
సాక్షి, అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ పోటీ లేకుండా రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ మీడియాకు తెలిపారు. ఖాళీ అయిన మూడు స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితి ఉండడంతో ఆ మేరకే రెండు పార్టీలు తమ అభ్యర్థులను పోటీలో నిలిపిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకపోయింది.
ఈ ఎన్నికతో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ వరుసగా రెండోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. టీడీపీ అభ్యర్థి కనకమేడల రవీంద్రకుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. రాజ్యసభకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ నుంచి గురువారం ధ్రువీకరణపత్రం తీసుకున్నారు.