ఐపీఎల్‌ వేలంలో పెను సంచలనం

Jaydev Unadkat - Sakshi

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌కు సంబంధించి రెండో రోజు కొనసాగుతున్న వేలంలో పెను సంచలనం నమోదైంది. సౌరాష్ట్ర పేసర్‌ జయదేవ్‌ ఉనాద్కత్‌ రూ. 11.50 కోట్ల రికార్డు ధర దక్కించుకున్నాడు. గతేడాది ఐపీఎల్లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ కు ప్రాతినిథ్యం వహించి బౌలింగ్‌లో సత్తాచాటిన ఉనాద్కత్‌కు ఈసారి వేలంలో అత్యధిక మొత్తాన్ని చెల్లించి రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. ఉనాద‍్కత్‌కు కోసం పలు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడినప్పటికీ చివరకు రాజస్థాన్‌ రాయల్స్‌ అతన్ని దక్కించుకుంది.

అతని కనీస ధర రూ. 1.50 కోట్లు ఉండగా, అంతకు 10 రెట్లు అధికంగా అమ్ముడుపోవడం విశేషం. అయితే ఇప్పటివరకూ జరిగిన ఈ ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రెండో ఆటగాడిగా ఉనాద్కత్‌ నిలిచాడు. బెన్‌ స్టోక్స్‌(12.5 కోట్లు) అత్యధిక ధర పలికిన ఆటగాడు కాగా, ఆ తర్వాత స్థానంలో ఉనాద్కత్‌ నిలిచాడు. అయితే భారత్ నుంచి అత్యధిక ధర పలికిన ఆటగాడు ఉనాద్కత్‌ కావడం మరో విశేషం.

మరొకవైపు హైదరాబాద్‌ పేసర్‌ మొహ్మద్‌ సిరాజ్‌ ఐపీఎల్‌ వేలంలో ఫర్వాలేదనిపించాడు. అతని కనీస ధర రూ. కోటి ఉండగా, రూ. 2.60 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది.  ఇక కౌల్టర్‌ నైల్‌ రూ. 2.2 కోట్లకు ఆర్సీబీ దక్కించుకోగా, పేసర్‌ వినయ్‌ కుమార్‌ను రూ. 1 కోటి వెచ్చించి కేకేఆర్‌ సొంతం చేసుకుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top