టెస్టు మ్యాచ్‌ను చూసేందుకు రండి! | hca invites students to watch match between bangladesh and india | Sakshi
Sakshi News home page

టెస్టు మ్యాచ్‌ను చూసేందుకు రండి!

Feb 4 2017 10:31 AM | Updated on Sep 4 2018 5:07 PM

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ నెల 9 నుంచి జరిగే టెస్టు మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తోంది.

విద్యార్థులకు హెచ్‌సీఏ ఆహ్వానం  మ్యాచ్‌కు ఉచిత ప్రవేశం


 
ఉప్పల్/కాప్రా: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ నెల 9 నుంచి జరిగే టెస్టు మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు స్టేడియంలో స్నాక్స్, తాగునీరు సౌకర్యం కల్పించి మ్యాచ్ చూసే అవకాశం ఇస్తామని హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడు నరేందర్ గౌడ్ వెల్లడించారు. పిల్లల జాగ్రత్త కోసం స్టేడియంలో మహిళా వాలంటీర్లను కూడా నియమిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులను టెస్టుకు తీసుకురావాలని బీసీసీఐ చేసిన సూచనను తాము అమలు చేస్తున్నట్లు గౌడ్ తెలిపారు. నగరంతో పాటు జిల్లాల్లోగల గ్రామీణ పాఠశాలల విద్యార్థులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాల నుండి ఏ రోజు ఎంత మంది విద్యార్థులకు టికెట్లు కావాలనే విషయాలను తెలియజేస్తూ నగరంలోని జింఖానా మైదానంలో లేదా ఉప్పల్ హెచ్‌సీఏ కార్యాలయంలో లెటర్లను అందజేయాలని తెలిపారు. ఇతర పూర్తి వివరాలకు హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శి కె.విజయానంద్‌ను స్వయంగా లేదా సెల్ నెంబర్ 817920660లో సంప్రదించాలన్నారు.
 
 మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి: మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని నరేందర్ గౌడ్ తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లో జింఖానా మైదానంలో భారత్ ‘ఎ’తో బంగ్లాదేశ్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతుందని ఆయన వెల్లడించారు. టెస్టు మ్యాచ్‌కు సంబంధించి విసృ్తత ప్రచారం కల్పించే నిమిత్తం నగరంలో 30 హోర్డింగ్‌లను ఏర్పాటు చేశామని, ఎఫ్‌ఎం రేడియోలో సైతం ప్రకటనలిస్తున్నట్లు తెలిపారు. మ్యాచ్ టికెట్లను  eventsnow. com అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు తెలియజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement