ళముందు పారుతున్న నీటిని కూడా చెరువులో నిల్వ కాకుండా చేశారు. అదే కృష్ణా– గోదావరులతో కోస్తా ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారు. గతి తప్పిన రుతువులు, బోర్ బావులతో వ్యవసాయం బావురుమన్నది. నీరు లభ్యం కాని స్థితిలో తీవ్ర దుర్భిక్షం నడుమ జీవితం నిత్య మరణంగా మారిన నేపథ్యంలో బతకడానికి దేశ విదేశాలలో వలస కూలీలుగా కట్టు బానిస జీవితం వెల్లబోస్తున్న దైన్యానికి పాలమూరు ప్రజానీకం నెట్టబడింది. మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ విజయతీరం వైపు చేర్చడానికి కేసీఆర్ చేపట్టిన అనేక ప్రజాస్వామ్య ఉద్యమ వ్యూహాల్లో భాగంగా 2009 లోక్సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి ఎన్నికైనారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, భోగోళిక స్థితిగతులను అవగాహన చేసుకున్నారు. జీవ వైవిధ్యానికి అనువుగా నల్ల రేగళ్లు, ఎర్ర చెల్కలు, ఇసుక భూములు ఉన్నాయక్కడ. నీరు అందితే దక్కన్ అన్నపూర్ణగా విలసిల్లే భవిష్యత్ ఉందని నిర్ధారించుకున్నారు. వలసలు వెళ్లిన ఇక్కడి ప్రజలు తిరిగి రావడమే కాదు, పక్క ప్రాంతాల నుండి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చే దశకు చేరుకోవాలని కోరుకున్నారు. ఈ ప్రాంత లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించిన సంతోషంలో కృతజ్ఞతను చాటుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలనుకున్నారు. పాలమూరును పడావు పెట్టి కృష్ణా నీటిని తరలించుకుపోయిన అప్పటి ప్రాంతీయ ద్రోహులను ఎండగట్టారు. 2014లో రాష్ట్ర సాకారం తర్వాత ఉద్యమ క్రమంలోనే రూపకల్పన చేసుకున్న ఉత్తర తెలంగాణ కోసం ‘కాళేశ్వరం’, దక్షణ తెలంగాణ కోసం ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కార్యాచరణ ప్రారంభించారు. చైనా నిర్మించిన సుప్రసిద్ధ ‘త్రీ గార్జెస్’ ప్రాజెక్ట్ కంటే గొప్పగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతికతతో, ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతాలతో కూడిన ‘పాలమూరు –రంగారెడ్డి' సాగునీటి ప్రాజెక్ట్కు 2015 జూన్ 11న శంఖు స్థాపన చేశారు. శ్రీశైలం ఎగువ భాగాన కొల్లాపుర్ మండలం ‘ఎల్లూరు’ గ్రామం వద్ద వర్షాకాలంలో 120 టీఎంసీల కృష్ణా జలాలను తరలిస్తూ పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30 వేల ఎకరాల భూమికి సాగునీరు, అలాగే 1,228 గ్రామాలకి త్రాగునీరు అందించడం దీని లక్ష్యం. కృష్ణమ్మ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా నార్లాపూర్ అంజనగిరి, ఏదుల వీరాంజనేయ, వట్టెం వెంకటాద్రి, కరివేన కురుమూర్తి జలాశయాల గుండా ప్రవహించి లిఫ్ట్ ద్వారా రంగారెడ్డిలోని ఉద్దండాపూర్, లక్ష్మీ దేవిపల్లి జలాశయాలకు చేరుతుంది. సెప్టెంబర్ 16న ‘రంగారెడ్డి–పాలమూరు’ ప్రాజెక్ట్ను కొల్లాపూర్ మండలంలో ‘సింగోటం’ వద్ద కేసీర్ ప్రజలకి అంకితం చేస్తున్నారు. నీటి శబ్దం, నీటి స్పర్శ మానవ భావోద్వేగాలకు ప్రతీకగా ఇక్కడ జరిగే ఉద్వేగ మహత్తర అంకిత సభకు ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల సర్పంచ్లతో పాటు అశేష ప్రజానీకం తరలి రానున్నారు. కృష్ణమ్మ నీటిని కలశాలలో తీసుకొని వెళ్లి ఆయా గ్రామ దేవాలయాల స్వామి పాదాలకు అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆనతి కాలంలోనే తెలంగాణలో 78 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయాన్ని పండుగగా మార్చే గౌరవప్రద జీవన భూమికను కేసీఆర్ పోషిస్తున్నారు. పరవళ్ళు తొక్కుతూ వస్తున్న నీటిని, కళ్ళ ముందునుంచి పారిపోతున్న నీటిని దోసిళ్ళతో ఒడిసిపట్టుకుంటున్న సంస్కృతిని సాగుచేస్తున్నారు. జీవన సంక్షోభం ద్వారా వచ్చిన ఆత్మన్యూనత స్థానంలో అభివృద్ధి సుభిక్ష ఆత్మ గౌరవ పతాకాన్ని జన మనో కేతనంగా మార్చిన యుగ కర్తగా నిలిచిపోతారు కేసీఆర్. పాలమూరు బిడ్డగా, ఇక్కడి ప్రజల విధేయుడిగా, కేసీఆర్ ఉద్యమ సహచరుడిగా, ప్రభుత్వ పాలనలో తన అనుచరుడిగా ఇతిహాసాన్ని తలపించే పాలమూరు పునరుజ్జీవన చరిత్ర నిర్మాణంలో నేనూ ఒకడిగా ఉండడం పరమానందంగా ఉంది. నిరసనోళ్ల శ్రీనివాస గౌడ్ - వ్యాసకర్త రాష్ట్ర మంత్రివర్యులు ------------- BJP : విమోచనం : హైదరాబాదు సంస్థానంలో ఉన్న వారందరూ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి సామాజికంగా, సాంస్కృతికంగా కలిసి వున్నారు. ఈ సంస్థానాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనీ, ఉర్దూను అధికార భాషగా రుద్దాలనీ నిజాం విషపూరితంగా ఆలోచించిన తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. భారత ప్రభుత్వం ‘పోలీసు చర్య’ను మొదలుపెట్టి, ప్రజలకు ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించింది. హైదరాబాద్ సంస్థాన విమోచనకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తే ‘భారత ప్రభుత్వ దౌత్యం, సామాన్య ప్రజల త్యాగం, యుద్ధం, విలీనం’ లాంటివి చరిత్ర పుటలలో కనబడుతాయి. ఆనాడు, తెలంగాణా, మరాఠ్వాడ, కర్ణాటకలో విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఇప్పటికీ వీటి భయానక ఛాయలు కనబడతాయి. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారికీ, నిజాముకూ మధ్య జరిగిన ఒప్పందానికి వ్యతిరేకంగా 1800 సంవత్సరంలోనే స్వాతంత్య్ర పోరాటం పురుడు పోసుకుంది. హిందువులు, ముస్లింలు కలిసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హిందూ – ముస్లిం ఐక్యతకు ఇది దర్పణం. ఆంగ్లేయులు సంపదను విచ్చలవిడిగా దోచుకొని దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేశారు. 1857 జూలై 17న మౌల్వి అల్లాఉద్దిన్, తుర్రేభాజ్ ఖాన్ నాయకత్వంలో వందలాది మంది హిందూ, ముస్లింలు కోఠీలో గల బ్రిటిష్ రెసిడెన్సీపై దాడిచేశారు. ఫలితంగా తుర్రేభాజ్ ఖాన్ను హతమార్చి శవాన్ని కోఠీలో వేలాడదీశారు. అల్లాఉద్దిన్ అండమాన్ జైళ్లో 1884లో కన్నుమూశారు. అప్పుడే పుంజుకున్న రాంజీ గోండ్ తిరుగుబాటు తరువాత, వీరులను ప్రభుత్వం నిర్మల్ పట్టణంలో మఱి -
నల్గొండ 'నాగిరెడ్డిపల్లి' లో ‘గేమ్ ఛేంజర్’ గా కనిపించిన హీరో రాంచరణ్..
నల్గొండ: భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల శ్రీ భీమరావ్ రైస్ గోదాములో హీరో రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా గోదాములోని కల్తీ బియ్యం పట్టుకునే సన్నివేశాలు చిత్రీకరించారు. శంకర్ దర్శకత్వంలో దిల్రాజ్ నిర్మాతగా ఎస్వీసీ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రంలోని గోదాముకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ శనివారం కూడా ఇక్కడే కొనసాగనుంది. -
హనుమాన్ విగ్రహం లభ్యం!
ఆదిలాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కన్నెపెల్లి శివారులోని వాగులోకి కొట్టుకువచ్చిన హనుమాన్ విగ్రహం బాలుడికి లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కన్నెపెల్లికి చెందిన స్వాతిక్ అనే బాలుడు పత్తి చేనులో పక్కనే ఉన్న వాగు పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటున్నాడు. అక్కడ రంగులతో కూడిన రాయి కనిపించగా వెళ్లి చూసే సరికి హనుమాన్ విగ్రహం ఉందని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం ప్రజలకు తెలియడంతో పెద్ద ఎత్తున విగ్రహాం వద్దకు చేరుకుని పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టిస్తామని గ్రామస్తులు తెలిపారు. -
ట్రాక్టర్ మునిగినా.. ఈదుతూ బయటపడిన రైతు..
మహబూబాబాద్: మానుకోటి జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు బంగారుగూడెం జీపీ పరిధిలోని చౌళ్ల తండా వద్ద పొలాలు దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ మున్నేరువాగు వరద నీటిలో గురువారం మునిగిపోయింది. బంచరాయి తండా గ్రామానికి చెందిన రైతు బానోత్ లచ్చిరాం చౌళ్ల తండాకు చెందిన పొలాలను దున్నేందుకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ఈక్రమంలో మున్నేరు వాగు ప్రవాహం పెరిగింది. రెండువైపులా నీరు వచ్చి చేరుతుండడంతో నీటిలో ట్రాక్టర్ మునిగిపోయింది. దీంతో లచ్చిరాం ట్రాక్టర్ను అక్కడే వదిలి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. నీటిలో ట్రాక్టర్ మునిగిపోయిన విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. -
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని చేపట్టిన సంకల్పాన్ని పలువురు మధ్య దళారులు చిన్నాభిన్నం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారుల నిర్లక్ష్యంతో పలువురు నీరు గార్చుతున్నారు. కొన్నె గ్రామంలో సోమవారం కోడిగుడ్లను పంపిణీ చేయగా అవి వండుకున్న వారు గుడ్లు కుళ్లిపోయి వాసన వస్తుందని, అవి తింటే అనారోగ్యం పాలుకావడం ఖాయమని వాపోతున్నారు. అధికారులు సంబంధిత కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ద్విచక్రవాహనం ఎక్కిన పాము..
ఖమ్మం: మండలంలోని పాలేరు గ్రామంలో ఓ వ్యక్తి టీవీఎస్ మోపెడ్ పైకి పాము ఎక్కడంతో సదరు వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాలేరు కిరాణా సరుకుల నిమిత్తం రాగా అతను సరుకులను కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే హ్యాండిల్పైకి పాము పాకుతూ కనిపించింది. దీంతో అతను కంగారుగా వాహనాన్ని నిలిపివేయగా అటుగా వెళ్తున్నవారు పామును చంపివేశారు. -
వరినారుతో మంత్రి కేటీఆర్కు బర్త్డే విషెస్!
కరీంనగర్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్కు ఆదివారం పాలకుర్తి జెడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన స్వగ్రామమైన లింగాపూర్లో ఇండ్ల నరేష్, స్వప్న పొలంలో వరినారుతో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ విషెస్ చెప్పి, కూలీలకు మిఠాయిలు పంచిపెట్టారు. -
భారీగా ఏసీపీ, ఇన్స్పెక్టర్ల ట్రాన్స్ఫర్.. బదిలీలకు ఈనెల 31 టార్గెట్..
వరంగల్: పోలీసుశాఖలో బదిలీలు భారీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి అనధికారికంగా ప్రారంభమైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ స్థాయి అధికారి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అధికారి వరకు ఎన్నికల ఎఫెక్ట్లో భాగంగా బదిలీలు జరుగుతున్నాయి. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనికి అనుగుణంగా ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించే పోలీస్ శాఖలో భారీగా మార్పులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. దానికి అనుగుణంగా ఎన్నికల నిబంధనలు వర్తించే పోలీస్ అధికారులను ఆయా నియోజకవర్గాలకు సాగనంపుతున్నారు. దీంతోపాటు ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలతో పాటు ఏమేరకు ఎన్నికల విధుల్లో ఉపయోగపడుతారనే కోణంలో క్షుణంగా పరిశీలించిన తర్వాతనే పోస్టింగ్లకు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల బదిలీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే ఇద్దరు డీసీపీలు పుల్లా కరుణాకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా, కర్రి పుష్పారెడ్డి తెలంగాణ కమాండ్ కంట్రోల్ విభాగం ఎస్పీగా బదిలీ అయ్యారు. వీరితో పాటు పరకాల, కాజీపేట, మామునూరు, క్రైం, ఏసీపీలు బదిలీ అయ్యారు. ఇన్స్పెక్టర్లు.. పరకాల, గీసుకొండతో పాటు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. దీంతోపాటు చాలా కాలంగా ఖాళీగా ఉన్న హసన్పర్తి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లకు ఖమ్మం, కొత్తగూడెం నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్లు కేటాయించారు. కోడ్ ఎఫెక్ట్లో భాగంగా సుబేదారిలోని రూరల్ మహిళా పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్, భరోసా ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. గత నాలుగైదు రోజుల్లో వరుసగా సబ్ ఇన్స్పెక్టర్లను వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేస్తూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనా«థ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేతల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు! ఎన్నికల ముందు ప్రశాంతత కోసం కొంత మంది అధికారులు లూపులైన్ల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరికొంత మంది ఎన్నికల కోడ్ వర్తించని చాలామంది అధికారులు సిఫారసు లేఖల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసమయంలో నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏమేరకు ఉపయోగపడతారని వారి అనుచర గణంతో లెక్కలు వేసుకుంటున్నారు. అధికారి పనితీరుతో పాటు సామాజిక అంశాన్ని ప్రధానంగా చూస్తున్నారు. ఒక్కో పోస్టింగ్ కోసం పదుల సంఖ్యలో అధికారులు క్యూ కట్టడం విశేషం. ఏసీపీ పోస్టుల కోసం కూడా అధికారులు ఒక్కో ప్రజాప్రతినిధిని పలుమార్లు కలుస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కొంత మంది అధికారులు వారి పీరియడ్ పూర్తి కాకపోయినప్పటికీ పోస్టింగ్ ఉంటుందో? ఉడుతుందో.. తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగం నెట్టుకొస్తున్నారు. వరంగల్ సబ్ డివిజన్లో మిల్స్కాలనీ, ఇంతేజార్గంజ్ వర్ధన్నపేట, ధర్మసాగర్, కమలాపూర్, నర్సంపేట, రఘునా«థపల్లి, నర్సంపేట రూరల్, నర్మెట్ట పోలీస్స్టేషన్లకు కొత్త అధికారులు రానున్నారు. ఈపోస్టింగ్ల కోసం ఇప్పటికే చాలా మంది అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి లెటర్లు పోలీస్బాస్కు అందించినట్లు సమాచారం. ఇందులో కొంత మందికి ఎలక్షన్ ఎఫెక్ట్ ఉండగా.. మరికొంత మంది ప్రవర్తన సరిగ్గా లేక మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అరెస్ట్లకు రంగం సిద్ధం! పోలీసు అధికారుల లెక్కల ప్రకారం వివిధ కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న సుమారు 180 మంది నిందితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరిని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఎస్హెచ్ఓలకు నిర్ధిష్టమైన ఆదేశాలు అందాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపనున్నారు. దీంతో పాటు ఆయా పోలింగ్స్టేషన్ల వారీగా మాజీలతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో ఇబ్బదులు సృష్టించిన వ్యక్తుల జాబితాలు కూడా ఆయా పోలీస్స్టేషన్లలో సిద్ధంగా ఉన్నాయి. తుపాకుల జాబితా రెడీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తుపాకుల లైసెన్స్లు 230 ఉన్నాయి. ప్రస్తుతం తుపాకుల లైసెన్స్ కలిగిన వ్యక్తులు వివిధ గొడవల్లో చిక్కుకున్న, కేసులు నమోదైన వారి లైసెన్స్లు రద్దు చేశారు. దీంతో కమిషనరేట్ పరిధిలో 180 వరకు లైసెన్స్ తుపాకులున్నాయి. ఎన్నికల ముందు వీటిని ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తుపాకుల లెక్కలను సైతం పోలీసు అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఈనెల 31 వరకు ప్రక్రియ పూర్తి చేస్తాం.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈనెల 31వ తేదీ వరకు ఎన్నికల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తాం. సొంత జిల్లా, సొంత నియోజవర్గం ఉన్న అధికారులతో పాటు చివరి నాలుగేళ్లలో మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసే అధికారులను నిబంధనల ప్రకారం బదిలీ చేస్తాం. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పని చేస్తున్న అధికారులను రెవెన్యూ జిల్లాను ప్రతిపాదికన బదిలీలు చేపడుతున్నాం. ఏసీబీ, క్రిమినల్ కేసులు ఉన్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతాం. – ఏవీ. రంగన్నాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
కస్తూరిబాలో పాము కలకలం!
ఆదిలాబాద్: మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఇద్దరు బాలికలు మూత్రశాలలకు వెళ్తుండగా పాము వారి కాళ్ల మధ్యలో నుంచి వెళ్లింది. దీంతో వారు ఆందోళనకు గురికావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు ప్రమాదం ఏమి లేదని తెలిపాడు. అనంతరం పరిశీలన కోసం భైంసాలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కసూ్తరిబా పాఠశాల ప్రిన్సిపాల్ను ప్రశ్నించగా విద్యార్థినులు పామును చూపి బయపడ్డారని, పరిశీలన కోసం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. -
మద్యం మత్తులో ఇద్దరు కానిస్టేబుళ్ల హల్చల్!
నల్గొండ: నేరేడుచర్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో హల్చల్ చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 19వ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్యగూడెంలో ఓ బెల్ట్షాపు నిర్వాహకుడికి, ఇద్దరు కానిస్టేబుళ్లకు గొడవ జరిగింది. అడ్డు చెప్పబోయిన మరో వ్యక్తిపై కానిస్టేబుళ్లు దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మద్యం తాగిన కానిస్టేబుళ్లు డబ్బుల విషయంలో ఘర్షణకు దిగారని, మద్యం తాగి డబ్బులు ఇవ్వకుండా గొడవ చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. వీరు ఇటీవల హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ను పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. -
ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఈఎన్టీ
ఆదిలాబాద్: 108 అంబులెన్స్లో ఓ నిండు గర్భిణికి ఈఎన్టీ ప్రసూతి చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. కెరమెరి మండలం పెద్ద సాకడ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయికి పురిటి నొప్పులు రాగా శుక్రవారం కుటుంబీకులు ఆమెను కెరమెరి పీహెచ్సీలో చేర్పించారు. కవల పిల్లలున్నారని, బీపీ కూడా అధికంగా ఉందని గుర్తించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్చేశారు. 108 అంబులెన్స్లో ఉట్నూర్కు తరలిస్తున్న క్రమంలో జైనూర్ మండలం ఉశేగాం సమీపంలో ఆమెకు నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్లోనే ఈఎన్టీ శ్రీనాథ్ డెలివరీ చేయగా కవలలకు జన్మనిచ్చింది. బీపీ అధికంగా ఉన్నప్పటికీ ధైర్యంగా డెలివరీ చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ శ్రీనాథ్ను పలువురు అభినందించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గంగుబాయికి ఇది రెండో కాన్పు. ఈఎన్టీ శ్రీనాథ్తో పాటు పైలెట్ రమాకాంత్ ఉన్నారు. -
మా డాక్టర్.. మాకు కావాలి!
ఆదిలాబాద్: జైనూర్ మండలంలోని ఉషెగాం ప్రాథమి ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజును అక్రమంగా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గిరిజనులు అందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆర్మీలో విధులు నిర్వహించి గతేడాది నుంచి ఉషెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజును అక్రమంగా లింగాపూ ర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేశారని ఆరోపించారు. మా డాక్టర్ మాకు కావాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఐదు రోజుల్లో రీపోస్టింగ్ ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినా జిల్లా వైద్యశాఖ కార్యాలయంలోని కిందిస్థాయి అధికారులు అక్రమంగా బదిలీ చేస్తూ వైద్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. లింగాపూర్లో పనిచేస్తున్న వైద్యుడిని కాగజ్నగర్ ప్రాంతానికి బదిలీ చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న డాక్టర్ రాజును అక్రమంగా ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ చొరవ తీసుకుని అక్రమ బదిలీని నిలిపి వేయాలని, లేకుంటే కలెక్టరెట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్, యూత్ పాల్గొన్నారు.