హస్తమే ఆ గుడిలో దేవత!

Congressmen throng temple of raised palms in Kerala during polls - Sakshi

ఇందిర సందర్శనతో వచ్చిన గుర్తింపు

బారులు తీరుతున్న కాంగ్రెస్‌ నేతలు

కేరళలోని పలక్కాడ్‌లో ‘కల్లెకులంగర ఎమూర్‌ భగవతి’ ఆలయం ఉంది.‘ కైపతి అంబలం’ అని కూడా పిలిచే ఈ ఆలయం నిజానికి దుర్గాదేవి గుడి. అయితే, గర్భగుడిలో దుర్గాదేవి విగ్రహం ఉండదు. దాని స్థానంలో ఆశీర్వదిస్తున్నట్టుండే రెండు అరచేతులు ఉంటాయి. ఆ చేతుల్నే దుర్గాదేవిగా ప్రజలు ఆరాధిస్తుంటారు. కాంగ్రెస్‌ పార్టీ చిహ్నం కూడా హస్తమే కావడంతో దానికీ దీనికీ ముడిపెట్టేశారు. గుడి కట్టి వందల ఏళ్లు అయింది. అయితే, 1982 నుంచి ఈ ఆలయం గురించి ప్రపంచానికి తెలియడం, భక్తుల సంఖ్య పెరగడం మొదలయింది. దానికి కారణం...ఆ సంవత్సరంలో ఇందిరాగాంధీ స్వయంగా ఈ ఆలయాన్ని దర్శించడం.1982, డిసెంబర్‌ 13న ఇందిరా గాంధీ ఈ గుడికి వచ్చి హస్తం రూపంలో ఉన్న దేవతను పూజించి వెళ్లారని అచ్యుతన్‌ కుట్టి చెప్పారు. విచిత్రమేమిటంటే ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఆ సంవత్సరమే హస్తం గుర్తును ఎన్నికల చిహ్నంగా ఎంపిక చేసుకుంది.

‘ఇక్కడి దుర్గాదేవి చాలా మహిమ గల దేవత. చుట్టుపక్కల వాళ్లందరికీ ఈ విషయం తెలుసు. అయితే, ఇందిరా గాంధీ వచ్చి వెళ్ళిన తర్వాత ఈ  ఆలయం గురించి దేశానికి తెలిసింది’అన్నారు అచ్యుతన్‌ కుట్టి. కేరళ మాజీ సీఎం కరుణాకరన్‌ ఇందిరాగాంధీని ఈ ఆలయానికి తీసుకొచ్చారని,  ఆమె తన పార్టీ గుర్తుగా హస్తాన్ని పెట్టుకున్నారని అప్పట్లో చెప్పుకునేవారని ఆయన అన్నారు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్‌ వాళ్లు ఈ ఆలయానికి పోటెత్తుతారని, వాళ్లు భారీగా కానుకలు కూడా సమర్పిస్తుంటారని ఆలయ మేనేజర్‌ మోహన్‌ సుందరన్‌ చెప్పారు. ఇలా అభయ హస్తాలే దేవతగా ఉన్న ఆలయం మన దేశంలో ఇంకెక్కడా లేదని కూడా ఆయన తెలిపారు. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top