
సాక్షి, చెన్నై: త్వరలోనే రాజకీయాల్లో అడుగుపెడుతున్న సినీ నటుడు కమల్ హాసన్ వచ్చేనెల 21 నుంచి తమిళనాడు రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టబోతున్నారు. ప్రజల సుఖదుఃఖాలను, వారి అవసరాలను, స్థితగతులు తెలసుకోవడానికి, వారితో కలిసి గడపడానికి ఈ యాత్ర చేపట్టబోతున్నానని కమల్ ప్రకటించారు. తన జన్మస్థలం రామనాథపురం నుంచి యాత్రను ప్రారంభించాలనుకుంటున్నానని, ఆ తర్వాత మదురై, దిండిగల్, శివగంగై జిల్లాల్లో తన యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
తన యాత్ర ప్రారంభం సందర్భంగా ఫిబ్రవరి 21న పార్టీ పేరుతోపాటు విధివిధానాలు వెల్లడించాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు తమిళనాడు ప్రజలకు కమల్ ఒక లేఖ రాశారు. తమిళ ప్రజలు చూపుతున్న ప్రేమ, అభిమానాలకు ప్రతిగా వారికి ఏదైనా చేసేందుకే తాను రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నానని పేర్కొన్నారు. రాజకీయాల్లో నెలకొన్న యథాతథస్థితి బద్దలుకొట్టి.. ప్రజాసంక్షేమ పాలనను తీసుకురావాల్సిన అవసరముందని, ఇందుకోసం తలపెట్టిన తన యాత్రకు ప్రజలంతా అండగా నిలిచి.. మన దేశం, రాష్ట్రం సాధికారిత దిశగా కృషి చేయాలని కోరారు.