
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీని రద్దు చేసి తన చేతకానితనాన్ని కేసీఆర్ బయటపెట్టుకున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగితే అవాంతరాలు ఉంటాయని, గవర్నర్ను కలసి కేసీఆర్ను ఆపద్ధర్మ సీఎంగా కొనసాగించొద్దని కోరతామన్నారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. గురువారం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ను కూడా శాసించే పద్ధతిలో కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. మంచి పాలన చేసే ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేయరని.. కేసీఆర్ అనేక సార్లు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. శాసనసభ రద్దు లేఖను ఆ పార్టీకి రాజకీయ మరణశిక్షగా చూస్తామన్నారు.