‘పేమెంట్‌ పెంచినట్టున్నారు.. పవన్‌ రెచ్చిపోతున్నారు’

Vijaya Sai Reddy Slams On Chandrababu Naidu And Pawan Kalyan - Sakshi

ట్విటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

సాక్షి, హైదరాబాద్ ‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేమెంట్‌ బాగా పెంచడంతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తెగ రెచ్చిపోతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. శనివారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను ఏప్రిల్‌ 11 వరకు భరించక తప్పదని మండిపడ్డారు. ‘పేమెంటు బాగా పెంచినట్టున్నారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ తెగ రెచ్చిపోతున్నారు. తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీయ సమిధలుగా చేసి మాట్లాడుతున్నారు. కాసింత కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలేస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు భరించతప్పదేమో.’ అని ట్వీట్‌ చేశారు.

మీ అందరికీ క్లారిటీ ఉంది.. సంతోషం!
గెలిచే పార్టీనే ఎన్నికల్లో అన్ని పక్షాలు టార్గెట్ చేస్తాయని, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చివరకు కేఏ పాల్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ఖరారై పోయిందని అంగీకరిస్తున్నారని తెలిపారు. అందుకే వైఎస్‌ జగన్‌పైనే విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నారని, ఈ విషయం లోనైనా క్లారిటీ ఉన్నందుకు సంతోషమన్నారు. ఇక పవన్‌ కల్యాణ్‌ ఎవరి కోసం పనిచేస్తున్నారో.. టీడీపీని వెనకేసుకొస్తూ ప్రతిపక్షాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో.. రాష్ట్ర ప్రజలందరికి తెలుసన్నారు. ఆయనకు ఇల్లు కట్టిచ్చింది.. హెలికాప్టర్లు సమకూర్చింది.. ఎవరో తెలియనంత అమాయకులేం కాదన్నారు. ఆఖరికి జనసేన అభ్యర్థుల జాబితాను ఫైనల్‌ చేసింది కూడా చంద్రబాబే కాదా? అని ప్రశ్నించారు.

ఎన్నిసార్లు మోసం చేస్తావ్‌ పవన్‌..
‘ఎన్నిసార్లు మోసం చేస్తారు పవన్ కళ్యాణ్..? కిందటి ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలతాయని నిలబడలేదన్నారు. ఈసారి మీ యజమాని చెప్పినట్టు పోటీ చేసి ఓట్లు చీల్చాలనుకుంటున్నారు. ఒకసారి నమ్మించగలరేమో. కానీ ప్రతిసారీ మీ ప్యాకేజీ కుప్పిగంతులను అర్థం చేసుకోలేని అమాయకులేం కాదు ప్రజలు.’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top