ఎగ్జిట్‌పోల్స్‌: బీజేపీకి ఎదురుదెబ్బ | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌పోల్స్‌: బీజేపీకి ఎదురుదెబ్బ

Published Fri, Dec 20 2019 8:02 PM

Jharkhand Exit Poll Results Congress And JMM Will Form Govt - Sakshi

రాం‍చీ: దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీకి మరో రాష్ట్రంలో అధికారాన్ని పోగొట్టుకోబోతోందా?. జార్ఖండ్‌లో వరుసగా మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న కమలనాథుల కలలు కల్లలు కానున్నాయా?. చిన్నరాష్ట్రం జార్ఖండ్‌లో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర తరహా రాజకీయ వాతావరణం ఏర్పడబోతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాన్నే వినిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. జార్ఖండ్‌ అసెంబ్లీ  ఎన్నికల్లో అధికార బీజేపీకి ఫలితాలు షాకిచ్చేలా కనిపిస్తున్నాయి. శుక్రవారం పోలింగ్‌ ముగిసిన అనంతరం పలు సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. జార్ఖండ్‌లో కాంగ్రెస్‌-జేఎంఎం కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. బీజేపీ 22-32 స్థానాలకే పరిమితం అవుతుందని, కాంగ్రెస్‌-జేఎంఎం కూటమికి 38-50 సీట్లను సొంత చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని పలు సంస్థలు అంచనా వేశాయి.

వీటికి భిన్నంగా హంగ్‌ వచ్చే అవకాశం కూడా ఉందంటూ పలు సం‍స్థలు స్పష్టం చేశాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 42 ఎమ్మెల్యే మద్దతు అవసరం కానుంది. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదల సర్వే బీజేపీ నేతలను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌ విజయంపై ధీమా వ్యక్తంచేశారు. మరోసారి తామే అధికారాన్ని చేపడతామని స్పష్టం చేశారు. కాగా జార్ఖండ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ముఖ్యనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు ముమ్మర ప్రచారం చేశారు. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సైతం జోరుగా ప్రచారం నిర్వహించారు

Advertisement
Advertisement