విరాట్‌ కోహ్లి మరో రికార్డు

 Ind vs Ban: Kohli Slams Century In First Pink Ball Test In India - Sakshi

కోల్‌కతా: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డు సాధించాడు. నిన్నటి ఆటలో కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగుల్ని సాధించి రికార్డు నమోదు చేసిన కోహ్లి.. ఈరోజు ఆటలో సెంచరీ సాధించాడు. శుక్రవారం సాధించిన హాఫ్‌ సెంచరీని సెంచరీగా మలచుకున్న కోహ్లి.. భారత్‌లో జరుగుతున్న తొలి పింక్‌ బాల్‌ టెస్టులోనే శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఓవర్‌నైట్‌ ఆటగాడిగా దిగిన కోహ్లి 159 బంతుల్లో 12 ఫోర్లుతో సెంచరీ నమోదు చేశాడు. ఈ రోజు భారత్‌ ఇన్నింగ్స్‌ను రహానే-కోహ్లిలు ఓవర్‌నైట్‌ ఆటగాళ్లుగా కొనసాగించారు.

కాగా, రహానే(51) హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత పెవిలియన్‌ చేరగా, కోహ్లి నిలకడగా ఆడాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తైజుల్‌ ఇస్లామ్‌ వేసిన 68 ఓవర్‌ మూడో బంతికి రెండు పరుగులు తీయడం ద్వారా కోహ్లి మరో వ్యక్తిగత సెంచరీని నమోదు చేశాడు. ఇది కోహ్లికి టెస్టుల్లో 27వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 70వ శతకం. వన్డేల్లో ఇప్పటివరకూ కోహ్లి 43 శతకాలు సాధించిన సంగతి తెలిసిందే.  భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌(14), రోహిత్‌ శర్మ(21), చతేశ్వర్‌ పుజారా(55), రహానేలు పెవిలియన్‌ చేరారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top