
ఇక ఐపీఎల్పైనే దృష్టి: రోహిత్
ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ తమను నిరాశపరిచినా ఇప్పుడు ఆటగాళ్ల దృష్టంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్...
ప్రపంచకప్ గెలవకపోవడం నిరాశ కలిగించింది
ముంబై: ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ తమను నిరాశపరిచినా ఇప్పుడు ఆటగాళ్ల దృష్టంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ను దక్కించుకోవడం పైనే ఉందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘ప్రపంచకప్ను నిలబెట్టుకోలేక పోవడం జట్టు ఆటగాళ్లను నిరుత్సాహపరిచింది. అయితే స్వదేశానికి తిరిగి వచ్చాక మా ముందు మరో సవాల్ ఉందని తెలుసు. అదే ఐపీఎల్. ఇప్పుడు మా ఆలోచనంతా ఈ టైటిల్ను ఎలా దక్కించుకోవడం పైనే ఉంది.
మేమంతా నాలుగు నెలలపాటు ఆసీస్ పర్యటనలో ఉన్నాం. ఇప్పుడు నెల రోజుల పాటు ఏకధాటిగా జరిగే లీగ్ కోసం మానసికంగా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే ఐపీఎల్ షెడ్యూల్ మాకు ఎప్పుడో తెలుసు. ఆటగాడిగా ప్రతీ టోర్నీలో రాణించాల్సిందే’ అని రోహిత్ అన్నాడు. లీగ్ ప్రారంభ మ్యాచ్లో ముంబై జట్టు కోల్కతాతో ఆడనుంది. డిఫెండింగ్ చాంప్ కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్)కు మంచి బౌలింగ్ యూనిట్ ఉందని, శాయశక్తులా వారిని ఓడించేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ చెప్పాడు.
తొలి మ్యాచ్ కాబట్టి ఇద్దరిపై ఒత్తిడి ఉంటుందన్నాడు. చాలామంది నైపుణ్యం కలిగిన దేశవాళీ ఆటగాళ్లను వేలంలో తీసుకున్నట్టు, టోర్నీలో వారు చక్కగా రాణిస్తారనే కోరికను వ్యక్తపరిచాడు. 2013 ఫైనల్లో ఈడెన్ గార్డెన్లోనే చెన్నైపై నెగ్గి టైటిల్ దక్కించుకున్నామని గుర్తుచేశాడు. తొలి మ్యాచ్లోనే గెలిచి టోర్నీని ఆత్మవిశ్వాసంతో ఆరంభిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. పేసర్ మలింగ ప్రస్తుతం ఫామ్లో లేకపోవడం తమనేమీ ఆందోళన పర్చడం లేదని, అతడేంటో ఇప్పటికే రుజువైందని చెప్పుకొచ్చాడు.