మదురై సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కేరళీయులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
Sep 19 2013 2:30 AM | Updated on Aug 30 2018 3:56 PM
సేలం, న్యూస్లైన్: మదురై సమీపంలో బుధవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కేరళీయులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం సమీపంలో కోట్టాన్కోడు గ్రామానికి చెందిన సురేంద్రకుమార్ కుటుంబ సభ్యులు తమిళనాడులోని దేవాలయాలను దర్శించేందుకు కారులో బయలుదేరారు. సురేంద్రకుమార్ (44), అనిల్ కుమార్ (40), సిబిరా జ్ (28), కచ్యూ (35), అరుణ్ (33), మధు (27), శ్రీజిత్ (29) తదితరులు కారులో ఉన్నారు.
అందరూ మంగళవారం మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకని బుధవారం వేకువజామున రామేశ్వరానికి బయలుదేరారు.మదురై జిల్లా నల్లమనాయకన్పట్టి గ్రామం వద్ద వెలుతుండగా కారు టైరు పేలిపోయింది. దీంతో వేగంగా వెళుతున్న కారు రోడ్డు డివైడర్ను ఢీకొని రోడ్డుకు అవతలి వైపు పల్లంలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్న సిబిరాజ్, అరుణ్, మధు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, సురేంద్రకుమార్, అనిల్ కుమార్, కచ్యూ, శ్రీజిత్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు మదురై జీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న కల్లికుడి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృత దేహాలను మదురై జీహెచ్కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రుల్లో శ్రీజిత్ పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.
Advertisement
Advertisement