
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 28 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుండగా.. మార్చి 12న పోలింగ్ జరగనుంది. మార్చి1 నుంచి నామినేషన్ల పరిశీలన జరగ్గా.. ఉపసంహరణకు మార్చి5న తుదిగడువుగా అవకాశం ఇచ్చారు. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చినట్లైంది.
ఏపీ మండలి నుంచి పి.నారాయణ, ఎ.లక్ష్మీశివకుమారి, పి.శమంతకమణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు రిటైరవుతుండగా.. తెలంగాణ శాసన మండలి నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ, టీ. సంతోష్కుమార్, మహ్మద్ సలీమ్, మహముద్ అలీలు తమ పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు.