
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ అసమర్థ పాలనను నిరసిస్తూ.. వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను కలుపుకొని దేశవ్యాప్తంగా ప్రజా పోరాటాలు చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మఖ్దూం భవన్లో గురువారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సురవరం మాట్లాడుతూ.. మతోన్మాదం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టి బీజేపీ అధికారం చెలాయిస్తోందన్నారు.
కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర సర్కారు విఫలమైందని విమర్శించారు. పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న ప్రధాని.. సామాన్య ప్రజలు, రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. భూ సంస్కరణల చట్టానికి తూట్లు పొడిచారని, గో రక్షక దళాల పేరుతో బలహీన వర్గాలు, మైనారిటీలు, దళితులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు.
కాగా, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులు జి.మల్లేశ్, పశ్య పద్మ, మల్లెపల్లి ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.