బ్యాడ్మింటన్‌ సీజన్‌కు వేళాయె

Malaysia Masters Tournament Will Start From 07/01/2020 - Sakshi

నేటి నుంచి మలేసియా మాస్టర్స్‌ టోర్నీ

కౌలాలంపూర్‌: గతేడాది ఆశించినరీతిలో రాణించలేకపోయిన భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి క్రీడాకారులు కొత్త సీజన్‌ను టైటిల్‌తో మొదలుపెట్టాలనే లక్ష్యంతో మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ సూపర్‌–500 టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. గత సంవత్సరం పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌ కావడం, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో టైటిల్‌ సాధించడం మినహా భారత్‌కు ఇతర గొప్ప ఫలితాలేవీ రాలేదు. మరో ఏడు నెలల కాలంలో టోక్యో ఒలింపిక్స్‌ జరగనుండటంతో సీజన్‌ ప్రారంభం నుంచే భారత క్రీడాకారులందరూ జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.

మలేసియా మాస్టర్స్‌ టోర్నీలో తొలి రోజు పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్‌లో మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌లు జరుగుతాయి. పురుషుల, మహిళల సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో భారత నంబర్‌వన్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి మలేసియాకు చెందిన ఓంగ్‌ యెవ్‌ సిన్‌–తియో ఈ యిలతో తలపడనుంది. మహిళల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో పీవీ సింధు, సైనా... పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సమీర్‌ వర్మ, సాయిప్రణీత్, శ్రీకాంత్‌ బరిలో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top