ఏపీఐఐసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రోజా
సాక్షి, అమరావతి: ఏపీఐఐసీ చైర్మన్గా నగరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రోజా ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళ పక్షపాతి. బడ్జెట్ చూసి, నవరత్నాలు చూసిన ఆ విషయం అర్థమవుతుంది. పారిశ్రామిక అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేది. పెట్టుబడులు పెట్టేవారికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. పారిశ్రామికీకరణకు బడ్జెట్లో ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. అన్ని జిల్లాల్లో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కృషి చేస్తాం. స్థానిక పరిశ్రమల్లో యువతకు 75శాతం చోటు కల్పిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. పారదర్వకంగా ఏపీఐఐసీ ద్వారా భూములు కేటాయింపు జరుగుతుంది.’ అని రోజా తెలిపారు.