విద్యార్థుల వీరంగం! | Students and college students attacked | Sakshi
Sakshi News home page

విద్యార్థుల వీరంగం!

Mar 6 2014 1:16 AM | Updated on Sep 2 2017 4:23 AM

నగరంలోని రెండు కళాశాలల విద్యార్థుల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. మూడు చోట్ల ఈ కళాశాలల విద్యార్థులు వీరంగం సృష్టించా రు.

సాక్షి, చెన్నై : నగరంలోని రెండు కళాశాలల విద్యార్థుల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. మూడు చోట్ల ఈ కళాశాలల విద్యార్థులు వీరంగం సృష్టించా రు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ కళాశాల విద్యార్థులపై మరో కళాశాల విద్యార్థులు దాడి చేయగా, వారు ఆ కళాశాలకు చెందిన బస్సులపై ప్రతాపం చూపేందుకు యత్నించారు. నగరంలోని ప్రభుత్వ , ప్రభుత్వ సహకారంతో నడిచే ప్రైవేటు ఆర్ట్స్ కళాశాలల విద్యార్థుల మధ్య తరచూ వివాదం రాజుకుంటూ వస్తోంది. కొన్ని మార్గాల్లో ఈ విద్యార్థులు శ్రుతి మించి వ్యవహరిస్తుంటారు. ఈ విద్యార్థుల తీరు ఆయా మార్గాల్లోని బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయా మార్గాల్లో పోలీసుల గస్తీ కూడా పెరిగింది. అయినా, విద్యార్థుల బాహాబాహీకి దిగడం, కత్తులు, రాడ్లతో దాడులు చేసుకునే సంస్కృతి పెరుగుతూనే ఉంది. బుధవారం శర్మ నగర్‌లో బయలుదేరి వివాదం మెరీనా తీరంలోని కామరాజర్ సాలై వరకు పాకింది. బస్సు డ్రైవర్లు ఎక్కడికక్కడ బస్సులను సైతం నిలిపే పరిస్థితి ఏర్పడింది.
 
 బస్సులో కొందరు విద్యార్థులు వీరంగం సృష్టించారు. శర్మ నగర్‌కు బస్సు చేరుకోగానే, మరి కొందరు విద్యార్థులు కత్తులు, రాడ్లు చేత బట్టి బస్సులో ఉన్న విద్యార్థులపై దాడికి యత్నించారు. దీంతో తమను రక్షించుకునేందుకు విద్యార్థులు బస్సు నుంచి దూకి రోడ్డుపై ఉరకలు తీశారు. సినీ ఫక్కీలో దాడి ఛేజింగ్ జరగడంతో అటు వైపుగా వెళ్లే వాహన చోదకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎంకేబీ నగర్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకోవడంతో వివాదం పెద్దది కాకుండా అడ్డుకోగలిగారు. 8 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పచ్చయప్ప, ప్రెసీడెన్సీ కళాశాల విద్యార్థులుగా వీరిని గుర్తించా రు. వీరి వద్ద విచారణ సాగుతున్న సమయంలో మెరీనా తీరంలోని కామరాజర్ సాలైలలో వివాదం రగిలింది.
 
 బస్సు ధ్వంసం: ప్రెసిడెన్సీ కళాశాల వద్ద కొందరు విద్యార్థులపై ఓ బృందం దాడికి దిగింది. ఇరు వర్గాలు రాడ్లు, దుడ్డు కర్రలతో రోడ్డుపైకి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు తమను రక్షించుకునేందుకు అటు వైపుగా వచ్చిన ఓ బస్సు ఎక్కేందుకు యత్నించారు. అయితే, ప్రయాణికులు వారిని లోనికి అనుమతించ లేదు. దీంతో ఆ బస్సుపై ఆ బృందం రాళ్ల వర్షం కురిపించడంతో ఓ చిన్నారి, డ్రైవర్ గాయపడ్డారు. వారిని  ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మెరీనా తీరం పోలీసులు అక్కడికి చేరుకుని కనిపించిన విద్యార్థులను త రిమి కొట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డ్రైవర్ మీద దాడితో రవాణా సంస్థ డ్రైవర్లు ఆందో ళనకు దిగి ఎక్కడి బస్సులను అక్కడే ఆపేశారు.  దాడి చేసిన విద్యార్థులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరగంట పాటుగా బస్సులు ఆగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు పోలీసుల హామీతో డ్రైవర్లు శాంతించారు. అయితే, ఉదయం జరిగిన వివాదానికి, మధ్యాహ్నం జరిగిన వివాదానికి సంబంధాలు ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వీరంగం సృష్టించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement