కేసీఆర్‌ పగటి కలలు మానుకో..

BJP will come back to power, says Telangana BJP chief K Laxman - Sakshi

కేంద్రంలో సొంత బలంతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు

స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు పెట్టుకోం: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో బీజేపీ సొంత బలంతోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, నరేంద్రమోదీ ప్రధానిగా కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ మద్దతుతోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందని కేసీఆర్‌ చెప్పటం హాస్యాస్పదమని, ఇప్పటికైనా ఆయన పగటి కలలు కనటం మానుకోవాలని హితవు పలికారు. ఇక వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవటం లేదని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల భేటీ జరిగింది. 

ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతోందని, రాష్ట్రంలో గౌరవప్రదమైన సంఖ్యలో అభ్యర్థులు విజయం సాధిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలపై బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అభ్యర్థులను ముందుగానే గుర్తించాలని సూచించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని, అసెంబ్లీ కోర్ కమిటీలో దరఖాస్తులను పరిశీలించి, ఆ తర్వాత జిల్లా కోర్ కమిటీలో చర్చించి, పరిశీలకుల ఆధ్వర్యంలో తుది నివేదికను సిద్ధం చేయనున్నట్టు వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top