కోహ్లి లేని భారత్‌కు కష్టమే: పాక్‌ క్రికెటర్‌

Hasan Ali Disappoint on Virat Kohli Absence From Asia Cup - Sakshi

ఇస్లామాబాద్‌: ఆసియాకప్‌లో పాల్గొనే భారత జట్టులో విరాట్‌ కోహ్ల లేకపోవడం తనను నిరుత్సాహానికి గురిచేసిందని పాకిస్తాన్‌ క్రికెటర్‌ హసన్‌ అలీ తెలిపాడు. ఏ బౌలరైనా ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయాలని ఆరాటపడటం సహజమని, తాను కూడా కోహ్లి వికెట్‌ తీసి తనదైన శైలిలో సెలబ్రేషన్స్‌ చేసుకోవాలనుకున్నానని పేర్కొన్నాడు. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి వికెట్‌ తీస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్ ఎంతో సంతోషపడేవారని వివరించాడు. 2017 చాంపియన్‌ట్రోఫి ఫైనల్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌లో అమిర్‌ బౌలింగ్‌లో కోహ్లి త్వరగానే ఔట్‌ కావడంతో అతడికి బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదన్నాడు. త్వరలోనే కోహ్లికి తన బౌలింగ్‌ సెగ చూపించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని అలీ తెలిపాడు. 

మా టార్గెట్‌ టీమిండియానే కాదు..
ఆసియా కప్‌లో తమ టార్గెట్‌ ఒక్క టీమిండియానే కాదని టోర్నీ గెలవడమే పాక్‌ లక్ష్యమని అలీ పేర్కొన్నాడు. కోహ్లి లేకపోవడం తమకు సానుకూలమైన అంశమని అభిప్రాయపడ్డాడు. కోహ్లి లేని భారత్‌కు ఆసియా కప్‌లో కష్టమేనని.. తమ చేతిలో ఓటమి తప్పదని అలీ పేర్కొన్నాడు. చాంపియన్‌ట్రోఫి ఓడిపోయిన అనంతరం తలపడే మ్యాచ్‌ కాబట్టి టీమిండియాపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని పాక్‌ బౌలర్‌ స్పష్టంచేశాడు. యూఏఈలోని వాతావరణం, మైదానాలు తమ దేశాన్ని తలపిస్తాయని.. చాలా సిరీస్‌లు ఇక్కడ ఆడిన అనుభవం ఉంది కాబట్టి టోర్నీ ఫేవరేట్‌ తమ జట్టేనని హసన్‌ అలీ తెలిపాడు. ఈ నెల 15న యూఏఈ వేదికగా ఆసియాకప్‌ ప్రారంభం కానుండగా.. 19న పాకిస్తాన్‌తో రోహిత్‌ సేన తలపడనుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top